ఓదెల, డిసెంబర్ 27: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్ల మధ్యన మూడో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో మంగళవారం నాలుగు గంటల పాటు ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ఈ నెల 24వ తేదీ నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు కాజీపేట్- సిర్పూర్కాగజ్నగర్ స్టేషన్ల మధ్య నడిచే ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిలిపివేసి మూడో లైన్ నిర్మాణ పనులను చేపట్టారు. సోమవారం రైల్వే ఉన్నతాధికారులు సైతం నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
మంగళవారం పొత్కపల్లి- బిజిగిరి షరీఫ్ స్టేషన్ల మధ్యన మానేరు వాగుపై మూడో లైన్ బ్రిడ్జి పనులు జరుగుతున్న సందర్భంగా మధ్యాహం నుంచి సాయంత్రం వరకు నాలుగు గంటల పాటు బ్లాక్ తీసుకుని అన్ని రైళ్లను పూర్తిగా నిలిపివేసి పనులు జరిపించారు. దీంతో పెద్దపల్లి, కొలనూర్, పొత్కపల్లి, జమ్మికుంట స్టేషన్లలో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపేశారు. గ్రామీణ ప్రాంత రైల్వే స్టేషన్లు కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయా స్టేషన్లలో తినడానికి ఏమి దొరకక, కనీసం తాగునీరు సౌకర్యం కూడా సరిగా లేకపోవడం ప్రయాణీకులు అవస్థలు పడ్డారు.