NPDCL | పెద్దపల్లి రూరల్, మార్చి 20 : టీజీఎన్పీడీసీఎల్ పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని బసంత్ నగర్ ఆపరేషన్ ఏఈ మానాల ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ఆపరేటర్లు, సంఘం నాయకులు పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ సబ్ స్టేషన్ ఆవరణలోని ఎస్ఈ కార్యాలయం ముందు శుక్రవారం ఆందోళనకు దిగి ఎస్ ఈ గంగాధర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్ఈకి అందజేశారు. ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆపరేటర్లు, యూనియన్ నాయకులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి మాట్లాడుతూ విద్యుత్ సబ్ స్టేషన్లలో పని చేస్తున్న ఆపరేటర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెధిరిస్తున్న ఏఈ ప్రవర్తన సరిగా లేదని విచారణ జరిపి శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డమాండ్ చేశారు. ఏఈ తీరుతో సబ్ స్టేషన్లలో పనిచేసే ఆపరేటర్లు భయాందోళన చెందుతున్నారని వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో మద్యం మత్తులో ఏఈ సబ్ స్టేషన్ లను సందర్శించి ఆపరేటర్లను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఏఈ వైఖరిపై తక్షణమే విచారణ జరిపి ఆపరేటర్లకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ జీ ఆంజనేయులు రీజనల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాగు నాయక్, సీహెచ్ నర్సయ్య, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండయ్య, కే నరేష్, పెద్దపల్లి సర్కిల్ గౌరవ అధ్యక్షుడు భిక్షపతి, మంథని డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్, సర్కిల్ పరిధిలోని ఆపరేటర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.