హుజూరాబాద్, నవంబర్ 26: ఆరుగాలం కష్టపడి పండించి విక్రయించిన ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల దగ్గరి నుంచి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అటు కొనుగోళ్ల పక్రియ జరుగుతుండగానే మొదట విక్రయించిన రైతులకు ఖాతాలో డబ్బులు జమవుతున్నాయి. సహకార సంఘాలు, ఐకేపీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రభుత్వం ధాన్యాన్ని సేకరిస్తున్నది. ఇప్పటి వరకు 84,967 క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వం సేకరించింది.
పకడ్బందీగా చర్యలు
వరి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్నది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రతి గ్రామానికి ఓ కేంద్రం ఉండే విధంగా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకొన్నారు. వాన కాలంలో వరి ధాన్యం కొనుగోళ్లు చేసిన విధంగానే ఈ యాసంగిలో కూడా కొనుగోళ్ల పక్రియ సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో1,06,870 క్వింటాళ్లు
హుజూరాబాద్, జూపాక, తుమ్మనపల్లి పీఏసీఎస్ల ఆధ్వర్యంలో మొత్తం 13 కేంద్రాలు ఏర్పాటు చేయగా… ఇప్పటి వరకు 1,06,870 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. హుజూరాబాద్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్, రంగాపూర్, రాంపూర్, సిర్సపల్లి, పెద్దపాపయ్యపల్లి, వెంకట్రావుపల్లి లో 775 మంది రైతుల నుంచి 57, 200 క్వింటాళ్లు, జూపాక పీఏసీఎస్ ఆద్వర్యంలో బొత్తలపల్లి, కనుకులగిద్ద, శాలపల్లి గ్రామాల్లో 445 మంది రైతుల నుంచి 33,250 క్వింటాళ్ల ధాన్యం, తుమ్మనపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో తుమ్మనపల్లి, సింగాపూర్, బోర్నపల్లి, మాందాడిపల్లిలో 224 మంది రైతుల నుంచి 16,420 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో సగానికన్నా ఎక్కువ మంది రైతుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి
డీసీఎంఎస్ ఆధ్వర్యంలో
డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఇప్పలనర్సింగాపూర్, ధర్మరాజుపల్లి, దమ్మక్కపేట, కందుగుల, చిన్నపాపయ్యపల్లి, కాట్రపల్లి హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 721 మంది రైతుల నుంచి 55,460 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఇందులో 60 శాతం పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ఐకేపీ ఆధ్వర్యంలో చెల్పూర్, పోతిరెడ్డిపేట కొనుగోలు కేంద్రాల్లో 52 మంది రైతుల నుంచి 3,700 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు.
రైతుల ఖాతాలో రూ.18కోట్ల 54లక్షలు
ఇప్పటి వరకు 2,217 మంది రైతుల నుంచి 16 లక్షల 6వేల 20 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. 1282 మంది రైతులకుగాను 91వేల క్వింటాళ్లకు రూ.18కోట్ల74లక్షల60వేలు ఖాతాల్లో జమ చేశారు. విక్రయించిన వారంలోపే డబ్బులు జమకావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తి
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. విక్రయించిన ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో వారం రోజుల్లోపే జమవుతున్నాయి. ధాన్యాన్ని ఆరబెట్టి, తాలు లేకుండా తీసుకురావాలి. కొనుగోళ్లు వేగవంతంగా జరిగేందుకు, గన్నీ సంచుల కొరత లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు.
-వివేక్, హుజూరాబాద్ సహకార సంఘం సీఈవో