అప్పటిదాకా కష్టాలు, కన్నీళ్లలో బతికి కాస్త జీవితంలో కుదురుకోగానే కొందరు తమ జీవనవిధానాన్నే మార్చివేసుకుంటారు. ‘జీవితంలో స్థిరపడ్డాం.. ఇక ఏమవుతుందిలే’ అని భావిస్తుంటారు. తాము ఎక్కడి నుంచి వచ్చామనే మూలాలు మరిచిపోయి గొప్పలకు పోతుంటారు. అది రాజకీయనాయకులైనా.. ఉద్యోగులైనా.. ఇంకెవరైనా..? కానీ, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండేవాళ్లను మాత్రం మనం కొంతమందినే చూస్తుంటాం. అందుకు ఓదెల మండలంలోని ఇద్దరు ప్రజాప్రతినిధులే నిదర్శనం.
ఓదెల మండల కొలనూర్ సర్పంచ్ సామ మణెమ్మ, ఓదెల ఎంపీటీసీ బోడకుంట లక్ష్మి. ఓ వైపు గ్రామాభివృద్ధికి విశేషంగా కృషిచేస్తూనే, వ్యవసాయ పనులు చేస్తున్నారు. సర్పంచ్ మణెమ్మ గతంలో సొంత వ్యవసాయ పనులతోపాటు కూలీ పనులు చేశారు. గత ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచిన తర్వాత సైతం కూలీ పనిచేస్తున్నారు. ఎంపీటీసీ లక్ష్మి ఇప్పటికీ తమ వ్యవసాయ పొలం పనులు చూసుకుంటున్నారు. రెండు సార్లు వరుసగా ఎంపీటీసీగా గెలిచిన ఆమె, ఏ నాడూ వ్యవసాయాన్ని వీడలేదు. అటు గ్రామాభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్నారు.
– ఓదెల, జనవరి 1