Rachchapalli | ధర్మారం, ఫిబ్రవరి 8 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా విద్యార్థులను విజ్ఞాన విహార యాత్రలకు తీసుకెళ్లటం సహజం. కానీ ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం వినూత్నంగా విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి వారిని విజ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్లింది. ఆ పాఠశాల హెడ్మాస్టర్ సముద్రాల వంశీ మోహన చార్యుల ఆధ్వర్యంలో విహార యాత్రలో భాగంగా రామప్ప, లక్నవరం, మేడారం ప్రదేశాలను ఆదివారం సందర్శించారు.
ఆయా ప్రాంతాల ఆవశ్యకత, విశిష్టతను విద్యార్థులకు హెడ్మాస్టర్ వంశీ మోహన చార్యులు, ఉపాధ్యాయులు వివరించారు. ముఖ్యంగా నాలుగో తరగతి పాఠ్యాంశంలో ఉన్న రామప్ప, లక్నవరం ప్రదేశాల గురించి ప్రధానోపాధ్యాయుడు వివరిస్తూ రామప్ప ఒక శిల్పి అని అతని కళా ప్రతిభకు ముగ్దుడైన రేచర్ల రుద్రుడు ఈ దేవాలయానికి శిల్పి పేరు కలకాలం నిలిచేలా రామప్పగా నామకరణం చేశారని వివరించారు. ఆ కాలంలో ఇసుక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ దేవాలయం నిర్మించారని ఆయన వివరించారు.
ఈ విజ్ఞాన యాత్రకు పాఠశాలలో చదువుతున్న 40 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తరలి వెళ్లారు. పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలతో పాటు తమకు కూడా ఈ విహార యాత్రలో అవకాశం కల్పించటం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సహ ఉపాధ్యాయుడు సంపత్, వీవీ లక్ష్మణ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ప్రమీల, వార్డు మెంబర్ సునీత తదితరులు పాల్గొన్నారు.