చదువు తర్వాత ఉద్యోగ, ఉపాధికి కావాల్సిన వృత్తి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కరీంనగర్ జిల్లాలో సత్ఫలితాలనిస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని 62 ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల్లో ఆసక్తి ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల వ్యక్తిగత, సంస్థాగత, సాంకేతిక పరిజ్ఞానానికి పదునుపెడుతున్నది. దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్లోని తమ సెంటర్లో శిక్షణ ఇస్తూ, సదరు సంస్థల్లో కొలువులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. 2021 జనవరిలో ప్రారంభమైన ఈ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 35 బ్యాచ్ల్లో 1100 మందికి ట్రైనింగ్ ఇచ్చి, దాదాపు 500 మందికి జాబ్స్ ఇప్పించి యువత కలలు సాకారం చేసింది.
కమాన్ చౌరస్తా, జూన్ 28 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు ముగిసిన వెంటనే ఉద్యోగాలు సంపాదించడమంటే మాటలు కాదు. ఇంజినీరింగ్లాంటి వృత్తి కోర్సులను అభ్యసించిన ఎందరో నిరుద్యోగులుగా మిగిలిపోతున్న తరుణంలో డిగ్రీ, పీజీ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. చాలా మంది విద్యార్థులకు తెలివితేటలు పుష్కలంగా ఉన్నా, కావాల్సిన వృత్తి నైపుణ్యాలు లేక ఉద్యోగాలు సాధించలేని పరిస్థితి. ఇలాంటి వారిలో వ్యక్తిగత, సంస్థాగత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పడిందే టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్). రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రారంభమైన ఈ సంస్థ అతి తక్కువ టైంలోనే ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. విద్యార్థులను వివి ధ అంశాల్లో తీర్చిదిద్దుతూ కొలువులు కట్టబెడుతున్నది.
ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు వ్యక్తిగత, సంస్థాగత, సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నది. కార్పొరేట్ కంపెనీలు ఆశిస్తున్న స్థాయిలో వృత్తినైపుణ్యాలు పెంపొందిస్తున్నది. టాస్క్లో రిజిస్టర్ అయిన కాలేజీల విద్యార్థులకు మాత్రమే శిక్షణ ఇస్తారు. విద్యార్థులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో 62 ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలు టాస్క్లో నమోదు కాగా, గతేడాది దాదాపు 5200 మంది విద్యార్థులు టాస్క్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే, రానున్న రోజుల్లో ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలను దృష్టిలో పెట్టుకుని వారందరికీ శిక్షణ ఇస్తూ, ప్రైవేట్ సంస్థలను ఇంటర్వ్యూలకు తీసువస్తూ ఖాళీలను భర్తీలో టాస్క్ తనదైన ప్రాత పోషిస్తున్నది. ఈ క్రమంలో విద్యాసంస్థలు, పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వారధిగా పనిచేస్తున్నది.
ఐటీ టవర్లో టాస్క్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. 2021 జనవరిలో ప్రా రంభమైన ఈ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 35 బ్యాచ్ల్లో 1100 మందికి శిక్షణ ఇవ్వగా, అందులో దాదాపు 500 మంది ఉద్యోగాలు సాధించారు. సంప్రదాయ తరగతి గది శిక్షణ తరహాలో కాకుండా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు టాస్ మూ డంచెలుగా కోర్సు కాలాన్ని విభజించి శిక్షణ ఇస్తున్నారు. వ్యక్తిగత నైపుణ్యాల అభివృద్ధికి ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కోసం పర్సనల్ ఇంపాక్ట్ సిల్స్, టీం వర్కు కావాల్సిన నైపుణ్యాల కోసం ఆర్గనైజేషన్ ఇంపాక్ట్ సిల్స్, టెక్నికల్ సిల్ అనే పేరిట కోర్సు కాలాన్ని మూడు భాగాలుగా విభజించి నిపుణులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ అందిస్తున్నారు. పరిశ్రమల అవసరాలకు కావాల్సిన సిల్స్ను నేర్పిస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు వివరిస్తున్నారు.
యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఉన్నత స్థాయి పారిశ్రామిక దిగ్గజాలతో టాస్ ఒప్పందం కుదుర్చుకున్నది. విప్రో, ఒరాకిల్, సేల్స్ ఫోర్స్, ఐబీఎం, శామ్ సంగ్, ఆటోడెస్ వంటి దాదాపు 30 సంస్థలు శిక్షణ, ఉద్యోగాలు కల్పనకు టాస్ భాగస్వామిగా పని చేస్తున్నది. ఇదే క్రమంలో సదరు కంపెనీలు సైతం తమ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా చూస్తూ ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. టాస్ వద్ద నమోదైన ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాల క్యాంపస్లోనే సంబంధిత కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
టాస్క్ ఆధ్వర్యంలో నెల రోజులుగా శిక్షణ తీసుకుంటున్న. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఒక ప్రాజెక్టు ఎలా తయారు చేయాలో తెలిసింది. ఇది నాకు ఉద్యోగ సాధనలో ఉపయోగకరంగా ఉంటుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తే వేలకు వేలు ఫీజు కట్టాల్సి వచ్చేది. కానీ, ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా ఇలాంటి శిక్షణ దొరకడం సంతోషంగా ఉంది.
– జీ మనోజ్ఞ, బీటెక్, సీఎస్సీ (నాచుపల్లి)
కాలేజీలో ఉన్నప్పుడు ప్రాజెక్టు ఎలా తయారు చేయాలో తెలిసేది కాదు. నలుగురితో కలిసి చేసినప్పుడు కొన్ని విషయాలు అర్థం అయ్యేవి కావు. కానీ, టాస్క్ శిక్షణలో ఒక ప్రాజెక్టు ఎలా తయారు చేయాలనే అంశాలు బాగా తెలిశాయి. మేం ఇప్పుడు సొంతంగా ప్రాజెక్టు తయారు చేసి కంపెనీలకు పంపించేలా నైపుణ్యం సాధించాం. కరీంనగర్లో టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రం దొరకడం మా అదృష్టం.
– ఎన్ భావన, బీటెక్, సీఎస్సీ (వేములవాడ)
డిగ్రీలో కళాశాలకు వచ్చిన పలు సంస్థల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యా. కానీ, ఆ సమయంలో అన్ని అంశాలలో అవగాహన లేక పోవడంతో సరిగా రాణించలేక పోయాం. ఇంజినీరింగ్ వాళ్లకే ఆ ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం. మా కళాశాలకు టాస్క్లో సభ్యత్వం ఉండడం వల్ల ప్రత్యేక శిక్షణ వల్ల ఉద్యోగం సాధిస్తామనే నమ్మకం వచ్చింది. ఇక ముందు ఇంటర్వ్యూకు హాజరైతే తప్పుకుండా ఉద్యోగం సాధిస్తా.
– బీ కోకిల, బీఎస్సీ (చొప్పదండి)
కాలేజీలో చదువుకు సంబంధించిన అన్ని అంశాలు నేర్చుకున్నాం. కానీ జాబ్ సాధించాలంటే అదొక్కటే సరిపోదు అనిపించింది. అందుకోసం ఫస్టియర్లోనే టాస్క్లో సభ్యత్వం తీసుకున్నాం. అప్పటి నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం. ఇది మాకు ఎంతో ఉపయోగపడుతుంది. టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం.
– వై రమ్య, బీఎస్సీ (కరీంనగర్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టాస్క్ కేంద్రాలను నిర్వహిస్తున్నది. యువత 100 శాతం ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో ఇంటర్వ్యూలను కళాశాలలో నిర్వహిస్తూ, వేల సంఖ్యలో విద్యార్థులను ఉద్యోగాలు అందించాం. ప్రతి కళాశాల, విద్యార్థులు టాస్క్లో సభ్యత్వం తీసుకున్న నాటి నుంచే వారికి అవసరమైన వనరులు కల్పిస్తూ, శిక్షణ ఇస్తున్నాం. ఇలాంటి శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. డిగ్రీ, బీటెక్ కళాశాలలు ప్రారంభమైన నాడే టాస్క్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
– గంగాప్రసాద్, టాస్క్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్