వేములవాడ, ఫిబ్రవరి 22: బద్ది పోచమ్మ బోనాల మండపాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అవసరమైన నివేదికలు త్వరగా తయారు చేయాలని వీటీడీఏ అధికారులను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ఆదేశించారు. బుధవారం బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనుల కోసం సేకరించిన స్థలంలో కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలిసి ఆయన సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పటికే ఆలయ అభివృద్ధికి 50 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. వేగవంతంగా నివేదికలు రూపొందించి పనులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని సూచించారు. బోనాల మండపంలో భక్తులకు అవసరమయ్యే సౌకర్యాలు అత్యాధునిక పద్ధతుల్లో ఉండేలా తీర్చిదిద్ది నివేదికలు రూపొందించాలని చెప్పారు.
10 కోట్లతో గుడి చెరువు సుందరీ కరణ, గుడి చెరువులో 800 మీటర్ల మీద పుషర ఘాట్లు, మొదటి విడుతలో తిప్పాపూర్ నుంచి రాజన్న ఆలయం వరకు రహదారి విస్తరణ, సాంసృతిక, వేద నృత్య పాఠశాల కోసం ప్రత్యేక భవనం నిర్మాణాల కోసం అంచనాలు రూపొందించి పనుల వేగవంతానికి కృషి చేయాలన్నారు. వచ్చే ఆరు నెలల్లో 50 కోట్ల పనులు పూర్తి చేసే విధంగా రూపకల్పన చేయాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, వీటీడీఏ కార్యదర్శి భుజంగరావు, ఆరిటెక్చర్ ముక్తేశ్వర్, ఆలయ ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, ఎస్టేట్ అధికారి గంప సత్యనారాయణ తదితరులు ఉన్నారు.