చిరుద్యోగి కుటుంబం కల నెరవేరింది. తమ పిల్లలిద్దరినీ ఎంబీబీఎస్ చదివించాలన్న స్వప్నం సాకారమైంది. ఒకరు ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్ మరొకరు కేజీబీవీలో క్రాఫ్ట్ టీచర్ పనిచేస్తూ వచ్చీరాని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆ ఇంటికి డబుల్ ధమాకా తగిలింది. రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన జిల్లాకో మెడికల్ కాలేజీతో కొడుకు, కూతురికి ఒకేసారి ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కొడుకు జగిత్యాలలో, కూతురు కరీంనగర్ కళాశాలలో ఇటీవలే అడ్మిషన్ సైతం తీసుకోగా, తల్లిదండ్రులు సంబురపడిపోతున్నారు. తమ ఇంట్లో దీపం పెట్టింది సీఎం కేసీఆరే అంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
– కరీంనగర్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్
కరీంనగర్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: ఎనగందుల ప్రకాశ్ గౌడ్- నీరజ దంపతులు. వీరిది మధ్యతరగతి కుటుంబం. ప్రకాశ్ కరీంనగర్ ఒక ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్ పనిచేస్తున్నారు. తల్లి నీరజ సిద్దిపేట జిల్లాలోని కేజీబీవీలో కాంట్రాక్ట్ క్రాఫ్ట్ టీచర్ పనిచేస్తున్నారు. వీళ్లిద్దరి నెల వేతనాలు రూ.20 వేల లోపే ఉన్నాయి. వీరికి కొడుకు ఎనగందుల హరిచరణ్, కూతురు అద్వైత వర్షిణి ఉన్నారు. బాల్యం నుంచే చదువులో రాణిస్తున్నారు. మెడిసిన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తల్లిదండ్రులు తమ జీతం చిన్నదైనా మెడిసిన్ చేయాలన్న పిల్లల ఆలోచనను ఏనాడూ చిన్నబుచ్చ లేదు. వాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తించిన ప్రకాశ్, నీరజ ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తమ పిల్లల కలను నెరవేర్చాలని నిర్ణయానికి వచ్చి ఇంటర్ పూర్తిగానే మంచి కోచింగ్ ఇప్పించి నీట్ సిద్ధం చేశారు. హరిచరణ్ మూడో, అద్వైత వర్షిణి రెండో అటెంప్ట్ ఈ ఏడాది ఒకేసారి మెడిసిన్ సీట్లు సాధించారు. హరిచరణ్ జగిత్యాల, అద్వైత వర్షిణి కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందారు. ఈ పరిణామం ఆ కుటుంబానికి అంతులేని సంతోషాన్ని కలిగించింది. బంధులు, స్నేహితుల అభినందనలతో ముంచెత్తుతోంది.
పేద కుటుంబం..
వీళ్ల కుటుంబ నేపథ్యం చూస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్. ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడే ప్రకాశ్ కరీంనగర్ పలు వ్యాపారాలు చేసి దేనిలోనూ రాణించ లేకపోయారు. చివరికి ఒక ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్ చేరి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కొద్ది రోజులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ బతుకుదెరువు కోసం వెళ్లారు. అక్కడ ఉన్నపుడే జగదేవ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో నీరజకు కాంట్రాక్ట్ క్రాఫ్ట్ టీచర్ అవకాశం దొరికింది. పిల్లల చదువు రీత్యా తిరిగి కరీంనగర్ చేరుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్ హౌసింగ్ ఉంటున్నారు. ఒక్కరిని కూడా మెడిసిన్ చదివించే స్థోమత కూడా లేని ఈ కుటుంబంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఇద్దరు పిల్లల్ని చదివించే అవకాశం లభించింది. నీరజ అక్క కొడుకు, కూతురు ఇద్దరూ మెడిసిన్ చదువుతున్నారు. వీళ్ల స్ఫూర్తితోనే తమ పిల్లలను మెడిసిన్ చదివించాలని ప్రకాశ్ గౌడ్, నీరజ నిర్ణయించుకున్నారు. అంతే కాకుండా, నీరజ తల్లి సింగం లక్ష్మి ఆస్తమాతో బాధపడేది. నువ్వెలాగైనా డాక్టర్వి అయి తనలాంటి అస్తమా పేషెంట్లకు వైద్యం చేయాలని ఆమె అద్వైతతో తరుచూ అనేది. మా అమ్మమ్మ మరణించిన తర్వాత కూడా ఆమె మాటలు తన చెవుల్లో మారుమోగుతున్నాయని, డాక్టర్ అయితేనే అమ్మమ్మ లాంటి పేషెంట్లకు సేవ చేయవచ్చని అద్వైత చెబుతోంది.
కటాఫ్ పెరగడంతోనే ఈజీగా సీట్లు వచ్చాయి
కేసీఆర్ సర్ మెడికల్ సీట్లు పెంచడం, 85 శాతం సీట్లు లోకల్ వాళ్లకే ఇవ్వాలని నిర్ణయించడంతో కటాఫ్ ర్యాంక్ పెరిగింది. దీంతో మా చెల్లికి, నాకు ఈజీగా మెడికల్ సీట్లు వచ్చాయి. మాకు రిజర్వేషన్ ఉన్నా ఇద్దరికీ జనరల్ కేటగిరీలోనే సీట్లు కేటాయించారు. ఈసారి నీట్ పేపర్ టఫ్ వచ్చింది. మునుపటి కంటే పోటీ రెండింతలు పెరిగింది. పేపర్ రాయక ముందు అనేక అనుమానాలున్నా కేసీఆర్ సార్ సీట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి డౌట్ పెట్టుకోలేదు. అనుకున్నట్లుగానే చెల్లికి నాకు కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే సీట్లు వచ్చాయి. ఇద్దరం ఒక్కచోట ఎందుకని నేను జగిత్యాలకు మార్చుకున్న. గతంలో ఇలాంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. ఇప్పుడు సీట్లు విరివిగా ఉన్నందునే నేను సీటు మార్చుకోవడానికి అవకాశం వచ్చింది. మా కుటుంబంలో ఇద్దరం మెడిసిన్ చదవడం నిజంగా మిరాకిల్ అని చెప్పవచ్చు. మా మమ్మీ, డాడీ కష్టానికి ఫలితం. మా పేరెంట్స్ కష్టాలను చూసిన మేం, ఎలాగైనా మెడిసిన్ సీట్లు కొట్టాలని రాత్రి, పగలు కష్ట పడి చదివాం. అదృష్టం కూడా వరించి మాకు సీట్లు దొరికాయి. జనరల్ సర్జన్ కావాలన్నది నా లక్ష్యం.
– ఎనగందుల హరిచరణ్, ఎంబీబీఎస్ స్టూడెంట్, జగిత్యాల కాలేజీ
అమ్మమ్మ కోరిక తీర్చుతా..
మా అమ్మమ్మ లక్ష్మి అస్తమాతో బాధపడేది. ఆమె నాతో తరుచూ నువ్వు డాక్టర్ చదివి నాలాంటోళ్లకు సేవలు అందించాలని చెప్పేది. అందుకే నేను ఎంబీబీఎస్ పూర్తవగానే ఫల్మనాలజిస్ట్ అవ్వాలని అనుకుంటున్న. మా అన్నయ్య నేను ఎంతో కష్టపడి చదివాం. సెకండ్ అటెంప్ట్ నాకు అవకాశం వచ్చింది. మా అన్నయ్యకు మూడోసారికి వచ్చింది. చివరిసారి ఇద్దరం కలిసి నీట్ రాసినపుడు మాపై మాకు ఎంతో నమ్మకం ఉండేది. ఆ నమ్మకానికితోడు కేసీఆర్ సర్ మెడిసిన్ సీట్లు పెంచడంతో మా కష్టానికి ఫలితం దక్కింది. మా పెద్దనాన్న కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్లు. మా ఇద్దరికి మెడిసిన్ సీట్లు వచ్చిన తర్వాత మా బంధువులంతా సంతోష పడి మమ్మీ, డాడీని అభినందించడం నాకు ఎంతో గర్వంగా అనిపించింది. కేసీఆర్ సర్ కల్పించిన ఈ చాన్స్ యూజ్ చేసుకుని మంచి డాక్టర్ని అవుతా. పేదల కోసం కష్ట పడుతున్న కేసీఆర్ సర్ ఆశయానికి అనుగుణంగా నేను నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తా.
– ఎనగందుల అద్వైత వర్షిణి, ఎంబీబీఎస్ స్టూడెంట్ కరీంనగర్ కాలేజీ
కేసీఆర్ లేకుంటే నా పిల్లలు మెడిసిన్ చదివే వారే కాదు..
మా ఇద్దరు పిల్లలకు మంచి టాలెంట్ ఉంది. మెడిసిన్ చదవాలనే తపన ఉంది. కానీ, చదివించే ఆర్థిక స్థోమత మాకు లేదు. పిల్లల్ని ఇక్కడి వరకు చదివించేందుకు, వారిని పోషించేందుకే అనేక కష్టాలు పడ్డాం. ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ సార్. ఇలా జిల్లాకో మెడికల్ కళాశాల పెట్టి సీట్లు పెంచడం, తెలంగాణ పిల్లలకే 85 శాతం సీట్లు కేటాయించడం వల్లే మా ఇద్దరు పిల్లలకు ఫ్రీ సీట్లు వచ్చాయి. ఇలాంటి పరిణామాలు జరగకపోయి ఉంటే టాలెంట్ ఉన్న మా పిల్లల్లాంటి వారెందరో మరుగున పడేవారు. నేనైతే మానసికంగా చచ్చిపోయే వాడిని. మా పిల్లలిద్దరికీ మెడిసిన్ సీట్లు వచ్చాయని తెలియగానే నేను ముందుగా కేసీఆర్ సార్ ధన్యవాదాలు తెలుపుకున్న. ఇది నా హృదయం నుంచి వస్తున్న మాట. ఆయనే లేకుంటే ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు మెడిసిన్ చదివే పరిస్థితి ఉండేదా..? మామూలు చదువుల ఖర్చులకే ఎంతో కష్టపడ్డ మేం, తలో కోటి రూపాయలు పెట్టి మేనేజ్ సీటు కొని పిల్లల్ని చదివించే వారమా..? ఇదంతా ఏదో అద్భుతం జరిగినట్లు అనిపిస్తోంది. నా పిల్లలు మంచి డాక్టర్లు అయి సమాజానికి సేవ చేస్తుంటే చూడాలని ఎంతో అతృతగా ఉంది.
– ఎనగందుల ప్రకాశ్ గౌడ్, పిల్లల తండ్రి
చాలా కష్ట పడి చదువుతారు..
మా పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుతారు. అబ్బాయి హరిచరణ్ పాప అద్వైత కంటే ఒక్క సంవత్సరమే పెద్ద. స్టడీలో కూడా బాబు ఒక్క సంవత్సరం సీనియర్. అయినా ఇద్దరు కలిసి స్టడీ చేస్తరు. ఒకరి డౌట్స్ ఒకరు మాట్లాడుకుంటరు. బాబు టెన్త్ జాయిన్ అయిన తర్వాత మా ఇంట్లో టీవీ బంద్ చేసినం. కనీసం ఫోన్ కూడా వాళ్లకు అందుబాటులో ఉంచలేదు. నీట్ కోసం ప్రిపేరయ్యేటపుడు రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు జాము 3 గంటల దాకా చదువుకుని పుస్తకాల మీదే పడుకునే వాళ్లు. దురదృష్టవశాత్తూ పిల్లలు నీట్ ముందే మా అమ్మ చనిపోయి నేను పుట్టింటికి వెళ్లాల్సి వచ్చింది. మా వారే దగ్గరుండి వారికి సపర్యలు చేస్తూ చదివించే వారు. ఇద్దరు 500కు పైగానే ర్యాంకులు సాధించారు. ఫ్రీ సీటు వస్తేనే చదువ గలుగుతామనే భావన వాళ్లకు వచ్చింది. అందుకే పట్టుదలగా చదివారు. కేసీఆర్ సార్ మెడిసిన్ సీట్లు పెంచడంతో మా పిల్లలకు సులువుగా ఫ్రీ సీటు వచ్చింది.
– ఎనగందుల నీరజ, పిల్లల తల్లి