“అది విగ్రహం కాదు, ఒక విప్లవం. నవ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. భరత జాతికి, యావత్ ప్రపంచానికే జ్ఞాన చిహ్నం. అంబేద్కర్ స్ఫూర్తిని దశదిశలా చాటిన ఘనత సీఎం కేసీఆర్ది. ఏటా ఆ మహనీయుడి జయంతి రోజున అవార్డులు ఇవ్వాలన్న ఆయన నిర్ణయం తెలంగాణకు గర్వకారణం” అని వ్యాఖ్యానిస్తున్నారు దళిత మేధావులు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా అంబేద్కర్ ఆశయాలు నెరవేరలేదని, కానీ, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ ఓ అడుగు ముందడుగు వేశారని ప్రశంసిస్తున్నారు. దళితబంధు లాంటి పథకాలతో సామాజిక అసమానతలు తొలగించటానికి ప్రయత్నిస్తున్నారని కొనియాడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయానికి ఆ మహనీయుడి పేరు పెట్టడమే కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని రగిలించేలా ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉన్నత విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నదని చెప్పారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నిర్మించడంతో తెలంగాణ మాత్రమే కాకుండా యావత్ భారత జాతి నీరాజనాలు పడుతోందని, సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని కీర్తిస్తున్నారు. మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ వినూత్న పథకాలను అమలు చేస్తూ కేసీఆర్, దేశానికే మార్గదర్శకంగా మారారని అభిప్రాయపడుతున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : భారత రాజ్యాంగ నిర్మాత, భరతజాతి ముద్దుబిడ్డ, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడంపై దళిత మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అణువణువులో అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి మూర్తీభవించి ఉందని, అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్-3 ప్రేరణతోనే సీఎం కేసీఆర్ సకల జనులను ఏకం చేసి సుధీర్ఘ కాలం పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించారని, ఆ మహోజ్వల పోరాటానికి అంబేద్కర్ మహాశయుడి స్ఫూర్తే ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. ఆకాశ మంత ఎత్తులో విజ్ఞతను వివరిస్తూ వివేకాన్ని తట్టి లేపుతూ వివేచనకు కొత్త జీవం పోస్తూ నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడమే కాకుండా, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పాలన సాగుతోందని చెబుతున్నారు.
అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఆర్థికంగా చేయూతను అందించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని, రాష్ట్ర పాలనకు ఆయువుపట్టులాంటి సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్ అంబేద్కర్ అంటే తనకున్న అభిమానాన్ని పరిపూర్ణంగా చాటుకున్నారని స్పష్టం చేస్తున్నారు. అంబేద్కర్ పేరిట ఏటా జయంతి రోజున అవార్డులు ఇచ్చేందుకు 51 కోట్ల శాశ్వత నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయని చెబుతున్నారు. అవార్డును అందుకొనే వ్యక్తులు కూడా అదే స్థాయిలో కీర్తిని పొందుతారని, అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్న కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని కొనియడారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం తాడిత, పీడిత జాతులను ఏకం చేస్తూ జాతీయ స్థాయిలో మరో పోరాటానికి ముందడుగు వేసిన సీఎం కేసీఆర్ అంబేద్కర్ నుంచే ప్రేరణ పొందడమే కాదు, మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ దేశానికే దిక్సూచిగా మారారని అభిప్రాయపడుతున్నారు.
భారత జాతి గర్విస్తున్నది
కొందరు పాలకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అంబేద్కర్ను కొన్ని వర్గాలకే పరిమితం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా మనం వేసే ఓట్లతోనే మనల్ని బానిసలుగా మార్చారు. బానిస సంకెళ్లను తెంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మహనీయుని 125 అడుగుల విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేశారు. అంతే కాకుండా దేశ ప్రజల సమానత్వం కోసం పాటు పడిన వ్యక్తి అని దేశం గుర్తించేలా కృషి చేసిన కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని సాహసం ఆయన చేయడంపై భారత జాతి గర్విస్తున్నది. దళిత బహుజనుల పక్షాన ఆయనకు మేమంతా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. పార్లమెంటుకు ఆ మహనీయుని పేరు పెట్టాలని కేంద్రం చొరవ తీసుకోవాలని కోరుతున్నాం.
– పిట్టల దేవరాజ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లాధ్యక్షుడు
ఈ చైతన్యం దేశవ్యాప్తం కావాలి
భాష వేరే కావచ్చు, భావనలు వేరే ఉండవచ్చు. కానీ, తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ అంబేద్కర్, ఫూలే ఆలోచనా విధానాలకు దగ్గరగా ఉన్నవే. అంబేద్కర్ను ముందు పెట్టుకుని పనిచేయడం వల్ల ఆయన సిద్ధాంతాలు, ఆలోచనా విధానాలు ఆచరణలో పెట్టగలుగుతామని పాలకుల్లో ఒక విశ్వాసం కనిపిస్తున్నది. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఒక చారిత్రక ఘట్టం. ఇలాంటి అరుదైన విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల అంబేద్కర్ ఎవరు? ఆయన ఏం చెప్పారు? ఆయన ఆశయాలు ఏంటి? అనే విషయాలు ప్రజలు, ముఖ్యంగా రేపటి తరం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రజాస్వామ్యం, సమసమాజం, కుల వివక్ష, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలపై అంబేద్కర్ చేసిన ప్రసంగాలు, రచనలు ఎంతో గొప్పగా ఉంటాయి. అసమానతలు తొలగిపోవాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలో ఆయన చెప్పారు. ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ప్రజలు ఏం చేయాలో కూడా చెప్పారు. ఆయన ఆలోచనా విధానాలపై ఒక వైపు ప్రజల్లో చైతన్యం కలుగుతుంది. ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయనప్పుడు ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. ఇలాంటి ఆలోచనలు చేసిన అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు వల్ల అందరిలోనూ చైతన్యం వస్తుంది. అయితే విగ్రహాల వద్ద పండుగలు ఏ విధంగానైతే జరుపుకుంటున్నామో.. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు కూడా అంతే చొరవ చూపాలి. ఆ మహనీయుడి సిద్ధాంతాలను పాటించాలి. ఇప్పుడు తెలంగాణలో ఆరంభమైన ఈ చైతన్యం దేశవ్యాప్తం కావాలి.
– ప్రొఫెసర్ మల్లేశ్ సంకశాల, వైస్ చాన్స్లర్ (శాతవాహన యూనివర్సిటీ)
దేశానికి స్ఫూర్తి ప్రదాత సీఎం కేసీఆర్
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దార్శనికుడు అంబేదర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. దేశంలో సమానత్వం, స్వేచ్చ కోసం అంబేద్కర్ చేసిన త్యాగం, కృషి ముందుతరాలకు ప్రేరణగా నిలిస్తుంది. అంటరానితనాన్ని అనుభవించిన అంబేద్కర్ అనేక కష్టాలను అధిగమించి ప్రపంచ జ్ఞానిగా చరిత్రలో నిలిచిపోయారు. రాజ్యాంగంతో సమాజానికి క్రమశిక్షణాయుతమైన, స్వేచ్ఛాయుతమైన, ప్రగతిశీలమైన గమనానికి మార్గదర్శనం చేశారు. అంబేద్కర్ను ఒక వర్గానికి చెందిన నాయకుడిగా, మేధావిగా చిత్రీకరిస్తుండడం చాలా బాధాకరం. అంబేద్కర్ భారత జాతి మొత్తానికి ఒక రక్షకుడు.. ఆయన వల్ల ప్రతి వర్గం ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంది. సీఎం కేసీఆర్ నిలిపిన ఆ మహనీయుడి విగ్రహం ఒక వర్గానికి చెందిన నాయకుడిది కాదు. సర్వ వర్గాలకు నాయకుడైన మహానేతది. విగ్రహం ఏర్పాటుతో సీఎం కేసీఆర్కు దళితులపై ఉన్న ప్రేమే కాదు.. భారత సంవిధానంపై ఆయనకున్న మక్కువ, గౌరవానికి తార్కాణంగా నిలుస్తుంది. అంబేదర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న రాష్ట్రం తెలంగాణ. సీఎం కేసీఆర్ తలపెట్టిన అంబేదర్ మహా విగ్రహావిషరణ ఆయనలోని రాజకీయ పరిణతిని, సామాజిక, లౌకిక పాలన విలువల దృక్పథాన్ని సూచిస్తుంది. దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో ముందుకు వస్తున్న కేసీఆర్కు అంబేదర్వాదులు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తం చేయాలనే ఆయన ఆలోచనకు బహుజనులు ఎల్లకాలం రుణపడి ఉంటారు.
– పేట భాస్కర్, ప్రజా సంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు (కోరుట్ల)
దేశానికి దక్సూచి
రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ద్వారానే స్వరాష్ట్రం సాధించుకున్నాం. అందుకు కృతజ్ఞతగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయడం శుభపరిణామం. కొత్తగా నిర్మించిన సచివాలయానికి పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. కొందరి వాడే కాదు.. అందరి వాడు అన్న అభిప్రాయాన్ని జాతిలో నింపిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా పాలన అందిస్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా దళితబంధు పథకం ప్రవేశపెట్టలేదు. తెలంగాణలో తప్ప ఎక్కడా లేదు. దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలన్న ఆశయంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రికి దళితులంతా రుణపడి ఉంటారు. పార్లమెంటు భవనానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం.
– కొండికొప్పుల రవి, టీటీయూ జిల్లాధ్యక్షుడు, రాజన్న సిరిసిల్ల
125 అడుగుల విగ్రహం చారిత్రాత్మకం
దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్లో నిర్మించడమే కాకుండా కొత్త సచివాలయానికి ఆయన పేరు పెడతామనడం చారిత్రాత్మకం. ఈ విగ్రహం అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీకగా, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉంటుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా అంబేద్కర్ ఆశయాలు పూర్తిగా నెరవేరలేదు. మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం ఆలోచిస్తూ అంబేద్కర్ ఆశయాలకు ఓ రూపాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దళితబంధు ద్వారా దళితులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆలోచన ఇంత వరకు ఎవరూ చేయనిది. రాష్ట్రంలో అంబేద్కర్ పేరున ఏటా అవార్డుల ప్రదానోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడమే కాకుండా, అందుకోసం రూ.51 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం నిజంగా హర్షనీయం. అంబేద్కర్ ఆశయాల కొనసాగింపునకు కేంద్రంగా తెలంగాణను నిలిపినందుకు కృతజ్ఙతలు. అలాగే, ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని ప్రతి తరగతి గదిలో అంబేద్కర్ ఫొటో ఏర్పాటు చేయాలి. అంబేద్కర్ ఆశయాల పట్ల విద్యార్థులకు ప్రాథమిక విద్య దశ నుంచే అవగాహన కల్పించాలి.. “దేశం అభివృద్ధి చెందడమంటే.. అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.. సామాన్య పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి” అన్న అంబేద్కర్ సూక్తిని సీఎం కేసీఆర్ సాధించేందుకు తపిస్తున్నారు. ఆ తపనను తన పాలనలో చూపిస్తున్నారు. అంబేద్కర్ను గౌరవించుకోవడమంటే యావత్ జాతిని గౌరవించుకోవడం అన్న సీఎం కేసీఆర్ ఆలోచనా విధానం ముదావహం.
– డాక్టర్ గుంపుల ప్రభాకర్, ప్రిన్సిపాల్, శ్రీలక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల (ధర్మపురి)
చాలా గొప్ప విషయం
ప్రపంచం గర్వించదగిన మానవతా మూర్తి అంబేద్కర్. ఆయన గురించి నేటి తరానికి పూర్తిగా తెలియకుండా పోతున్నది. ఇలాంటి సమయంలో హైదరాబాద్లో మహా అంబేద్కర్ మహా విగ్రహం చేయడం గర్వించాల్సిన విషయం. విగ్రహాలతోపాటు స్మృతి వనాలు నెలకొల్పాలి. అంబేద్కర్కు సంబంధించిన లిటరేచర్ సెంటర్లను స్థాపించాలి. అప్పుడే అంబేద్కర్ పంచిన జ్ఞానం గురించి తెలుస్తుంది. ఇలాంటి పని తెలంగాణ ప్రభుత్వం చేయడం చాలా గొప్ప విషయం. నేటి జనరేషన్లో ఎవరికీ పుస్తకాలు చదివే ఓపిక లేదు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ టూరిస్టు ప్లేస్కు వెళ్తే ఆయనకు సంబంధించిన విజ్వల్స్ అందుబాటులో ఉంచాలి. వాటిని చూస్తే గంటలో అంబేద్కర్ అంటే ఎవరనేది తెలిసి పోతుంది. దేశంలో ఇంత పెద్ద విగ్రహాన్ని ఎవరూ ఏర్పాటు చేయలేదు. ఇందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్కు ఒక స్పష్టమైన విజన్ ఉన్నదని చెప్పవచ్చు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడం, దానిని ఆచరణలో పెట్టడం గొప్ప విషయం. ఈ విగ్రహాన్ని చూసిన వాళ్లు స్ఫూర్తి, ప్రేరణ పొందుతారు. భవిష్యత్ తరాలను అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. 51 కోట్ల మూల నిధిని ఏర్పాటు చేసి అంబేద్కర్ పేరిట అవార్డులు ఇవ్వాలని ప్రకటించడం అభినందనీయం. దేశ వ్యాప్తంగా అక్కడక్కడా ఇలాంటి విగ్రహాలు, వాటికి అనుబంధంగా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దీని ద్వారా అంబేద్కర్ అంటే ఎవరో రేపటి తరానికి తెలిసే అవకాశం ఉంటుంది. అంబేద్కర్ అంటే ఒక బొమ్మకాదు. ఆయన ఆశయాలేంటి? ఆయన గొప్ప తనం ఏంటి? అనేతి ప్రతి తరానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలంగాణ ప్రభుత్వంలాగా ప్రతి రాష్ట్రం ఇలాంటి బాధ్యతలను తీసుకోవాలి. ఎస్సీ సబ్ప్లాన్ కింద కూడా నిధులు తీసుకుని ఒక ప్రత్యేక కార్యాచరణతో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరమున్నది. భవిష్యత్తులో ఇలాంటి పనులు కేసీఆర్ చేస్తారనే నమ్మకం దళిత మేధావుల్లో కనిపిస్తున్నది.
– బండ శ్రీనివాస్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ (కరీంనగర్)
ఘనమైన నివాళి
ప్రపంచ మేధావి, వెయ్యేళ్ల వరకు చిరస్థాయిగా నిలిచి పోయే ప్రతిభ అంబేద్కర్ది. ప్రపంచమే గర్వించదగ్గ రీతిలో ఆయన విగ్రహాన్ని తెలంగాణ గడ్డ మీద ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉంది. ప్రపంచంలోనే అద్భుతమైన రాజ్యాన్ని నిర్మించిన అంబేద్కర్కు ఈ విగ్రహం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఘనమైన నివాళిని అర్పించింది. తెలంగాణ పేరు, ప్రఖ్యాతలు యావత్ ప్రపంచానికి తెలిసేలా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. అంబేద్కర్ అంటే ఎవరు?, ఆయన చేసిన సేవలు ఏంటి?, ఆయన ఎదుర్కొన్న వివక్ష ఎలాంటిది? అనేది ఇలాంటి విగ్రహాలను బట్టి భావితరాలకు, భారత దేశానికి తెలిసే అవకాశం ఉంటుంది. అంబేద్కర్ గొప్పతనాన్ని చాటుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడంపై యావత్ భారత జాతి గర్విస్తోంది. సీఎం కేసీఆర్కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆయన ఆలోచనా విధానాలు దేశ వ్యాప్తం చేయడానికి ఇది అంకురార్పణగా భావించవచ్చు. అంబేద్కర్ గొప్పతనాన్ని, ఆయన చూపిన సమతా మార్గంలో నడిచినప్పుడే దేశం సుభిక్షం అవుతుంది. దేశ కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. ఇంత మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు, విగ్రహ ఏర్పాటులో శ్రమించిన మంత్రి కొప్పుల ఈశ్వర్కు నా ప్రత్యేక ధన్యవాదాలు. దళిత పీడిత వర్గాల చైతన్య మూర్తి కీర్తి ప్రతిష్టలు ఎప్పటికీ అజరామరం. ఆయన చారిత్రాత్మక పురుషుడు. ఇలాంటి వారు యుగానికి ఒక్కరే పుడతారు. దేశానికి దిక్సూచిగా నిలిచిన అంబేద్కర్ విగ్రహాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలి. వాటిని పర్యాటక, జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దాలి.
– బత్తుల భూమయ్య, ఎంఈవో (ధర్మపురి)
సీఎం దార్శనికతకు నిదర్శనం
హైదరాబాద్ నడిబొడ్డున అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం, తెలంగాణ కొత్త సచివాలయానికి ఆయన పేరు పెట్టడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. ప్రపంచ మేధావికి లభించిన అరుదైన గౌరవం. అంబేద్కర్ ప్రతిభ, ఆయన వల్ల లబ్ధి ఒక రాష్ర్టానికే పరిమితం కాదు. అందుకే ఆయన పేరును భారత పార్లమెంట్కు పెట్టాలని అసెంబ్లీలో సీఎం ప్రకటించడం, అందుకు అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీ తమ అభిప్రాయాన్ని తీర్మానించి కేంద్రానికి నివేదించడం హర్షనీయం. అయితే, విగ్రహ ఏర్పాటులో అంతర్గతంగా రాజకీయ లబ్ధి దాగి ఉందని కొందరు భావిస్తున్నారు కానీ, సీఎం కేసీఆర్ దూరదృష్టితో, అర్ధవంతమైన భావనతో ప్రపంచంలోనే భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని భావించి విగ్రహ బేస్పై పార్లమెంట్ నమూనాను ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ను గుర్తించి ఆయన జయంతిని ఇయర్ ఆఫ్ నాలెడ్జ్ పేరుతో జయంతి వేడుకలను నిర్వహించడం గొప్ప విషయం. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, భవిష్యత్తులో సమ సమాజ రూపకల్పన కోసం ఒక హేతుబద్దమైన ఆలోచనా విధానాన్ని అంబేద్కర్ రచనలు నిర్దేశిస్తాయి. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా సామాజిక దృక్పథంతో సేవ చేసే కళాకారులకు, రచయితలకు, సామాజిక సంఘ సంస్కర్తలకు అంబేద్కర్ జయంతి రోజు అవార్డులను అందించాలన్న కత్తి పద్మారావు ఆలోచన, దాన్ని అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించడం ఆనందదాయకం. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందనే భావన దళిత మేధావుల్లో అభిప్రాయం వెలువడుతున్నది. అంబేద్కర్ చూపిన రీతిలో రాష్ట్రంలో పాలన సాగుతుంటే, జాతీయ స్థాయిలో ఆ దిశగా చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. చాలా రాష్ర్టాల్లో రాజ్యాంగ, ఫెడరల్ స్ఫూర్తిని విస్మరించి పాలన సాగుతోంది. మత ప్రసక్తి లేని లౌకిక దేశంగా తీర్చిదిద్దాలన్న మహానుభావుడి ఆశయానికి తూట్లు పొడిచే లాంటి పాలన దేశంలో కొనసాగుతుండటం బాధాకరం. జాతీయ స్థాయిలోనూ తెలంగాణలో అమలవుతున్న అంబేద్కర్ ఆలోచనా సహిత పాలన అమలు కావాలి. అప్పుడే సమ సమాజం.. నవ సమాజం ఏర్పడుతుంది.
– కొప్పుల వెంకటరమణ, కవి, రచయిత, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, జగిత్యాల
దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహం 125 అడుగుల ఎత్తుతో ఆకాశమే హద్దుగా నిర్మించడం ఒక చారిత్రాత్మకం. ఇది దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఇలాంటి గౌరవాన్ని ఇప్పటి వరకు దేశంలో ఎవరూ ఇవ్వలేదు. ఇంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో రానున్న తరాలకు అంబేద్కర్ చరిత్రను తెలియజేసినట్లవుతుంది. చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నది. అంబేద్కర్ పుట్టిన ప్రాంతంలో.. పుట్టిన రాష్ట్రంలోనూ దక్కని గౌరవం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో దక్కింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నది. దళితుల అభివృద్ధికి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు కూడా ఇలా పని చేస్తే.. దళితులు ఎప్పుడో అభివృద్ధి పథంలో పయనించేవారు.
– బొంకూరి సుదర్శన్, సూపరింటెండెంట్ ఇంజినీర్, టీఎస్ఎన్పీడీసీఎల్ (పెద్దపల్లి)
చరిత్రలో సువర్ణాధ్యాయం
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ ఎనలేని కృషి చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన బాటలో నడుస్తూ మా కుటుంబాల్లో వెలుగులకు బాటలు వేస్తున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో పాలన చేస్తూ దళితుల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్నారు. దేశానికే ఆదర్శవంతమైన పాలన చేస్తున్నారు. ఎవరూ ఊహించిన విధంగా ప్రపంచంలోనే ఏ నాయకుడికి ఆలోచన రాని విధంగా రాజధాని నగరంలో నింగికి తాకేలా బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, కొత్త సచివాలయానికి నామకరణం చేయడం గొప్ప విషయం. మా కుటుంబాల్లో సంపద పెంచడానికి దళితబంధు ఇవ్వడమే సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం. కేంద్రం పట్టించుకోకున్నా అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టడం చరిత్రలో సువర్ణాధ్యాయంగా చెప్పవచ్చు. దళిత జాతి ఉద్దరణకు పాటుపడుతున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్.
– సద్దిమల్ల సురేందర్, దళిత నాయకుడు, రాజన్న సిరిసిల్ల