నిజానికి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రజాప్రతినిధులెవరైనా తన సొంత నియోజకవర్గానికి లేదా సొంత జిల్లాకు వచ్చిన నిధులు, బడ్జెట్ కేటాయింపులపై మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేస్తారు. లేదా ప్రెస్మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తారు. కానీ, ప్రస్తుతం కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టి రెండు రోజులవుతున్నా.. మన ఉమ్మడి జిల్లా కేటాయింపులపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. ఏ ఒక్క రంగానికీ నేరుగా నిధులు ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు.
నిత్యం బడాయిలు చెప్పే బండి సంజయ్, బడ్జెట్లో తన సొంత జిల్లాకు ఇచ్చిందేమిటో చెప్పడం లేదు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ ఈటల రాజేందర్ ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క అంశం కూడా కనిపించలేదు. ఉమ్మడి జిల్లా నుంచి బడా నేతలుగా చెప్పుకుంటున్న ఆ ఇద్దరి మాటలను కేంద్రం బేఖాతరు చేసిందని చెప్పడానికి ఈ బడ్జెటే ఒక నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న బండి, రాష్ర్టానికి కాకపోయినా తన సొంత నియోజకవర్గానికైనా నిధులు, ప్రాజెక్టులు సాధిస్తారని ఆశించిన వారికి ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఇటు రాజేందర్ తన నియోజకవర్గానికి ఏం తెచ్చారో ఒక్క ముక్కయినా చెప్పకుండా బడ్జెట్పై గొప్పలు పోతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడం విస్మయానికి గురిచేస్తున్నది. ప్రజల ఆశలు మరోసారి వమ్ము కాగా, సదరు నేతల సత్తా ఏంటో తెలిసిందనే చర్చ జోరుగా సాగుతున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. మొత్తం పార్టీ తన కనుసన్నల్లోనే నడుస్తుందని గొప్పలు చెప్పుకుంటారు. తనకు మించిన పెద్దనాయకుడు లేడన్న సంకేతాలు ఇవ్వడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తారు. ఇక హుజూరాబాద్ నుంచి ఎన్నికైన రాజేందర్ కూడా అంతే. పార్టీలో చేరికల కమిటీ ప్రధాన నాయకుడిగా చెప్పుకుంటున్న ఆయన, బీజేపీలో తనకు మించిన నాయకుడు లేరంటారు. నిజానికి వారు చెప్పినట్లుగానే పెద్ద నాయకులే అనుకుంటే.. వారి హోదా, సత్తాను ఉపయోగించి సొంత జిల్లాకు లేదా వారి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు ప్రయత్నం చేయాలి. బడ్జెట్లో ఆ కేటాయింపులు కనపడేలా చేయాలి. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపుల ముచ్చటే కనిపించలేదు. ఏ ఒక్క రంగానికీ నిధులు కేటాయించిన విషయంలోనూ స్పష్టత లేదు.
నీరుగారిన ఆశలు
నిజానికి కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లా వాసులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. రైల్వేలైన్లు, జాతీయ రహదారులతోపాటు పవర్లూం క్లస్టర్, ట్రిపుల్ ఐటీ వంటి వాటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనీసం గత ఎంపీ వినోద్కుమార్ సాధించిన జాతీయ రహదారులకైనా బండి పూర్తి స్థాయిలో మోక్షం కల్పిస్తారని అనుకున్నారు. కానీ, అవేవి ఇప్పటివరకు కనిపించలేదు. కరీంనగర్-హుజూరాబాద్-వరంగల్ జాతీయ రహదారికి సంబంధించి భారీ ఎత్తున నిధులు కేటాయించాలని కోరినట్లుగా స్వయంగా సంజయ్ గతంలోనే మీడియాకు చెప్పారు. కానీ, ప్రత్యేకంగా నిధులు కేటాయించిన దాఖలాలు మాత్రం లేవు. ఏమైనా కేటాయించారా..? లేదా..? అన్నదానిపై బీజేపీ నాయకులు స్పష్టత ఇవ్వలేదు. మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు 16వ లోక సభ్యుడిగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్ను జాతీయ రహదారుల జంక్షన్ చేయాలన్న లక్ష్యంతో పనిచేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కరీంనగర్- సిరిసిల్ల- ఎల్లారెడ్డి-పిట్లం 164 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులకు 2016 ఫిబ్రవరి 16న సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపినా.. ఈ బడ్జెట్లో మాత్రం ఎలాంటి ప్రస్తావన లేదు. భూపాల్పల్లి- అంశాన్పల్లి- గొర్లవీడు, నేరెడ్పల్లి- గర్మిళపల్లి-బూరపల్లి- ఎమ్పెడ్-వావిలాల- జమ్మికుంట-వీణవంక-కరీంనగర్ 131 కిలోమీటర్ల జాతీయ రహదారికి సూత్రప్రాయంగా అంగీకరించి 2, 4, 6 లేన్స్గా అప్గ్రేడ్ చేస్తామని 2017 ఆగస్టు 31న కేంద్రం ప్రకటించినా దాని ఊసే లేదు. సిరిసిల్ల-సిద్దిపేట- దుద్దెడ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా నంబర్ 365బీగా ప్రకటిస్తున్నట్టు 2016 ఫిబ్రవరి 16న సమాచారం ఇచ్చి, డీపీఆర్ సిద్ధం చేయనున్నట్లు కేంద్రం తెలిపినా.. ఆ విషయాన్నీ ప్రస్తావించ లేదు. వందేభారత్ రైలు సేవలు ఉమ్మడి జిల్లా వాసులకు త్వరలోనే అందుతాయని బండి సంజయ్ ఇటీవల చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు వందే భారత్కు అనుగుణంగా ఈ రూట్లలో వేగాన్ని పెంచేందుకు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు ఇటీవల ప్రకటించారు. కానీ, బడ్జెట్లో మాత్రం ఆ ప్రస్తావన కనిపించలేదు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ మచ్చటే లేదు. కరీంనగర్-కాజీపేట వయా హుజూరాబాద్ నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు వినోద్కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రాన్ని ఒప్పించిన విషయం తెలిసిందే. ఆ మేరకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసేందుకు రైల్వే బోర్డును ఒప్పించారు. నిజానికి దీనికి గత బడ్జెట్లోనే భారీగా నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించినా అప్పుడు నిరాశే మిగిలింది. ఈ సారైనా వస్తాయని ఆశించారు. అయితే.. శుక్రవారం రైల్వే బడ్జెట్ వివరాలు బయటకు వస్తాయని, అందులో ఉమ్మడి జిల్లా రైల్వే రంగానికి సంబంధించి నిధుల కేటాయింపు ఉంటుందని పలువురు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఆ వివరాలు బయటకు వస్తేనే స్పష్టత రానుండగా, బీజేపీ నేతల మౌనం చూస్తే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మెడికల్ కాలేజీ, ట్రిపుల్ ఐటీ, మెగా పవర్లూం క్లస్టర్ వంటి అంశాల ఊసే లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మచ్చుకు కనిపించని మేనిఫెస్టో
2021 అక్టోబర్ 30న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు తనను గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి, వివిధ రంగాల్లో నిధులు తెచ్చి హుజూరాబాద్ను అభివృద్ధి చేస్తామని రాజేందర్ చెప్పారు. కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు నాయకులతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం, ప్రత్యేకంగా జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి, వడ్డీలేని రుణాలు, సబ్సిడీ రుణాలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రత్యేక కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలతో అర్హులైన రైతులందరినీ ఆదుకునేందుకు చర్యలు, 60 ఏండ్లు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా నెలకు 3000 పింఛన్ ఇలా ఎన్నో అందులో ప్రకటించారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోసం ఆయా మండలాల్లో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అమలు, విద్యారంగ అభివృద్ధి, దేశవిదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులకు విద్యాలక్ష్మి పథకం, మహిళల అభ్యున్నతి కోసం ‘పీఎం ఉద్యోగిని యోజన అమలు, నియోజకవర్గంలో పట్టణాలు, గ్రామాలన్నింటికీ రక్షిత మంచినీరు, దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ, నియోజకవర్గంలో ‘శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్’ అమలు, కేంద్రం సహకారంతో హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల అభివృద్ధికి కార్యాచరణ, పట్టణాల సుందరీకరణ ఇలా మరెన్నో చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పక్కా రోడ్లు లేని గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం, క్రిషి సించాయి యోజన కింద కాల్వల మరమ్మతు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు కృషి చేస్తామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవన్నీ అమలు చేస్తామని చెప్పారు. ఆ మాటలను ప్రజలు నమ్మి రాజేందర్ను గెలిపించారు. బీజేపీలో తాను క్రియాశీలక నాయకుడినని చెప్పుకోవడంతో కేంద్రాన్ని ఒప్పించి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెస్తారు కావచ్చని అందరూ ఆశించారు. కానీ, ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. తాను ఇచ్చిన మేనిఫెస్టోపై క్లారిటీ ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హుజూరాబాద్ ప్రజలను మోసం చేసిండు
బీజేపీ దేశ ప్రజలను దగా చేస్తే.. ఈటల రాజేందర్ పద్నాలుగు నెలలుగా హుజూరాబాద్ ప్రజలను మోసం చేస్తున్నడు. ఉపఎన్నికలప్పుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యేలు, ఎవ్వలెవ్వలో వచ్చిన్రు. ఇష్టంవచ్చినట్లు వాగ్దానాలు చేసిన్రు. నిధులిస్తమన్నరు. అభివృద్ధికి బాటలు వేస్తమన్నరు. మెడికల్ కాలేజీ, టూరిజం డెవలప్మెంట్, స్మాల్స్కేల్ ఇండస్ట్రీలు, ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లు, కారిడార్లన్నరు. ఏ‘మాయె’. ఒక్కరూ కనవడ్తలేరు. గెలిచిన ఎమ్మెల్యే తిరుగుతలేడు. ఈటల బీజేపీల నేను పెద్ద లీడరన్నడు. ఏదో పోస్టు.. చేరికలు కావచ్చు.. అని చెప్పుక తిరుగుతున్నడు. మరేమైంది. మీ బడ్జెట్ల తెలంగాణకు ఏమిచ్చినట్టు. చెప్పింది ఒక్కటీ చెయ్యకపోతిరి. ఉన్న ఉపాధి హామీకి కోతలు పెట్టవడ్తిరి. పార్లమెంటులో చట్టానికే తూట్లు పొడవ వడ్తిరి. సామాన్యుడు బతక్కుండా చేయవడ్తిరి. ఇక్కడ ఈటలెట్ల తిరుగుతడు.. ప్రజలకేం చెబుతడో చూడాలె.
– తుమ్మేటి సమ్మిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ (జమ్మికుంట)
బడ్జెట్లో బండి సాధించింది శూన్యం
కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ సాధించింది శూన్యం. ఎన్నికల సమయంలో ఏదో సాధిస్తాం.. రైల్వే ప్రాజెక్టులు తెస్తాం.. రోడ్లను అభివృద్ధి చేస్తాం.. అని చెప్పడం తప్ప ఇప్పటివరకు సాధించిందేమీ లేదు. ఎంతసేపూ ఆకట్టుకునేలా ప్రచారాలు చేయడం తప్ప నియోజకవర్గ, రాష్ట్ర అభివృద్ధి కోసం పకా ప్రణాళికతో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ఆలోచన చేయడం లేదు. ఇలాంటి నాయకుల వల్ల రాష్ట్రానికి ఏం లాభం ఉండదు. దేశవ్యాప్తంగా అనేక మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు, త్రిబుల్ ఐటీలు నెలకొల్పుతున్నా కరీంనగర్కు మాత్రం ఒకటీ తీసుకురావడం లేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు లేవు. ఇలాంటి సమయంలో గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఎంపీగా ఉంటే ఎన్నో అభివృద్ధి పనులు వచ్చే అవకాశం ఉండేది. కానీ, మాటలకే పరిమితమయ్యే బండి సంజయ్ వల్ల నియోజకవర్గం ఎంతో నష్టపోతున్నది.
– వల్లంపట్ల శ్రీనివాస్, పోస్ట్గ్రాడ్యుయేట్(కార్పొరేషన్)
తెలంగాణచౌక్, ఫిబ్రవరి 2 : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విద్యా రంగానికి నిధులు కేటాయించడంలో వివక్ష చూపించడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్ ఆధ్వర్యంలో నాయకులు గురువారం కమాన్చౌరస్తా వద్ద కేంద్ర ప్రభ్తుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కొఠారి నివేదిక ప్రకారం విద్యకు పది శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉపయోగించే వస్తువుల మీద జీఎస్టీని రద్దు చేస్తారని ఆశించామని, కనీసం ప్రకటన కూడా చేయకపోవడం శోచనీయమని మండిపడ్డారు. విద్యారంగాన్ని కార్పొరేట్ సంస్థలను అప్పగించాలనే కుట్రలు జరుతున్నాయని విమర్శించారు. రాష్ర్టానికి ట్రిపుల్ఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, సైనిక్ స్కూల్ మంజూరు చేయించడంలో ఎంపీ బండి సంజయ్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ర్టానికి నిధులు కేటాయించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హేమంత్, శ్రీనివాస్, రాజేశ్, సాయి,సందీప్ పాల్గొన్నారు.