ఆరుపదులు దాటిన వృద్ధుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ ప్రారంభానికి ముస్తాబవుతున్నది. కలెక్టర్ కర్ణన్ చొరవతో ఏ4 రూంను కేటాయించారు. 30 లక్షలు ఖర్చుచేసి మరమ్మతులు చేయించారు. అందులో యోగా, జిమ్ సెంటర్లు, టెలివిజన్, విశ్రాంతి గది బెడ్లను సిద్ధం చేశారు. మరో మూడు, నాలుగురోజుల్లో పనులు పూర్తికానుండగా మే మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కలెక్టరేట్, ఏప్రిల్ 29: గజీబిజీగా మారిన ఆధునిక జీవన విధానంలో వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మలివయస్సులో అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలుకరించేవారు లేక మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పండుటాకులకు భరోసానిచ్చేందుకు ప్రభుత్వం వృద్ధుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్ కలెక్టర్ చొరవతో జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా పరిషత్ క్వార్టర్స్లో ఏ4 రూం కేటాయించారు. మరమ్మతు పనుల కోసం 30లక్షలు విడుదల చేశారు. యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న పనులు మరో మూడు, నాలుగు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మే 7లోగా డేకేర్ సెంటర్ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సకల సౌకర్యాలు..
వృద్ధుల సంరక్షణ కేంద్రంలో సకల సౌకర్యాలు కల్పించారు. జిల్లా సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నేతృత్వంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండోర్ గేమ్స్, యోగా, జిమ్తో పాటు పత్రికలు, పుస్తకాలు చదువుకునేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు, వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా వేర్వేరు గదులు సిద్ధం చేశారు. వైద్య పరీక్షల కోసం సర్కారు దవాఖాన నుంచి ఓ వైద్యుడిని అందుబాటులో ఉంచుతారు. అటెండర్, రాత్రి పూట గస్తీ కోసం వాచ్మెన్ను కూడా నియమించనున్నారు.
ఈ కేంద్రాన్ని ఇప్పటికే మూడుసార్లు కలెక్టర్ దంపతులు సందర్శించి పనులను పరిశీలించారు. అరవై ఏండ్లు దాటిన వారికి ఉచిత ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు. పొద్దంతా వీరు ఇక్కడ పరస్పరం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. సెంటర్ ప్రారంభించిన అనంతరం నిర్వహణ బాధ్యతలు జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖకు అప్పగించే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మొదటి సారిగా వయోవృద్ధుల కోసం డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయడంపై, అటు వృద్ధులు, ఇటు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు చొరవ చూపిన కలెక్టర్కు ప్రత్యేక ంగా కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఏర్పాటు హర్షణీయం
ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో అనేక మంది వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. ఇండ్ల ల్లో ఆలనాపాలన లేక బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. కలెక్టర్ కర్ణన్ చొరవ చూపి డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం హర్షణీయం. ఇందులో యోగా, వ్యాయామం కోసం ఏర్పా ట్లు చేయడం అభినందనీయం. కలెక్టర్కు సీనియర్ సిటిజన్స్ ఫోరం నుంచి కృతజ్ఞతలు.
– సముద్రాల జనార్దన్రావు, సీనియర్ సిటిజన్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు