Medicine Update | జగిత్యాల, జనవరి 2 : జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ భీమనాతిని శంకర్ కు అరుదైన అవకాశం దక్కింది. మెడిసిన్ అప్డేట్-2026 వైద్య గ్రంథంలో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురితమైంది. వైద్య రంగంలో కొత్త కొత్త అంశాలు, ఆవిష్కరణలతో ప్రతీ సంవత్సరం న్యూఢిల్లీలోని జేపీ బ్రదర్స్ ద్వారా ప్రచురితమయ్యే మెడిసిన్ అప్డేట్-2026 వైద్య గ్రంథంలో డాక్టర్ శంకర్ వ్రాసిన ‘శ్వాసకోశ ఉబ్బస వ్యాధులు-ఆధునిక చికిత్స పద్ధతులు’ అనే వ్యాసం ప్రచురితమైంది.
ఈ వైద్య గ్రంథాన్ని ఈనెల 29న బీహార్ రాజధాని పాట్నాలో జరిగే ఫిజీషియన్ల జాతీయ సదస్సులో ఆవిష్కరించనున్నారు. ఇలాంటి అరుదైన అవకాశం దక్కడంతో డాక్టర్ శంకర్ ఈ సందర్భంగా తన గురువులకు, సహచర వైద్య మిత్రులకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య వృత్తిలో ఉండే ప్రతీ వ్యక్తికి ఉపయోగపడే వైద్య గ్రంథంలో జగిత్యాల ప్రాంతానికి చెందిన డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురితమవడం పట్ల పలువురు వైద్యులు డాక్టర్ శంకర్ ను అభినందించారు.