శ్రీరాంపూర్, జనవరి 11 : సింగరేణి యాజమాన్యంతో ఒప్పందం ప్రకారం రోజుకు 600 టన్నుల ఎక్స్పోజివ్ సామగ్రిని సకాలంలో సరఫరా అయ్యేలా చూసుకోవాలని అన్ని ఏరియాల జీఎంలు, సరఫరాదారులను డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జీఎంలతో ఎక్స్ప్లోజివ్ సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్స్ప్లోజివ్ కంపెనీ రవాణా చేస్తామని ఇచ్చిన హామీ లక్ష్యాన్ని పూర్తిచేస్తున్నదా లేదా అని అడిగి జీఎంలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తగినంత ఎక్స్ప్లోజివ్ సరఫరా చేయాలని రవాణాదారులను సూచించారు. రానున్న 3 నెలల ఉత్పత్తి కీలకమన్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్దేశిత పరిమాణంలో ఎక్స్ప్లోజివ్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సింగరేణి భవన్ నుంచి అడ్వైజర్ (మైనింగ్) డీఎన్ ప్రసాద్, జీఎం కోఆర్డినేషన్ కే సూర్యనార్యాణ, జీఎం (స్టాటజీ, ప్లానింగ్) జీ సురేందర్, జీఎం ఎల్వీ సూర్యనారాయణ, ఎస్వోటూ జీఎం కే హరినారాయణగుప్తా, పీవోలు పురుషోత్తంరెడ్డి, రాజేశ్వర్రెడ్డి, ఏజీఎం సుధాకర్, రాజేశ్వర్రెడ్డి, డీవైజీఎం సోమశేఖర్, ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.