కార్పొరేషన్, డిసెంబర్ 3: ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా బల్దియా పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 38, 55, 57వ డివిజన్లలో శనివారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సీఎం అస్యూరెన్స్ కింద విడుదల చేసిన రూ.347 కోట్లతో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నట్లు తెలిపారు. స్మార్ట్సిటీ నిధులతో నగరాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
నగరంలోని 60 డివిజన్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పాలకవర్గం పని చేస్తున్నదని తెలిపారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిషరిస్తున్నట్లు చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ సహకారంతో వచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. స్మార్ట్సిటీ, వివిధ ప్రాజెక్ట్ల కింద రూ.940 కోట్లతో టెండర్లు పూర్తి చేసి, పనులు చేపడుతున్నామన్నారు.
ఇందులో ఇప్పటికే రూ.450 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. పెండింగ్ పనులను జూన్ లోగా పూర్తి చేస్తామని చెప్పారు. కరీంనగర్ చుట్టూ ఉన్న 14.5 కిలోమీటర్ల మేర సిరిసిల్ల, రామగుండం, హైదరాబాద్, జగిత్యాల రోడ్లలో చకటి సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశామన్నారు. రోజు మంచినీటి సరఫరా విజయవంతంగా సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో నగర ప్రజలకు 24 గంటల మంచినీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలోనే కరీంనగర్ను సుందర నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కచ్చు రవి, పెద్దపల్లి జితేందర్, బండ సుమ, కొలగాని శ్రీనివాస్, మర్రి భావన, నాగసముద్రం జయలక్ష్మి, భూమాగౌడ్, ఈఈ మహేందర్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ నిఖిత పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ యాదగిరి సునీల్రావు సూచించారు. బల్దియా కార్యాలయంలో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. నగరపాలక సంస్థలో పని చేసే పలువురు దివ్యాంగ ఉద్యోగులతో పాటు మెప్మా సంఘాలకు చెందిన పలువురు సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. నగర పాలక సంస్థలో పని చేసే ఉద్యోగులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉన్న దివ్యాంగుల శాఖను సీఎం కేసీఆర్ ప్రత్యేక విభాగం చేయడం అభినందనీయమన్నారు. అడిషనల్ కమిషనర్ స్వరూపారాణి, డిప్యూటీ కమిషనర్ త్రియంభకేశ్వర్, మెప్మా పీడీ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.