GodavariKhani | కోల్ సిటీ, మార్చి 23 : కోడి కొండెక్కి కూర్చుంది. చికెన్ ముక్క నోటికి అందనంటోంది. గోదావరిఖనిలో చికెన్ ధర అమాంతం పెరిగింది. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ.260 ఉండగా అదిప్పుడు రూ.400లకు ఎగబాకింది. నెల రోజుల్లోనే రూ.150 పెరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెరిగిన ధరలతో కిలో చికెన్ కొనుగోలు చేసేవారు అర్ధ కిలో చికెన్ తీసుకొని సరిపెట్టుకోవాల్సి వస్తోంది. సాధారణంగా సామాన్యులు మటన్కు బదులు చికెన్ తింటుంటారు. కానీ, ఇప్పుడు చికెన్ కంటే మటనే నయమంటున్నారు. చికెన్ తినేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
రెస్టారెంట్లు, హోటళ్లలోనూ, వినియోగం తగ్గింది. ముక్క లేనిదే ముద్ద దిగదనుకొనే వారికి చికెన్ చిక్కనంటోంది. మున్సిపల్ ఎన్నికలు, సమ్మక్క జాతర, ఎల్లమ్మ, పోచమ్మ. బోనాలతో చికెన్ విరివిగా వినియోగించారు. కోళ్ల ఉత్పత్తి తగ్గడమే ప్రస్తుతం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. దీనితో చికెన్ సెంటర్లలో కూడా గిరాకీ గణనీయంగా తగ్గుముఖం పట్టింది.