ఎల్లారెడ్డిపేట, జూన్ 24: కోటి ఆశలతో ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లిన యువకుడు.. శవపేటికలో ఇంటికి చేరాడు. విగతజీవిగా పడిఉన్న కొడుకును చూసి కన్నపేగు తల్లడిల్లింది. శవపేటికపై పడి ‘కొడుకా రారా.. ఒక్కసారి నాతో మాట్లాడవా.. ఎంతపనాయే బిడ్డా.. ఇగ మాకు దిక్కెవరూ’ అంటూ గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు గ్రామస్తులను కలిచివేసింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన శివయ్యగారి నవీన్ (27) ఉపాధి కోసం కొన్నేండ్లుగా దుబాయ్కు వెళ్తున్నాడు. ఏడాది క్రితం ఇంటికి రాగా తల్లిదండ్రులు వేములవాడకు చెందిన మమతతో వివాహం జరిపించారు. పెండ్లయిన నెలకే భార్యతో కలిసి దుబాయ్కు వెళ్లాడు. వీరిద్దరూ ఓ బ్యాంకులో ఉద్యోగం చేసుకూంటూ ఆన్యోనంగా బతుకుతున్నారు.
ఈ క్రమంలో గత సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన నవీన్ అక్కడే ఛాతిలో నొప్పి వస్తుందంటూ కుప్పకూలాడు. దవాఖానకు తరలించేలోగా మరణించాడు. ఎన్ఆర్ఐ రాధారాపు సత్యం సహకారంతో శనివారం శవపేటికలో మృతదేహం ఇంటికి చేరగా తల్లిదండ్రులు నర్సవ్య, నర్సయ్య, భార్య మమత బోరున విలపించారు. బంధువులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సుమారు 300 మంది మిత్రులు బస్టాండ్ నుంచి ఇంటి వరకు ర్యాలీ తీశారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొని ఆత్మీయుడికి కడసారి వీడ్కోలు పలికారు. కాగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి నవీన్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.