ఇటీవల వరుసగా కురిసిన అతి భారీ వర్షాలతో వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఒకవైపు వైద్య ఆరోగ్య, మరోవైపు జిల్లా పంచాయతీ శాఖలు రంగంలోకి దిగాయి. ఇందుకోసం 1621 వైద్య బృందాలను ఏర్పాటుచేసి ఇంటింటా సర్వే చేస్తున్నాయి. ఏమాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే సంబంధిత వ్యక్తి తీసుకోవాల్సిన చర్యలు, చికిత్స అవసరాన్ని చెబుతున్నాయి. మరోవైపు.. ప్రస్తుత సీజన్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న అధికార యంత్రాంగం, ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. అనారోగ్యం బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని అన్ని దవాఖానల్లో సీజనల్ వ్యాధులకు సరిపడా మందులను రెడీగా పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తోంది. పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిశీత పరిశీలన చేస్తూ.. నిత్యం సమీక్షలు చేస్తున్నారు.
– కరీంనగర్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా చోట్ల అంచనాలకు మించి వర్షం దంచికొట్టింది. దీంతో చాలా ప్రాంతాలు జలమయమై.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు హె చ్చరిస్తున్నారు. నీరు కలుషితం కావడం వల్ల అతిసార, కలరా, టైఫాయిడ్.. ఈగలు, దోమల వల్ల మలేరియా, మెదడువాపు, డెంగీ, చికెన్గున్య, స్వైన్ప్లూ , శాశ్వకోస సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది. సహజంగా ప్రతి వర్ష కాలంలో వచ్చేవే అయినా.. ఈసారి కురిసిన వర్షం, నిలిచిన నీరు.. వంటి పరిస్థితుల్లో ఎక్కువ వ్యాధులు సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే, వ్యాధుల పట్ల అలక్ష్యం చేయవద్దన్నది ప్రధానంగా వైద్యులు సూచించే సలహా. నిజానికి గతంలో అతిసార వంటి వ్యాధులు బాగా ప్రబలేవి. మిషన్ భగీరథ కింద సురక్షిత నీటి సరఫరా జరుగుతున్న నేపథ్యంలో గడిచిన రెండేళ్లుగా.. జిల్లాలో అతిసార కేసులు నమోదు కాలేదు. ఈసారి కూడా అదే స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.
పొంచి ఉన్న వ్యాధుల విషయాన్ని ముందుగానే గుర్తించిన ప్రభుత్వం.. ఇటు వైద్య ఆరోగ్య శాఖను, అదే సమయంలో జిల్లా పంచాయతీ రాజ్శాఖను అప్రమత్తం చేసింది. ఆ మేరకు వచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న అధికారయంత్రాగం రంగంలోకి దిగింది. ఇందుకోసం ఇం టింటా సర్వే నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాలో 1621 బృందాలను రంగంలోకి దింపింది. కరీంనగర్లో 389, పెద్దపల్లిలో 336, జగిత్యాలో 421 రాజన్న సిరిసిల్లలో 475 బృందాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. నాలుగు రోజులుగా ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో ఆరోగ్య పరిస్థితులపై సర్వే చేస్తున్నాయి. ప్రధానంగా.. ముందుగా ముంపుభారిన పడిన, అలాగే నీరు నిల్వ ఉన్న కాలనీల్లో సర్వేలు కొనసాగుతున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకు ఒక బృందాన్ని నియమించారు. అలాగే, పల్లె దవాఖానాల పరిధిలో సంబంధిత డాక్టర్ అధ్వర్యంలో ముగ్గురు సిబ్బందితో ఒక కమిటీ వేశారు. ఈ బృందాలు ఇంటింటా తిరుగుతూ.. ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నారు.
ఇదే సమయంలో ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్న అధికారులు.. వ్యాధులు ప్రబలడానికి అవకాశాలుంటే.. సంబంధిత ఇంటి యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను వివరిస్తున్నారు. అలాగే, ఏమాత్రం అనారోగ్యం ఉన్నట్లు తెలిసినా.. సంబంధిత సమాచారాన్ని అధికారులకు తెలియజేయడంతోపాటు.. పేషేంట్ కోరిక మేరకు తగు చర్యలు తీసుకుంటున్నారు. వైద్య బృందాలు చేస్తున్న సర్వేలు, సేకరిస్తున్న షాంపిల్స్, పరిస్థితి తీవ్రత వంటి అంశాలను ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా తెలుసుకుంటున్న కలెక్టర్లు నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ఇంకా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూనే.. వివిధ శాఖలు, ప్రజాప్రతినిధుల సహకారంతో సదరు బృందాలకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. డెంగీ వ్యాధికి కారణమయ్యే హీలెక్స్ దోమలు పగలే కుడుతాయి. కాబట్టి.. పాఠశాలల్లోకి వెళ్లే విద్యార్థులు వీటి బారిన పడకుండా ఉండేందుకు ఆయా పాఠశాలలు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలు యాజమాన్యాలను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు సైతం చొరవ చూపాలని సూచిస్తున్నాయి. ప్రధానంగా ప్ర స్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇళ్లలో దోమ తెరలు, మస్కిటో కాయిల్స్ వాడటం వంటివి చేయాలి. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, సంపులు, నీటి ట్యాంకులను మూసి ఉంచాలని, నీటి నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు కాచి వడపోసిన నీరు తాగాలని, తాజా ఆహారం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలపై పంచాయతీ రాజ్శాఖ సంబంధిత సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు, గ్రామీణ ఆరోగ్య మిషన్ సభ్యులకు, మండల పంచాయతీ అధికారులకు, డివిజన్ పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.