మంథనిలోని బడుల్లో అంతా ఆంగ్ల మాధ్యమమే
నాలుగేళ్లుగా విజయవంతంగా బోధన
మెరికల్లా తయారైన పిల్లలు
తల్లిదండ్రుల్లో హర్షం
మంథని టౌన్, ఫిబ్రవరి 5: విద్యా వ్యవస్థలో రాష్ట్ర సర్కారు చేపడుతున్న సమూల మార్పుల ఫలితాలు మంథనిలో స్పష్టంగా కనబడుతున్నా యి. ప్రైవేట్ను తలదన్నే విధంగా పాఠశాలల్లో వసతుల కల్పన, ఆంగ్ల మాధ్యమ బోధనతో పిల్లల తల్లిదండ్రులు ఇటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంకా వచ్చే ఏడాది నుంచి ‘మన ఊరు- మన బడి’లో భాగంగా ఆంగ్ల మాధ్య మం అమలు చేయాలని సర్కారు నిర్ణయించగా, అంతకంటే ముందుగానే మంథని పట్టణంలోని బడులన్నీ ఇంగ్లిష్ మీడియంలోకి మారాయి. పట్టణంలో 12 పాఠశాలలు ఉండగా, వాటిలో 9 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనే జరుగుతున్నది. దీంతో అప్పటిదాకా సర్కారు బడి అం టేనే ముక్కు ఇరిచి, వేలకు వేలు ఫీజులు కట్టి త మ పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పించిన తల్లిదండ్రులు, నేడు రాష్ట్ర సర్కారు చేపట్టిన విధానాల తో సర్కారు బడులకే జై కొడుతున్నారు. తమ పి ల్లలను చేర్పించేందుకు క్యూ కడుతుండగా, యే టేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది.
బడులు కళకళ..
ఆంగ్ల మాధ్యమ బోధన, సకల వసతుల కల్పనతో మంథనిలోని బడులు కళకళలాడుతున్నాయి. రావుల చెరువుకట్ట ప్రాథమిక పాఠశాల (తెలుగు)లో 20 మంది, జేబీఎస్ ప్రాథమిక పాఠశాల (ఇంగ్లిష్)లో 86, తెనుగుగూడెంలోని ప్రాథమిక పాఠశాల (ఇంగ్లిష్)లో 63, మటంవీధి ప్రాథమిక పాఠశాల (ఇంగ్లిష్)లో 84, గౌతమినగర్(గంగాపురి) పీఎస్ (ఇంగ్లిష్)లో 53, ఎరుకలగూడెం పీఎస్ (ఇంగ్లిష్)లో 39, మంథ ని పీఎస్ (ఇంగ్లిష్)లో 123, కూచీరాజ్పల్లి పీఎస్ (ఇంగ్లిష్)లో 17, మంథని ప్రాథమికోన్నత పాఠశాల (ఉర్దూ )లో 46, జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల (ఇంగ్లిష్)లో 199, తెలుగు మీడియంలో 34, జడ్పీహెచ్ఎస్ బాలుర (ఇంగ్లిష్)లో 152, తెలుగు మీడియంలో 36, మంథని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (తెలుగు)లో 64 మంది అభ్యసిస్తున్నారు.
ఇంగ్లిష్పైన పట్టు ఉండాలి..
ఆధునిక సమాజంలో మాతృభాషతో పాటు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధిస్తేనే విద్యార్థులు అన్నిరంగాల్లో ఉన్నతంగా రాణించడానికి వీలు కలుగుతుంది. ఇది విద్యార్థి ఉన్నత భవిష్యత్కు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడం, మా వద్ద ఇంతకు ముందే అమలు చేయడం అభినందనీయం.
– గీట్ల భరత్రెడ్డి, ఎస్ఏ(మ్యాథ్స్), జడ్పీహెచ్ఎస్(బాలికలు), మంథని.
ప్రభుత్వ స్కూళ్లకు మళ్లీ మంచి రోజులు..
ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం సంతోషంగా ఉంది. గతంలో సర్కారు బడులదే హవా. కానీ ఇంగ్లిష్ మీడియం రావడం, ప్రైవేట్ బడుల వైపే విద్యార్థులు, తల్లిదండ్రులు మర్లడంతో కొన్నేళ్లపాటు పాఠశాలలు బలహీన పడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటున్నాయి. ఇది మంచి పరిణామం. మా వద్ద నాలుగేండ్ల కిందే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు. పిల్లల సంఖ్య పెరిగింది.
– దాసరి ఆంజమ్మ, ప్రభుత్వ టీచర్, తెనుగుగూడెం పీఎస్.