టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటి బీఆర్ఎస్ పార్టీ అవతరణ వరకు ఎన్నో విజయాలు, అపజయాలు చూశా. కార్యకర్తలే పార్టీకి కథానాయకులు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అద్భుత మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలి. గ్రామాల్లో ప్రతిపక్షాలు చేసే చౌకబారు మాటలకు సమాధానాలు చెప్పాలి. వారి కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి. సీఎం కేసీఆర్ మున్ముందు దేశ రాజకీయాల్లో రాణించబోతున్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే మన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందున్నది.
– వెల్గటూర్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కొప్పుల ఈశ్వర్
వెల్గటూర్, మే 9 : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి బీఆర్ఎస్ పార్టీ అవతరణ వరకు ఎన్నో విజయాలు, అపజయాలు చవిచూసిన ప్రయాణంలో పార్టీకి కార్యకర్తలే కథానాయకులని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేవారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చర్చించుకోవడంతోపాటు పార్టీ కార్యకర్తలందరినీ ఆత్మీయంగా కలుసుకొని వారి సాధకబాధకాలు తెలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనాలని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అద్భుత మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎండపెల్లి మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మొదట బీఆర్ఎస్ను జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. గ్రామాల్లో ప్రతిపక్షాలు చేసే చౌకబారు మాటలకు సమాధానాలు చెప్పాలని, వారి కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామాల్లో దుమ్ము కొట్టుకునేదని, రాష్ట్రంలో అంతకుముందు కేవలం 45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే, 8 ఏండ్ల కాలంలో 2.55 కోట్ల ధాన్యం పండుతున్నదన్నారు. నేడు మండుటెండల్లో సైతం చెరువులు నిండు కుండల్లా కనుపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రైతు కేంద్రంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రాష్ర్టాన్ని సాధించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తూ ఒక బొమ్మరిల్లు లాగా తీర్చిదిద్దుతున్నాడన్నారు. యావత్ దేశ ప్రజలు మన రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారని, సీఎం కేసీఆర్ మున్ముందు దేశ రాజకీయాల్లో రాణించబోతున్నారని చెప్పారు.
దేశంలో అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ అని ఉద్ఘాటించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే మన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమన్నారు. మాయ మాటలు చెప్పి మోసం చేసే వారందరూ ఒక వైపు ఉంటే అభివృద్ధి కార్యక్రమాలతో అద్భుతాలు సృష్టించే మన కేసీఆర్ మన వైపు ఉండి పని చేస్తున్నారని చెప్పారు. అలాంటి ప్రభుత్వంపై అడ్డగోలుగా అడ్డం, పొడుగు మాట్లాడే ప్రతి పక్ష పార్టీల విమర్శలను కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇంత అభివృద్ధి చేస్తున్న మనం ప్రజల్లో గర్వంగా తిరగవచ్చని, ఏమీ చేయని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రజలు తిరగబడాలని చెప్పారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు వంటి పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అమెరికా లాంటి అగ్ర దేశాలకు ఎస్సీ పిల్లలు వెళ్లి చదువుకునేందుకు 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఈ యేడాది మొత్తం ఎన్నికల సంవత్సరమని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల సమయంలో కొందరు పగటి వేషగాళ్లు వస్తారనీ, ప్రజలను గోల్మాల్ చేసేందుకు యత్నిస్తారన్నారు. అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికీ చేర్చాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయమన్నారు. విజయం కోసం కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పని చేయాలన్నారు. రెండు సార్లు మేడారం నుంచి, నాలుగు సార్లు ధర్మపురి నుంచి గెలిపించిన ప్రజలను ఏనాడూ తాను మరిచి పోలేదన్నారు. అప్పటి నుంచి తనను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల రుణం తీర్చుకుంటున్నామన్నారు.
తనకు వచ్చే 4 లక్షలతో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఏనాడూ ఎవరినీ మోసం చేయలేదని, నీతి, నిజాయితీతో ఇప్పటికీ కడిగిన ముత్యం లాగా ఉన్నానన్నారు. కార్యకర్తలే తన బలం.. బలగమని చెప్పారు. పార్టీని కన్న తల్లి వలే కాపాడుతూ అభివృద్ధిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ గెలుపే లక్ష్యంగా పని చేసి మన ముఖ్యమత్రి కేసీఆర్కు మంచి గిప్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎంపీపీ వ్యాల్ల అనసూర్య, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, సర్పంచ్లు మారం జలేందర్రెడ్డి, గెల్లు చంద్రశేఖర్, కంది లావఁణ్య, బిటుకు పద్మ, పొన్నం స్వరూప తిరుపతి, లక్ష్మీనారాయణ, ఆర్బీఎస్ అద్యక్షులు చుక్క శంకర్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, కో అప్సన్ సభ్యులు రియాజ్, నాయకులు చుంచు మల్లేశ్, నారాయణరావు, జగన్మోహన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
విస్తృతంగా చర్చ జరగాలి
నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా తన ఆపదగా భావించుకుని పని చేసే నాయకుడు మంత్రి ఈశ్వర్. ఎనలేని అభివృద్ధి పనులు చేపట్టారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరగాలి. ధర్మపురి నియోజకవర్గంలో నాటి పరిస్థితులు, నేటి పరిస్థితులపై ప్రజలకు వివరించాలి. రోడ్లు నాడు ఎట్లా ఉండే.. ఇప్పుడెలా ఉండే.. ఈ విషయంపై ప్రజలకు వివరించాలి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీ లాంటి విషయాలపై గ్రామాల్లో కార్యకర్తలు చర్చించాలి.
– కునమల్ల లక్ష్మి, ఎంపీపీ
అందుబాటులో ఉండే నాయకుడు
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, అందుతున్న సంక్షేమ పథకాలపై కార్యకర్తలు చర్చించాలి. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. మంత్రి హోదాలో ఎన్ని పనులు ఉన్న నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నిజమైన నాయకుడు పార్టీల కతీతంగా పనులు చేసే నాయకుడు మంత్రి అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిక మెజర్టీతో బీఆర్ఎస్ గెలుపొందేలా కృషి చేయాలి.
– సింహాచలం జగన్, పార్టీ మండలాధ్యక్షుడు