ఇక తొమ్మిదో విడుత రైతుబంధు
కేంద్రం అడ్డంకులు సృష్టించినా తగ్గని రాష్ట్ర ప్రభుత్వం
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
ఎకరానికి 5వేల చొప్పున సాయం
ఉమ్మడి జిల్లాలో మొత్తం 6,95,681 మందికి లబ్ధి
కొత్తగా 31,290 మందికి ప్రయోజనం
664.58 కోట్ల కేటాయింపు
కేంద్రం ఆర్థిక పరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం లేదు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నా.. పథకాల అమలును ఆపడం లేదు. ఎప్పట్లాగే ఈ సారి వానకాలం సీజన్ సాగుకు రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని నేటి నుంచి అందించబోతున్నది. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,95,681 మంది రైతులకు 664.58 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. ఈ సారి కొత్తగా 31,290 మందికి లబ్ధి చేకూరనుండగా, మంగళవారం నుంచి అన్నదాతల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. ఎకరాకు 5 వేల చొప్పున అందిస్తుండడంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనేందుకు సంసిద్ధులవుతున్నారు.
కరీంనగర్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రైతన్నకు పెట్టుబడి కష్టాలను దూరం చేసే లక్ష్యంతో రైతుబాంధవుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ మళ్లీ వచ్చేసింది. నా లుగేళ్లుగా ఎనిమిదిసార్లు సాయమందించిన రాష్ట్ర సర్కారు, తొమ్మిదోసారి ఇస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు, ఈ సీజన్ నుంచి ఎకరాకు 5 వేల చొప్పున అందిస్తున్నది. కాగా, ఈసారి ఉమ్మడి జిల్లాలో 6,95, 681 మంది రైతులకు రూ.664.58 కోట్ల మొత్తాన్ని కేటాయించింది.
ముందుగా ఎకరం నుంచి..
ఎకరం వరకు ఉన్న రైతులకు మొదట రైతు బంధు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగానే జిల్లాలో మంగళవారం నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖ డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసిన రైతులందరికీ రైతు బంధు కింద పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 1,93,330 మంది రైతులు రైతు బంధుకు అర్హులుగా గుర్తించగా, ఎకరాకు రూ.5 వేల చొప్పున జిల్లాకు రూ.181కోట్ల 89 లక్షల 01 వెయ్యి 394 నగ దు కేటాయించారు. ఇందులో 32,218 మంది ఎస్సీ రైతులకు రూ.18 కోట్ల 98 లక్షల 46 వేల 508, 934 మంది ఎస్టీ రైతులకు రూ.65, 51,220 కేటాయించారు. అర్హులైన రైతుల్లో ఇప్పటికే 1,75,738 మంది రైతుల వివరాలను అప్డేట్ చేసి ట్రెజరీకి పంపించారు. మితా రైతుల వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంది. గ్రామాల్లో ఏఈవోలు ఇదే పనిలో ఉన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
రైతుబంధు ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలు కొనుగోలుచేసి భిన్నమైన పంటలు సాగు చేయా లి. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తేనే లాభాలు ఆర్జిస్తారు. ఎరువులు అధిక మోతాదులో కాకుండా అవసరమైన మేరకే వాడుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమవుతుంది. ముందుగా చిన్న కారు రైతులకు, ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్న రైతులకు నగదు జమవుతుంది. – వాసిరెడ్డి శ్రీధర్, డీఏవో (కరీంనగర్)