ఎల్లారెడ్డిపేట, జూలై 2 ;నాడు పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన బొప్పాపూర్ నేడు వెలిగిపోతున్నది. సమైక్య పాలనలో అరకొర వసతులతో ఇబ్బంది పడ్డ గ్రామం స్వరాష్ట్రంలో అభివృద్ధి పుంతలు తొక్కుతున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ, దాతల సహకారంతో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకొని తన ముఖ చిత్రాన్నే మార్చుకున్నది. సకల సౌకర్యాలు కల్పించుకొని, సంక్షేమ ఫలాలను పొందుతూ సగర్వంగా నిలుస్తున్నది. –
శరవేగంగా అభివృద్ధి
గ్రామంలో 90 శాతం అంతర్గతరోడ్లను నాణ్యతతో నిర్మించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.1.3 కోట్లతో బీటీ రోడ్లు, మౌలిక వసతులు, పంచాయతీ రాజ్శాఖ ఆధ్వర్యంలో రహదారులు, బ్రిడ్జిలు, కాజ్వేలు, మురుగు కాల్వలు నిర్మాణం జరిగితే అందులో అంతర్గత సీసీ రోడ్లు రూ.2.5 కోట్లతో పూర్తి చేశారు. రూ.1.48కోట్లతో 28 మురుగు కాల్వల నిర్మాణం, రూ.35 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ. 20 లక్షలతో కేసీఆర్ ప్రగతి ప్రాంగణం నిర్మించారు. రూ. 14 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం, రూ. 45 లక్షలతో ప్రభుత్వ ఉన్నతపాఠశాల ప్రహరీ, ప్రాథమిక పాఠశాలలో రూ.1.54 లక్షలతో వంట గది, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.4.10 లక్షలు, అంగన్వాడీ సెంటర్ మిగులు పనులకు రూ.3.68 లక్షలు మంజూరు చేసి అభివృద్ధి చేశారు. రూ. 30లక్షలతో మార్కెట్ కమిటీ కార్యాలయ భవనాన్ని పూర్తి చేశారు. గొల్లపల్లి బస్టాండ్ నుంచి కొరుట్లపేట, నర్మాల వరకు రూ. 20కోట్లతో డబుల్రోడ్డు నిర్మించారు. సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రూపాయి ఖర్చు లేకుండా రూ.2.42 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను 48 మంది పేదలకు పంపిణీ చేశారు. ధాన్యాన్ని దాచుకునేందుకు రూ. 2.5కోట్లతో 5వేల మెట్రిక్టన్నుల సామర్థ్యం గల ఆధునిక గోడౌన్లను నిర్మించారు. దీంతో పాటు రూ. 45లక్షలతో 5మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఐకేపీ గోడౌన్ల నిర్మాణం పూర్తి చేశారు. రూ.40లక్షలతో ఐకేపీ గోదాంను సైతం నిర్మించారు. బొప్పాపూర్కు చెందిన దాత చిదుగు గోవర్ధన్గౌడ్ రూ.22లక్షలతో రాష్ట్రంలో మొదటి ఏసీ రైతువేదికను నిర్మించారు. గ్రామంలో పది మంది రైతులు పలు కారణాలతో మృతి చెందితే వారికి రైతుబీమా రూ.50లక్షలు అందాయి. రూ.12.60లక్షలతో శ్మశాన వాటికను నిర్మించారు. ఇందులో రెండు బర్నింగ్పాయింట్లు, చివరిచూపువేదిక, రెండు స్నానపు గదులు, వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. చెత్త సేకరణకు ఇంటింటికీ బుట్టలు పంపిణీ చేశారు. డంపింగ్యార్డును రూ.2.50లక్షలతో నిర్మించారు . చెత్త సేకరణకు, మొక్కలకు నీళ్లు పట్టేందుకు ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్ను రూ.8.75లక్షలతో కొనుగోలు చేశారు. గ్రామంలో రూ.70వేలతో నర్సరీ , రూ.3.50లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.2.50 లక్షలతో తెలంగాణ క్రీడాప్రాంగణం ఏర్పాటు చేశారు. మేజర్ పంచాయతీ కావడంతో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా 2.50 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల మూడు ట్యాంకులు నిర్మించి 1200 కనెక్షన్లకు నీరందిస్తున్నారు.
కుల సంఘ భవనాలకు నిధులు
గ్రామంలోని పలు కుల సంఘ భవనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రెడ్డి సంఘ భవనానికి రూ.4లక్షలు, ముదిరాజ్ సంఘ భవనానికి రూ.5 లక్షలు, యాదవ సంఘం భవనానికి రూ.4.60 లక్షలు, ఎస్సీ మాల సంఘం భవనానికి రూ.4 లక్షలు, పద్మశాలీ భవనానికి రూ.3 లక్షలు, ప్రగతి యూత్ భవనానికి రూ.4 లక్షలు, ఎస్సీ మాదిగ సంఘ భవనానికి రూ.3 లక్షలు, విశ్వబ్రాహ్మణ సంఘానికి రూ.9.60 లక్షలు, మహిళా సంఘ భవనానికి రూ.8 లక్షలు, ఫిషరీస్ సొసైటీ భవనానికి రూ.10 లక్షలు మంజూరు చేసి నిర్మించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో రూ.9లక్షలతో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు.
పింఛన్లు, రుణాలు
గ్రామంలో 1112 మందికి వివిధ రకాల పింఛన్లు నెలకు రూ.23.25లక్షలు పంపిణీ చేస్తున్నారు. మహిళల స్వయం సమృద్ధి కోసం 387 సంఘాలు బ్యాంకు లింకేజీ ద్వారా 1.84కోట్లు, 487 సంఘాలు వడ్డీలేని రుణాలు 49.55లక్షలు, స్త్రీ నిధి ద్వారా 58మంది మహిళలున్న 17 స్త్రీనిధి సంఘాలు రూ.27.80లక్షల లబ్ధి పొందాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏడుగురికి రూ.14 లక్షలు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఐదుగురికి రూ.5 లక్షలు మంజూరు చేసింది. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6.18కోట్లు మంజూరు చేసింది. ఆసరా, రైతు బంధు, బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి, రేషన్ వంటి పథకాలకు గ్రామానికి ఏటా రూ.2.25కోట్లు కేటాయిస్తున్నది.
గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి
రాష్ట్రం ఏర్పడక ముందు అభివృద్ధి నిధుల కోసం ఏండ్లకొద్దీ వేచి చూసిన రోజులున్నయ్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, గతంలో ఎప్పుడూ చూడని అభివృద్ధి తొమ్మిదేండ్లలో చూసినం. దీనికి తోడు గ్రామాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ సహకరిస్తున్న తీరు సంతోషంగా ఉంది.
– కొండాపురం బాల్రెడ్డి, సర్పంచ్ (బొప్పాపూర్)