Collector Koya Sri Harsha | పెద్దపల్లి రూరల్ , జనవరి 31 : రాబోయే ఫిబ్రవరి నెలలో 50 ఎకరాల ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలం రంగాపూర్, సబ్బితం అనుబంధ గ్రామం గట్టు సింగారంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా గట్టుసింగారంలో రవీందర్ రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న ఫామ్ ఆయిల్ పంటను ట్రాక్టర్ పై ప్రయాణించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఫామ్ ఆయిల్ పంటను ప్రోత్సహించేందుకు ఇక్కడ గుట్ట పై విద్యుత్ సరఫరా నిమిత్తం రూ.9 లక్షలు కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి కేటాయించి పనులు పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరిలో 50 ఎకరాలలో ఫాం ఆయిల్ మొక్కల నాటే పనులు పూర్తి చేయిలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన వనశాఖ అధికారి జగన్ మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.