రాష్ట్ర సర్కారు భగీరథ ప్రయత్నం ఫలించింది. మూలవాగు, మానేరు పరివాహక గ్రామాల దశాబ్దాల నాటి సాగునీటి స్వప్నం నెరవేరింది. వృథాగా పోతున్న జలాలకు అడ్డుకట్ట వేసి, సాగునీరందించాలని ఇక్కడి రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నా గత ప్రభుత్వాల హయాంలో కనీస పట్టింపు కరువైన సమస్యకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిష్కారం దొరికింది. మంత్రి కేటీఆర్ చొరవతో 174కోట్లతో గంభీరావుపేట మండలం నుంచి సిరిసిల్ల దాకా విస్తరించిన మానేరుపై 11, వేములవాడ మూలవాగుపై 12 చెక్డ్యాంల నిర్మాణాన్ని చేపట్టగా, అందులో పూర్తయిన ఆవునూరు, కస్బెకట్కూరు గ్రామాల్లోని జల వారధులు నీటితో కళకళలాడుతున్నాయి. కనుచూపుమేరలో నీటితో నిలిచి రైతన్న సాగు, సమీప పల్లెల తాగునీటి కష్టాలు తీర్చగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– రాజన్న సిరిసిల్ల, మే 11 (నమస్తే తెలంగాణ)
వరద నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మించిన చెక్ డ్యాంలు జలకళ సంతరించుకున్నాయి. మండుటెండల్లో మత్తళ్లు దూకుతూ సవ్వడి చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్ చొరవతో మానేరు, మూలవాగులు జీవనదులుగా మారి కోనసీమను తలపించనున్నందున మెట్ట ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Sircilla | రాజన్న సిరిసిల్ల, మే 11 (నమస్తే తెలంగాణ): నాడు రాజన్న సిరిసిల్ల మెట్ట ప్రాంతం. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికిగురైంది. రైతుల సాగు, ప్రజల తాగు నీటి కష్టాలను పట్టించుకోని కారణంగా తీవ్ర దుర్భిక్షం నెలకొంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు కుదేలయ్యాయి. కేవలం వర్షాధార పంటలు తప్ప యాసంగిలో పంట వేసే పరిస్థితి ఉండేదికాదు. ఒకవేళ ధైర్యం చేసి పంటలు వేసినా సరిగ్గా పంటలు పండక, దిగుబడులు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో విసిగివేసారిన రైతులు నీటి వసతులు కల్పించాలని గత ప్రభుత్వాలకు విన్నవించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే స్వరాష్ట్ర కల సాకారం కావడం, రైతు బిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, సిరిసిల్ల ఎమ్మెల్యేగా మంత్రి కేటీఆర్ ఉండడంతో రైతులకు మంచిరోజులు వచ్చాయి. మానేరు, మూలవాగులో వృథాగా పోతున్న జలాల అడ్డుకట్ట వేసేందుకు చెక్డ్యాంలు నిర్మించి రైతుల దశాబ్దాల కల నెరవేర్చారు.
23 చెక్డ్యాంలు
ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మెట్ట ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంత ప్రజలు, రైతులు పడుతున్న తాగు, సాగునీటి కష్టాలు తీర్చేందుకు మానేరు, మూలవాగులపై చెక్డ్యాంలు నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. గంభీరావుపేట మండలం నుంచి సిరిసిల్ల దాకా విస్తరించిన మానేరుపై 11, వేములవాడ మూలవాగుపై 12 చెక్డ్యాంల నిర్మాణానికి 174కోట్లు మంజూరు చేయించారు. రెండేళ్ల క్రితం చేపట్టిన నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. అందులో పూర్తయిన ముస్తాబాద్ మండలం ఆవునూరు వాగు, తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూరు వాగుపై చెక్డ్యాంలకు వరద నీరు చేరి జలకళ సంతరించుకున్నాయి. ఎటు చూసినా కిలోమీటరు పొడవునా భారీ ఎత్తున నీరు నిలిచి చిన్న ప్రాజెక్టును తలపిస్తున్నది. మత్తడి ద్వారా వస్తున్న నీరు మానేరుకు జలశోభను తెచ్చింది. వర్షాకాలంలో మాత్రమే వరద నీటి ప్రవాహంతో కనిపించే మానేరు దంచికొడుతున్ను ఎండల్లోనూ జలతరంగాలతో కనువిందు చేస్తున్నది.
పెరిగిన భూగర్భజలాలు
చెక్డ్యాంలు నిండుకుండలా మారి భూగర్భ జలాలు పెరిగాయి. నాడు 9మీటర్ల అడుగులో ఉన్న నీరు నేడు 3మీటర్ల ఎత్తుకు పెరిగింది. ఒకప్పుడు సిరిసిల్ల జిల్లాలో 500 అడుగుల నుంచి 800 అడుగుల వరకు బోరు వేసిన నీళ్లు పడని పరిస్థితి ఉండేది. ప్రభుత్వం చేపట్టిన మధ్యమానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్లతో పాటు గంభీరావుపేట మండలం ఎగువ మానేరును మల్లన్న సాగర్ జలాలతో నింపడం వల్ల భూగర్భ జలాలు బాగా పెరిగాయి. బొట్టుబొట్టు ఒడిసి పట్టేలా ప్రభుత్వం చేపట్టిన చెక్డ్యాంలతో ఏడాది పొడవునా వాగుల్లో నీరు నిలిచి తాగు, సాగు నీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించినందుకు జిల్లా ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. చెక్డ్యాంల నిర్మాణంతో వాగుల్లో నిరంతరం నీరు ఉండే అవకాశం ఉంది. 23చెక్డ్యాంలలో సగానికి పైగా పూర్తికాగా, మిగిలినవన్ని 85శాతం పూర్తి చేశారు. త్వరలో అన్నింటినీ అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషిచేస్తున్నారు.
జీవనదులుగా..
ఒకవైపు నర్మాల ఎగువ మానేరు, మరోవైపు 160కోట్లతో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్లతో మెట్ట ప్రాంతంలోని బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారనున్నాయి. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీలో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు తుది దశకు వచ్చాయి. త్వరలో మానేరు, మూలవాగులు జీవనదులుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఎదుర్కెక్కిన కాళేశ్వర జలాలతో రామప్ప గుట్టలు కనువిందు చేస్తున్నవి. ఉత్తర భారతంలో చూస్తున్న జీవనదులు మన జిల్లాలో సైతం కనిపిస్తాయనడానికి అపరభగీరథుడు కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు, చెక్డ్యాంలే నిదర్శనం. మంత్రి రామన్న కృషి ఫలితంగా వాగులు, చెరువులు, ప్రాజెక్టులకు వచ్చిన జలసవ్వడులతో భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల కోనసీమను తలపించనున్నదంటూ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నీళ్లను జూస్తే కడుపు నిండుతంది
మా ఊరు సర్దాపూర్. మానేరు వాగుకు ఆనుకునే ఉంటది. మాఊరోళ్ల పోలాలన్నీ వాగు పొంటే ఉంటయి. పక్కకే వాగున్నా చుక్కనీరు రాక గోసపడ్డం. ఆ కాలంల 500 ఫీట్ల బోరేసినా నీళ్లుపడకపోతుండె. తెచ్చిన అప్పులన్నీ భూమిలోనే పోసినోళ్లు శాన మంది ఉన్నరు. వానచ్చి నర్మాల నిండితే గానీ వాగు పారకుండె. నేను చిన్నపోరనప్పటి నుంచి జూత్తున్న. ఎండకాలంలో సుక్క నీరుండేది కాదు. సీఎం కేసీఆర్ జెయ్యవట్టి కాలం మంచిగైతంది. మా రామన్న వచ్చినంక ఊరు మంచిగైంది. రెండు మూడు వానలు బగ్గ పడ్డయి. కట్కూరు నడుమ చెక్డ్యాం కట్టిన్రు. మొన్న పడ్డ వానలకు నీళ్లు నిండి డ్యాం మత్తడి పడుతంది. దూకిన నీళ్లు పాయలు పాయలుగా పారి సిరిసిల్లకేల్లి పోతున్నయి. మైలు దూరందాక నీళ్లు కనిపిస్తన్నయ్. వాటిని సూత్తుంటే ఇవి నా కండ్లేనా..? అనిపించింది. గింత ఎండల్లో వాగులో నీళ్లోచ్చినయంటే మాతోటోళ్లు ఎవరు నమ్మలె. పొద్దుగాల పొలం కాడికి పోంగ వాగును చూసి అందరూ ఆగమైన్రు. ఇది మన వాగేనా..? అని అనుకున్నరు. రామన్న చెయ్యవట్టి సిరిసిల్లకు నీళ్లచ్చినయ్. ఇగ నుంచి నీళ్ల గోస ఉండదని సంబురపడుతున్నం. ఆ దేవుడికి రెండు చేతులెత్తి మొక్కుకుంటున్నం.
– ఏరుపుల భీమయ్య, రైతు (సర్దాపూర్)
కరువుల ఎకరం భూమి అమ్ముకున్నా
నాడు సాగునీటికి గోస ఎల్లదీసినం. తాగునీళ్లులేక బిందెలు చేతపట్టుకుని వ్యవసాయ బావుల్లోకెల్లి తెచ్చుకున్నం. ఎవుసానికి నీళ్లు లేక మూడెకరాలల్ల ఎకరం అమ్ముకున్న. రోజుకు 30 చొప్పున కైకిలికి పోయిన. చెల్లెలి పెండ్లికి ఉన్న రెండకరాలూ అమ్మినం. అప్పుడు గిట్ల నీళ్లుంటే ఉన్న మూడెకరాలతోటి మరో పదిఎకరాలు కొనేటోన్ని. రంగనాయక సాగర్ నీళ్లతో నిండిన చెరువులు సూత్తే ఎంత భూమి ఉంటే అంత పంటేసుకోవచ్చు. మంత్రి రామన్న అప్పుడే ఉంటే ఇంత గోసఉండేది కాదు. నా భూమి నాకుండేది. గింతెండల్లో గూడా చెరువులు అలుగులు పారుతున్నయంటే కేటీఆర్ దయవల్లనే. మా అందరి కష్టాలు తీర్చిన కేటీఆర్ రుణం తీర్చుకోలేనిది. కట్కూరు దగ్గర చెక్డ్యాం నిండి మత్తడి దూకుతుంటే పాణం లేసొచ్చినట్లయ్యింది. జన్మజన్మలకు రుణపడి ఉంటం.
– రోకండ్ల రాజేశ్వర్రావు, నేరెళ్ల (తంగళ్లపల్లి మండలం)
ఇన్నేండ్ల గోస తీరింది
మాకున్న మూడెకరాల పొలంలో వరి సాగుకు పడ్డ కష్టాలు కడుపు చింపుకుంటే కాళ్లమీద పడ్డట్టుంటది. నీళ్లు, కరెంటు లేక అరిగోస ఎల్లదీసినం. సీఎం కేసీఆర్ సార్ వచ్చినంక కాలాలు మంచిగైనయ్. బోర్లలో నీళ్లు మీదికే వచ్చినయ్. పోయినేడు మూడెకరాలలో వేసిన వానాకాలం పంట దిగుబడి బాగొచ్చింది. ఆశతో ఈ యాసంగి పంటేస్తే నీళ్లు తగ్గి ఏసిన పంట చేతికొత్తదో రాదో..? అన్ని తండ్లాడినం. జిల్లెలకు వచ్చిన మంత్రి కేటీఆర్ సార్కు చెప్పి నీళ్లియ్యమని అడిగినం. రెండు రోజులకే రంగనాయక సాగర్ నీళ్లు ఇడిసిండ్రు. చెరువు నిండి పొలాలకచ్చినయ్. సార్ సల్లంగుండాలే. ఆయన నీళ్లయ్యక పోతే పంట దక్కక పోయేది. వాగులమీద కట్టిన డ్యాంలల్ల నీళ్లు నిండి ప్రాజెక్టులెక్క కనిపిస్తుంది. గీ ఎండల్లోనే నీళ్లొచ్చినయంటే ఇగ ఎప్పటికీ ఉంటయి. సార్కు రుణపడి ఉంటం.
– పయ్యావుల గోపాల్, రైతు (సర్దాపూర్)