వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కరీంనగర్ జిల్లా అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతీ గ్రామంలో చేపట్టాల్సిన చర్యలపై అన్ని పంచాయతీలకు సర్క్యులర్ జారీ చేశారు. పంచాయతీరాజ్ కమిషనర్తోపాటు కలెక్టర్ గోపి ఆదేశాల మేరకు డీపీవో వీర బుచ్చయ్య పారిశుధ్యం మెరుగు పర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తర్వాత మెరుగు పడిన పారిశుధ్యాన్ని కొనసాగించేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
– కరీంనగర్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈ నేపథ్యంలో ఏటేటా జ్వరాలు, వ్యాధుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వర్షాలు కురిసిన తర్వాత సాధారణంగా అక్కడక్కడా సీజనల్ జ్వరాలు వస్తున్నాయి. ఇలాంటి చోట పంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వారంలో మంగళ, శుక్రవారాలు డ్రైడేగా పాటిస్తున్నారు. ఈ రెండు రోజులు అధికారులు నివాస గృహాలను పరిశీలించి ఎక్కువ రోజులు నిలువ ఉన్న నీటిని, వర్షపు నీరు నిలువ ఉండే పాత్రలు, కొబ్బరి చిప్పలు, టైర్లు వంటివి ఉంటే వాటిని తొలగిస్తున్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా వైద్య, ఆరోగ్య శాఖతో కలిసి పని చేస్తూ బ్లీచింగ్, ఫినాయిల్, ఆయిల్ బాల్స్ వంటివి వాడుతున్నారు. ప్రతి గ్రామ పరిధిలో పంచాయతీ కార్యదర్శి, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బందితో ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో పంచాయతీ అధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు. జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తోపాటు జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పర్యవేక్షిస్తున్నారు. డివిజన్ స్థాయిలో డీఎల్పీవోలు, మండల స్థాయిలో ఎంపీవోలు ప్రతి రోజు ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారో పర్యవేక్షిస్తున్నారు. ఆ వెంటనే నివేదికలు సమర్పిస్తున్నారు.
ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలు
ఇలా ప్రతి పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో క్రమం తప్పకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో మెరుగైన పారిశుధ్యం
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా మెరుగు పడింది. పారిశుధ్య లోపం ఏర్పడకుండా ప్రతి రోజూ చర్యలు తీసుకుంటున్నాం. వర్షాలు తగ్గిన తర్వాత ప్రతిసారి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. మురుగు నీరు ఇండ్ల మధ్య నిలువ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఒక వేళ బయటికి వెళ్లలేని మురుగు నీరు ఉంటే ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. దోమలు వృద్ధి కాకుండా చూస్తున్నాం. అక్కడక్కడా జ్వరాలు వస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఇస్తున్న నివేదికల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు తీసుకుంటున్నాం. ఏ రోజు చెత్తను ఆ రోజు డంప్ యార్డులకు తరలిస్తున్నాం. కలెక్టర్, అదనపు కలెక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. నేను క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నా.
– వీర బుచ్చయ్య, డీపీవో, కరీంనగర్