ఒక వైపు అభివృద్ధి.. మరోవైపు సింగరేణి కార్మికుల సంక్షేమం.. ఈ రెండింటినీ తెలంగాణ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తూ పారిశ్రామిక నగరమైన రామగుండంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. రూ.వందల కోట్ల నిధులతో ప్రగతిని పరుగులు పెట్టించింది. కార్మికుల కోసం అనేక వరాలు ప్రకటించి, అమలు చేసింది. రూ.500 కోట్లతో వైద్య కళాశాలను ఏర్పాటు చేసి విద్యార్థుల వైద్య విద్య కలను సాకారం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన క్రమంలో రామగుండం ప్రాంతానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేసి, అధునాతన వసతులతో భవనాన్ని నిర్మించింది. నగరంలోని ప్రధాన రహదారులు, ఇతర రోడ్లను అభివృద్ధి చేసి, కూడళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
– పెద్దపల్లి, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ)
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో రూ.వందల కోట్ల నిధులు వెల్లువలా మంజూరవుతుండడంతో అనేక రంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. సింగరేణి బొగ్గు పరిశ్రమతో పాటు దక్షిణ భారతదేశానికి వెలుగులు అందించే రామగుండం ఎన్టీపీసీ, రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) సంస్థలు ఒకవైపు.. సింగరేణి మెడికల్ కళాశాలతో వైద్య రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ ప్రాంతానికి అనేక విధాలుగా తోడ్పాటునందిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన క్రమంలో రామగుండంను జిల్లా చేయకున్నా ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. ఇంకా అనేక అభివృద్ధి పనులను చేపట్టారు.
సింగరేణి కార్మికులకు అనేక వరాలు
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు అనేక వరాలనిచ్చి ఆదుకున్నది. నేలతల్లి ఒడిలో ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడే కార్మికన్నను కడుపులో పెట్టుకుంటున్నది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్దన్నపాత్రను పోషించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.