గంగాధర, నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే తెలంగాణను అధోగతిపాలు చేస్తారని, ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకునే సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని చొప్పదండి అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మైత్రీ గ్రూప్స్ చైర్మన్, కాంగ్రెస్ నేత కొత్త జైపాల్రెడ్డి చేరికతో చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని నాగిరెడ్డిపూర్లోని జైపాల్రెడ్డి గెస్ట్హౌస్లో గురువారం చొప్పదండి నియోజవర్గంలోని ఆరు మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు దాదాపు 3 వేల మంది జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ గెలుపు కోసం పని చేయాలని సూచించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొత్త జైపాల్రెడ్డి మాట్లాడుతూ, చొప్పదండి నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేస్తామన్నారు. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న జైపాల్రెడ్డి మిత్రమండలి సభ్యులు అంతా బీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ ఖాళీ అయిందన్నారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసకువెళ్లి ప్రచారం చేస్తామని, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను భారీ మెజార్టీతో గెలిపించి రెండో సారి అసెంబ్లీకి పంపుతామన్నారు. ఇక్కడ జైపాల్రెడ్డి మిత్ర మండలి సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.