హుజూరాబాద్రూరల్, జూలై 12 : కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన బెట్టడం.. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో ఎవుసం అంతంత మాత్రమే సాగుతున్నది. దాని ప్రభావం అనుబంధ రంగాలపైనా పడుతున్నది. వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతుండగా, పంటల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో సీజన్లో కళకళలాడాల్సిన ఫర్టిలైజర్స్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లు, మెకానిక్లు, ఆటోస్టోర్ యజమానులు, వెల్డింగ్షాపుల నిర్వాహకులు, వ్యవసాయ కూలీలు వనులు లేక ఖాళీగా ఉంటున్నారు.
ఏటా విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద రైతుల సందడి కనిపించేంది. విత్తనాలు, ఎరువులు విక్రయాలతో దుకాణాలు కళకళలాడేవి. కానీ, ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి. విత్తనాలు, ఎరువులు, మందుల కోసం వెళ్లే రైతుల సంఖ్య తగ్గింది. ఫలితంగా దుకాణాలు వెలవెబోతున్నాయి. వ్యవసాయం లేక ట్రాక్టర్లను యజమానులు ఖాళీగా ఉంచుతున్నారు. దీంతో వాటిపై తీసుకున్న రుణాలు కట్టలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా కొందరు డ్రైవర్లకు జీతాలు చెల్లిస్తూ ఎదురు చూస్తుండగా, రోజువారీ డ్రైవర్లు ఖాళీ ఉండాల్సి వస్తున్నది. ట్రాక్టర్లు ఖాళీగా ఉండడంతో మెకానిక్లకు కూడా పనులు దొరకడం లేదు. కేజ్వీల్స్, ప్లవ్లు, కల్టివేటర్ పనులు చేయించుకునే వారు లేక వెల్డింగ్ షాపుల నిర్వాహకులు ఖాళీ ఉంటున్నారు. దీంతో పూట గడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. వ్యవసాయంపై ఆధార పడ్డ ఆటోస్టోర్లు వెలవెలబోతున్నాయి. మోటర్ వైండింగ్ మెకానిక్లు, రోజువారీ వ్యవసాయ కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
గత నెల రోజుల నుంచి ఎలాంటి పని లేదు. గతంలో వర్షాలు ముందుగా రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి నీళ్లు వచ్చేవి. అక్కడి నుంచి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయడం వల్ల అయకట్టు కింద ఉన్న పొలాలు దున్నేవారు. దీంతో ట్రాక్టర్ల కేజీవీల్స్, కల్టివేటర్లు చెడిపోతే మరమ్మతుల కోసం రైతులు వచ్చేవారు. ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు రూ.4 లక్షల వరకు సంపాదించే వాడిని. ప్రస్తుతం రూ.లక్ష కూడా సంపాదించలేదు.
గతంలో ఎరువుల బస్తాలకు రైతులు క్యూ కట్టేవారు. ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక ఉండేది కాదు. రైతులతో షాపు కళకళలాడేది. మంచి గిరాకీ ఉండేది. వర్షాలు కురువక పోవడం, కాల్వ నీళ్లు రాకపోవడంతో రైతులు పనులు ప్రారంభించడం లేదు. గిరాకీ లేదు. దీంతో రూం కిరాయి, కరెంటు బిల్లు కట్టలేక పోతున్నాం.