కార్పొరేషన్, జూన్ 22: తెలంగాణ ఏర్పాటుతోనే నగరాభివృద్ధికి వందల కోట్ల నిధులు వచ్చాయని, దీంతో నగరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించారు. అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, సమైక్య పాలనలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిధులు కావాలని ఎన్నిసార్లు అడిగినా రూపాయి ఇచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే ఈ స్థాయిలో నిధులు వచ్చేవా అని ప్రశ్నించారు?. అమరవీరుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకారమైందన్నారు. సమైక్య పాలనలో సాగునీరు లేక భూములు బీడుగా మారాయని, రైతులు పంటల సాగు కోసం అష్టకష్టాలు పడ్డారన్నారు.
మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగు నీరు తెచ్చుకునే పరిస్థితులు ఉండేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా నీరు అందుతోందన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. అమరవీరుడు పోలీస్ కిష్టయ్య కూతురిని డాక్టర్ చేశారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను వెలకట్టలేమన్నారు. కరీంనగర్పై ఉన్న ప్రత్యేక అభిమానంతో సీఎం కేసీఆర్ వందల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటుతోనే కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ వచ్చాయని గుర్తు చేశారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్కు మేయర్ సునీల్రావు, కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. కాగా, మేయర్ సునీల్రావును తన కుర్చీలో కూర్చోబెట్టి మంత్రి గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.