ఎన్టీపీసీకి చెందిన యాష్ పాండ్ మాఫియా చేతుల్లోకి వెళ్తున్నదా..? పాండ్పై గుత్తాధిపత్యం కోసం పలువురు ప్రయత్నం చేస్తున్నారా..? తాము చెప్పిందే వేదంగా అధిక ధరలకు బూడిద (యాష్)ను అమ్మాలని చూస్తున్నారా..? దీని వెనుక కొంత మంది అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నదా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. బూడిదను తరలించాల్సిన లారీలను ఈ నెల 18 నుంచి నిలిపివేయడమే అందుకు నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సుమారు 400 లారీలు నిలిచిపోవడంతో ఇటుక బట్టీలపై ప్రభావం పడడమే కాదు, పలు జాతీయ రహదారులకు వెళ్లాల్సిన బూడిద ఆగిపోయి పనులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. కొంతమంది నిబంధనల మేరకు యాష్ను తీసుకెళ్లే లారీలను బలవంతంగా నిలిపివేసినా.. పోలీసులు చోద్యం చూస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పాండ్లో నిల్వలు పేరుకుపోయి ఏకంగా ఎన్టీపీసీ ప్లాంటే మూసివేసే ముప్పున్నది. ఇదే సమయంలో పర్యావరణానికి కూడా ప్రమాదం ఏర్పడనున్నది.
కరీంనగర్, జనవరి 22 (నమస్తేతెలంగాణప్రతినిధి) : ఇటుకలు (బ్రిక్స్), జాతీయ రహదారులు, పలు రకాల పనులకు వాడే మట్టిని తగ్గించడంతోపాటు ఇసు క వినియోగాన్ని నివారించేందుకు బూడిదను వాడాలని కేంద్రం 1999లో జీవోను విడుదల చేసింది. ఆ మేరకు 2001 నుంచి బూడిద వాడకం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. బొగ్గు ఆధారిత ప్రాజెక్టు అయిన ఎన్టీపీసీలో బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద కో సం కుందనపల్లి గ్రామం వద్ద పాండ్ను ఏర్పాటు చేశా రు. ప్రతి రోజూ ఎన్టీపీసీ నుంచి వచ్చే సుమారు 11వేల టన్నుల బూడిద ఇక్కడే స్టాక్ అవుతున్నది.
ప్రస్తుతం సుమారు 6 కోట్ల టన్నులకు పైగా స్టాక్ పేరుకుపోయిం ది. నిజానికి కేంద్రం నుంచి జీవో విడుదలైన తర్వాత ‘రూపాయికి టన్ను చొప్పున బూడిద తీసుకెళ్లండి’ అం టూ ఎన్టీపీసీ పలుసార్లు చెప్పినా.. ఆరంభంలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఒకవైపు మట్టి, ఇసుక కొరత ఏర్పడడం, మరోవైపు కేంద్రం బూడిదను ప్రో త్సహిస్తుండడంతో వినియోగం క్రమంగా పెరిగింది. మొదట్లో 2021 సెప్టెంబర్ వరకు బూడిదను ఉచితంగా తీసుకెళ్లేందుకు ఎన్టీపీసీ అనుమతించింది. ఆ తర్వాత పెరిగిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని టెండర్లు పిలుస్తున్నది.
2021లో మొదటిసారిగా బూడిద తరలింపునకు ఎన్టీపీసీ టెండర్లు ఆహ్వానించింది. అప్పుడు టన్నుకు 400 చొప్పున తీసుకునేందుకు టెండర్ దాఖలైంది. అయితే సదరు వ్యక్తి రేటు ఎక్కువగా కోడ్ చేయడంతో కొన్నాళ్లపాటు కొంత మంది వ్యక్తులు ఒక మాఫియాగా మారి.. ఆనాడు వక్రమార్గంలో బూడిదను వివిధ దారుల్లో తరలించారన్న విమర్శలు వచ్చాయి. తిరిగి 2023 జూన్లో మళ్లీ ఎన్టీపీసీ టెండర్లు నిర్వహించగా, 25 లక్షల టన్నుల బూడిదను తీసుకెళ్లేందుకు 28మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ఒక్కో టన్నుకు 40 చొప్పున టెండర్ దాఖలు చేశారు.
ఆ మేరకు ఎన్టీపీసీ ఒకే చేయగా, అందులో ఉమ్మడి జిల్లాలోని సుమారు 200 ఇటుక బట్టీలకు ఏడాదిలో 4.50 లక్షల టన్నులు తీసుకెళ్లేందుకు సదరు బ్రిక్స్ కంపెనీ చెందిన వారు అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని టెండర్లు తీసుకున్నారు. అందులో భాగంగా రోజుకు 200 లారీల బూడిదను తీసుకెళ్లి వినియోగిస్తున్నారు. వీరితోపాటు జాతీయ రహదారులకు రోజుకు 100 లారీలు, అలాగే సింగరేణికి 100 లారీల చొప్పున వెళ్తున్నది. వీటితోపాటు స్లాబ్ల నిర్మాణాల నిమిత్తం ఆర్ఎంసీ వాళ్లు సైతం బూడిదను ఇక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు.
నిత్యం బూడిదను తీసుకెళ్లే లారీలు ఈ నెల 18 నుంచి ఆగిపోయాయి. కొంత మంది వ్యక్తులు బూడిదను తరలించకుండా అడ్డుపడుతున్నారు. బూడిద తెచ్చేందుకు వెళ్లిన లారీల టైర్లలో గాలి తీసేసి డ్రైవర్లపై చేయి చేసుకున్నట్టు తెలుస్తున్నది. టెండర్ ఎవరూ తీసుకున్న ఫరవాలేదు గానీ, పాండ్ వద్ద బూడిద ఎత్తి లారీల్లో నింపడంతోపాటు వివిధ ప్రాంతాలకు చేరేవేసే అవకాశం స్థానిక ట్రాన్స్పోర్టుదారులకే ఇవ్వాలని కొంత మంది ఆందోళన చేస్తున్నారు.
అయితే స్థానికంగా ఉపాధి కావాలని కోరుకోవడం తప్పు లేదు గానీ, ప్రస్తుతం టెండర్ నిబంధనలకు లోబడి నడుస్తున్న లారీలను అడ్డుకోవడం ఎంత వరకు సముచితమని టెండర్దారులు ప్రశ్నిస్తున్నారు. ఈ డిమాండ్ను ప్రభుత్వం లేదా ఎన్టీపీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, కొంతమంది స్థానిక ట్రాన్స్పోర్ట్ను చూపుతూ.. తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకునేందుకు ప్లాన్ చేశారన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
అలాగే మాఫియాగా మారి బూడిద తరలింపును తమ చేతుల్లోకి తీసుకునేందుకు కుట్రలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ తతంగానికి కొంత మంది అధికార పార్టీ నాయకులు కూడా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారి సహకారం లేకుంటే.. వందలాది లారీలను ఆపే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత టెండర్ గడువు 2024 జూన్ చివరి వరకు ఉన్నదని, ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. కొత్త టెండర్లు పిలిచే సమయంలో చూసుకోవాలే తప్ప.. ఇలా నిబంధనల ప్రకారం నడుస్తున్న లారీలను ఆపడం సరికాదని పలువురు టెండర్ దారులు స్పష్టం చేస్తున్నారు. దీని వెనుక పెద్ద వ్యవహారమే ఉందని అనుమానిస్తున్నారు.
నిజానికి ఒక లారీలో 26 టన్నులు బూడిద పడుతుంది. ఈ లెక్కన అన్నీ కలిపి ఎన్టీపీసీకి ఒక లారీకి 1100 చెల్లిస్తారు. అలాగే లోడింగ్కు 1400 తీసుకుంటున్నారు. ప్రస్తుతం టెండర్దారులు అనుసరిస్తున్న పాలసీ ఇది. అయితే ఈ వ్యవస్థను మొత్తం తమ చేతుల్లోకి తీసుకొని, ఒక్కో లారీపై వేలాది రూపాయలు వసూలు చేసేందుకు కొంతమంది ఒక మాఫియాగా ఏర్పడి ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందులో భాగగానే బూడిదను తరలించకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
కాగా, టెండ ర్ నిబంధనల ప్రకారం.. ఒకవేళ పాండ్ నుంచి బూడిదను సదరు టెండర్దారుడు ఇన్టైంలో తరలించక పో తే.. ఎన్టీపీసీ సదరు కాంట్రాక్టర్కు ఫైన్ విధిస్తుంది. ఇప్పటికే ఒక కాంట్రాక్టర్కు 18 లక్షలు, మరో కాంట్రాక్టర్ 9 లక్షల ఫైన్ విధించినట్టు తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో లారీలను నిలిపివేస్తే నిర్ణీత లక్ష్యం మేరకు బూడి ద తరలించలేని పరిస్థితి ఏర్పడుతుందని, అదే జరిగితే తాము చేయని తప్పుకు ఫైన్ చెల్లించాల్సి వస్తుందని ప్రస్తుత కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్రిక్ ఇండస్ట్రీ వారు ఆవేదన చెందుతున్నారు.
4.50 లక్షల టన్నుల బూడిద తీసుకునేందుకు బ్రిక్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ వారు టెండర్ దాఖలు చేసినప్పటికీ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోపాటు హైదరాబాద్ కలిపి ఇటుక బట్టీలకు ఏటా 15 లక్షల టన్నుల వరకు బూడిద వాడుతున్నారు. బ్రిక్స్ పరిశ్రమపై ఉమ్మడి జిల్లాలో ప్రత్యక్షంగా లక్ష, పరోక్షంగా దాదాపు రెండు లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో బూడిద తరలింపును అడ్డుకుంటే.. ఇటుక బట్టీల మనుగడ ప్రశ్నర్థకంగా మారే ప్రమాదమున్నది.
ఒకవేళ మాఫియా చెప్పినట్టు అధిక ధరకు బూడిద కొనుగోలు చేస్తే.. ఇటుక బట్టీల నిర్వాహకులు కూడా ధరలు పెంచే ఆస్కారమున్నది. దీని ప్రభావం సామాన్యులపై పడుతుంది. దీంతోపాటు జాతీయ రహదారుల పనులు కూడా నిలిచిపోయే ప్రమాదమున్నది. ఇటు బూడిద తరలింపునకు అడ్డు పడితే.. పాండ్లో నిల్వలు భారీగా పేరుకుపోయి ఏకంగా ఎన్టీపీసీ మూత పడే ముప్పు ఉంటుంది. అలాగే చుట్టు పక్కల గ్రామాలు ముఖ్యంగా కుందనపల్లిలో పర్యావరణం దెబ్బతినే ప్రమాదముంటుంది.
అయితే నిబంధనలకు విరుద్ధంగా వందలాది లారీలను నిలిపివేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు దగ్గరుండి సమస్యను పరిష్కరించిన పోలీసులు, ఈ సారి మాత్రం ఊదాసీనత వహించడం చూస్తే సదరు పోలీస్ అధికారులపై ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపించాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్నది.