హుజూరాబాద్ టౌన్, మార్చి 28: ఆస్తి పన్ను వసూళ్లలో హుజూరాబాద్ బల్దియా లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ బుధవారం వరకు 92.12శాతం పన్నుల వసూళ్లతో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ గురువారం ప్రకటించింది. అధికారులు ఇంటి, నల్లా, తై బజార్ పన్నుల వసూలు కోసం పట్టణంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే పాత బకాయిలు చెల్లించడంలో మొండిగా వ్యవహరిస్తున్న గృహ యజమానులకు రెడ్ నోటీసులు అందిస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు పట్టణంలో ఇంటింటా తిరుగుతూ పన్ను వసూళ్లను వేగవంతం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆస్తి, నల్లా, తైబజార్ పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ముందంజలో ఉన్న హుజూరాబాద్ మున్సిపాలిటీని మిగిలిన మూడు రోజుల్లో లక్ష్యం సాధించి రాష్ట్రంలోనే టాప్ 1 స్థానంలో నిలుపుతామన్న ధీమాతో ఉన్నారు.
హుజూరాబాద్ పట్టణ జనాభా సుమారు 34 వేల 555 (2011 జనాభా లెకల ప్రకారం). పట్టణంలో 8769 వాణిజ్య సముదాయాలు, నివాస గృహాలు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2 కోట్ల 49 లక్షల పన్నులు వసూలు చేయాలని పురపాలక అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 27 నాటికి రూ.2 కోట్ల 29 లక్షల పన్నులు వసూలు కాగా (92.12 శాతం), జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఓ నగరపాలక సంస్థల్లో హుజూరాబాద్ ప్రథమ స్థానంతో ముందంజలో నిలిచింది. మరో రూ.20లక్షలు వసూలు చేయాల్సి ఉంది. అలాగే నల్లాల (వాటర్ ట్యాక్స్) పన్నులు రూ.2కోట్ల 41లక్షల36వేలకు రూ.60.90లక్షలు (25.23 శాతం) వసూలు కాగా, తైబజార్ పన్నుల వసూళ్లలో రూ.14.52లక్షలకు గానూ రూ.14.52 లక్షలు(వంద శాతం) వసూలు చేశారు. దుకాణాల అద్దె రూ.49లక్షల 53వేలకు గానూ రూ. 9లక్షల 87వేలు (19.93 శాతం) వసూలయ్యాయి.
పన్నులు సకాలంలో చెల్లించడం ద్వారా పట్టణం, విలీన గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించి వసూలు చేస్తు న్నాం. మొండి బకాయిల వసూళ్ల కోసం 20 మందికిపైగా ఇంటి యజమానులకు రెడ్ నోటీస్ అందించాం. గడువులోగా వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు కృషి చేస్తున్నాం.
– సల్వది సమ్మయ్య, కమిషనర్, హుజూరాబాద్ మున్సిపాలిటీ