కలెక్టరేట్, జూలై 13: ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో సంక్షేమ హాస్టళ్లలో వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఉండేందుకు విముఖత ప్రదర్శించేవారు. ఫలితంగా దూర ప్రాంతాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలా మారింది. ప్రతిభ ఉన్నా ఏటా వందలాది మంది విద్యార్థులు విద్యనభ్యసించలేకపోయేవారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వసతి గృహాలను ఆధునీకరించారు. తాగునీరు నుంచి మొదలు విద్యార్థులకు అవసరమైన సకల సౌకర్యాలు ఆధునిక పద్ధతిలో కల్పించడంతో సొంతింటిని మైమరిపిస్తున్నాయి. సీమాంధ్ర పాలకుల హయాంలో విద్యుత్ సౌకర్యం కూడా సక్రమంగా లేక చీకటి పడిందంటే చాలు అంధకారంలో మగ్గిపోయే హాస్టళ్లు నేడు అనుక్షణం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. దీంతో, గత మూడేళ్లుగా ప్రభుత్వ హాస్టళ్లలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతున్నది. జిల్లాలో అధికంగా ఉన్న షెడ్యూల్డ్ కులాల సంక్షేమ వసతి గృహాల అభివృద్ధిపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్ల క్రూజువల్ వెల్ఫేర్ ఫండ్ విడుదల చేసింది. ఈ మొత్తంతో జిల్లాలోని 31 హాస్టళ్లను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధానంగా సొంత భవనాలు ఉన్న చోట శాశ్వత మరమ్మతులు చేపట్టారు. ఎలక్ట్రికల్, శానిటేషన్, మంచినీటి సరఫరా, ప్లంబింగ్ పనులతో పాటు స్నానపు గదులు, మరుగుదొడ్లను టైల్స్తో పునర్నిర్మించారు.
నీటి సౌలభ్యం లేని చోట బోర్లు వేయించారు. పలుచోట్ల ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు శుద్ధజలం అందిస్తున్నారు. వేడి నీటి సౌకర్యం కూడా కల్పించారు. విద్యార్థులు చదువుకునేందుకు విశాలమైన హాళ్లు నిర్మించి, వాటిలో వందలాది పుస్తకాలతో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. దినపత్రికలు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే, భోజనశాలలు ఆధునీకరించడంతో పాటు విశ్రాంతి గదుల్లో బంకర్ బెడ్లు, వాటిపై పరుపులు, బ్లాంకెట్లు, దోమ తెరలు అందజేశారు. విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి హాస్టల్లో సీసీ కెమెరాలు అమర్చారు. అలాగే, వసతి గృహాల గదుల్లోని గోడలపై తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పెయింటింగ్స్ వేయించారు. బతుకమ్మ, పల్లెసుద్దులు, శ్రామైక జీవన సౌందర్యం, తెలంగాణ చరిత్ర, పల్లెటూళ్ల అందాలు, తొలి దశ తెలంగాణ ఉద్యమ పోరాట యోధుల చిత్రాలు విద్యార్థులను ఆలోచింపజేస్తుండగా, చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
వసతిగృహాల ఎదుట స్వాగతించేలా వివిధ రకాల పూల మొక్కలతో ఏర్పాటు చేసిన మినీ గార్డెన్లు ఆకర్షిస్తున్నాయి. కిచెన్ గార్డెన్లు కూడా ఏర్పాటు చేసి వివిధ రకాల కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. కాసిన కూరగాయలను వంటల్లో వినియోగిస్తున్నారు. దీంతో, జిల్లాలో ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. గత విద్యా సంవత్సరంలో జిల్లాలోని ఎస్సీ హాస్టళ్లలో 1,500 మంది వరకు మాత్రమే ఉండగా, ఈసారి 2400 వరకు విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు సమాచారం. అలాగే, ఇతర హాస్టళ్లలో కూడా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండగా, జిల్లా అధికార యంత్రాంగం హాస్టళ్ల నిర్వాహకులను అభినందిస్తూ, ప్రశంసాపత్రాలు కూడా అందజేసింది. కాగా, ఇటీవల కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నగరంలోని పలు వసతిగృహాలను సందర్శించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నతానియేల్ కూడా సంక్షేమ వసతి గృహాలను సందర్శించి, హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి రుచికరమైన ఆహారం అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.