‘రైతుబంధు’వు వస్తున్నది. ఈ యాసంగి సీజన్ పెట్టుబడి కోసం రైతన్నకు రాష్ట్ర సర్కారు మరోసారి భరోసా ఇవ్వనున్నది. సాగు పనులు జరుగుతున్న తరుణంలో వారికి పదోసారి సాయం చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు ఈ నెల 28 నుంచి విడుతలవారీగా అందించేందుకు అధికారయంత్రాంగం కసరత్తు చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుండగా, ప్రతి సంవత్సరం లబ్ధిదారులు పెరుగుతూ వస్తున్నప్పటికీ వెనుకడుగు వేయకుండా సాయం అందిస్తున్నది. వానకాలం సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 6,95,681 మందికి రూ.664.58 కోట్ల సాయం అందించగా, ఈ యాసంగి సీజన్లో 7,04,688 మందికి రూ.665.76 కోట్ల పంట పెట్టుబడి ఇవ్వబోతున్నది. గత సీజన్తో పోలిస్తే 21,453 మందికి అదనంగా సాయం అందనున్నది.
– కరీంనగర్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ)
కరీంనగర్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ) రైతుబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. పథకం అమలుకు ముం దు పెట్టుబడి కోసం రైతులు అష్టకష్టాలు పడేవారు. వేసిన పంటలు చేతికిరాక, వచ్చిన పంట అప్పులకు సరిపోగా మరో పంట పెట్టుబడి లేక అనేక మంది సన్న, చిన్న కారు రైతులు సేద్యం చేయలేని పరిస్థితులు కనిపించేవి. బ్యాంకుల్లో పంట రుణాలు దొరకకా రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సాగు చేసేవారు.
నిత్యకృత్యంగా జరిగే ఈ పరిణామాలతో రైతులు తీవ్రంగా నష్టపోతుండేవా రు. పెట్టుబడి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం 2018 వానకాలం నుంచి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. మొదట ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత రూ.5 వేలకు పెంచింది. దీంతో రైతులు పంట సాగుకు ముందు తమ పెట్టుబడి అవసరాలను తీర్చుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా రైతుబంధు పథకాన్ని రాష్ట్ర సర్కారు కచ్చితం గా అమలు చేస్తూ వస్తోంది.
సీజన్కు ముందే నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది. దీంతో రైతులు తమకు కావల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చే సుకుని ఎంతో ధీమాతో వ్యవసాయం చేసుకుంటున్నా రు. అప్పుల కోసం షావుకార్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయింది. బ్యాంకులు ఇచ్చినపుడే రుణాలు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. రైతుబంధు పథకంతో తమ జీవితాలు పూర్తిగా మారిపోయాయనే అభిప్రాయం రైతుల్లో వినిపిస్తోంది. ఈసారి పదోసారి ఇస్తుండగా ఈ నెల 28 నుంచి విడుతల వారీగా అందించేందుకు ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి రాష్ట్ర వ్యా ప్తంగా రైతుబంధు సాయం నేరుగా రైతుల ఖా తాల్లో జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి జిల్లాలో యాసంగి సీజన్ వివరాలు
కరీంనగర్ : జిల్లాలో 3,64,070 ఎకరాల భూమి సాగవుతోంది. 1,97,097 మంది పట్టాదారులు ఉన్నా రు. వీరికి ఈ సీజన్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ లెక్కన జిల్లాలోని రైతులకు ఈసారి రూ.182 కోట్ల 3 లక్షల 54 వేలు కేటాయించింది. ఇందులో అధికారుల వద్ద 1,79,599 మంది రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకా 17,498 మంది రైతుల బ్యాంకు వివరాలు ఇవ్వాల్సి ఉన్నది.
రైతుబంధు పోర్టల్లో నమోదైన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన 6,191 మంది తమ బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ కార్డులు ఇవ్వాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు. అయితే, దాదాపు 11 వేల మందికి పైగా రెగ్యులర్గా తమ వివరాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాగా, ఈ సీజన్లో వీలైనంత ఎక్కువ మందికి రైతుబంధు ప్రయోజనం కలిగేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు.
పెద్దపల్లి : జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 1,50,460 రైతులకు రూ.138 కోట్ల 52 లక్షల 88 వేల 81 రైతుబంధు సాయం అందనుంది. గత వానకాలం సమయంలో 1,41,265 మంది రైతులకు పెట్టుబడి సహాయం అందింది.
ఈ సీజన్లో కొత్తగా 4360 మంది రైతుకు రైతు బంధు అందనుంది.
జగిత్యాల : జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 2,31,151 రైతులకు రూ.214 కోట్ల 20 లక్షల 36 వేల 123ల రైతుబంధు సాయం అందనుంది. గత సీజన్లో 2,27,268 మందికి రూ.212.26 కోట్ల సాయం అందింది. ఈ సీజన్లో కొత్తగా 6468 మంది రైతులకు రైతు బంధు అందనుంది.
రాజన్న సిరిసిల్ల : జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొంత మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమచేయగా, మిగిలిన వారందరికీ జమచేసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకున్నది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీల పరిధిలో 1,25,980 మంది రైతులకు రూ.131 కోట్లు చెల్లించనున్నది. అందులో కొత్త రైతులు 4494 మంది ఉన్నారు. కొత్త రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 28వరకు అవకాశం కల్పించింది.
రైతులందరి బ్యాంకు వివరాలు సేకరిస్తాం
ఈ సీజన్లో రైతుబంధుకు అర్హులైన రైతులందరి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరిస్తాం. అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ ఏడాది జూన్ నుంచి ఈ నెల 20వ తేదీ మధ్య కాలంలో పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు, గత సీజన్లో బ్యాంకు ఖాతాలు సమర్పించని వారి ఖాతాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నాం.
రైతులు తమ దరఖాస్తుతోపాటు స్వయంగా పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంక్ ఖాతా పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలను మీ పరిధిలోని మా వ్యవసాయ విస్తరణ అధికారులుగానీ, మండల వ్యవసాయ అధికారులకుగానీ సమర్పించాలి. ఎంత త్వరగా వాటిని సమర్పిస్తే అంత త్వరగా సంబంధిత రైతుల ఖాతాల్లో నగదు జమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, ముందుగా డబ్బులు జమయ్యి ఇప్పుడు ఏదైనా కారణం చేత బ్యాంకు వివరాలు మార్చుకోదలిచిన రైతులు, ఏవైనా తప్పుల కారణంగా డబ్బులు జమకాని వారు వెంటనే మా అధికారులను సంప్రదించాలి. గత వానకాలంలో రైతుబంధు వచ్చిన రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
– వాసిరెడ్డి శ్రీధర్, కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి
ఏఈవోలకు వివరాలు ఇవ్వాలి
యాసంగి పెట్టుబడి సహాయానికి 2022 డిసెంబర్ 20 కటాఫ్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తేదీ నాటికి ధరణి, గిరిజన శాఖలో పట్టాదారులైన రైతులు రైతుబంధు పొందడానికి అర్హులు. ఇంకా వివరాలు ఇవ్వని వారు తమ భూమి పట్టా, బ్యాంకు వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి అందించాలి. గత పంట కాలంలో రైతుబంధు జమ అయిన రైతులు వారి బ్యాంకు ఖాతాలను ఏ కారణాల చేతనైనా మార్చుకోవాలనుకుంటే సదరు బ్యాంకు ఖాతా వివరాలు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం ప్రతులు అందించాలి.
– దోమ ఆదిరెడ్డి, డీఏవో పెద్దపల్లి