పెద్దపల్లి, మార్చి 30(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి: ‘కాంగ్రెస్ వంద రోజుల పాలనతో మళ్లీ పదేండ్ల కిందటి దుస్థితి వచ్చింది. నమ్మి ఓటు వేస్తే.. అధ్వానమైన పాలనతో అన్ని వర్గాల ప్రజలను అరిగోస పెడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎవుసానికి ఎలాంటి కష్టాలుండేవో రేవంత్ సర్కార్ వచ్చినంక మళ్లీ మొదలైనయ్. సాగు బాటలో ఉండాల్సిన రైతులు నీటి కోసం, కరెంటు కోసం రోడ్లకపైకి వచ్చి ఆందోళన చేస్తున్నరు. కాలువల్లో నీళ్లు రాక రైతులు కన్నీరు కారుస్తున్నా ఈ సర్కారు ఏ మాత్రం చలించడం లేదు. మొద్దు నిద్ర పోతున్నది’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
సాగునీరందక పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.25 వేల పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, వారిని ఆదుకునేదాకా ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలని, మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కార్ను తట్టి లేపి రైతులకు న్యాయం జరిగేలా చూడాలనే లక్ష్యంతో రైతు నిరసన దీక్ష చేపట్టామని చెప్పారు. ఈ మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ‘36 గంటల రైతు నిరసన దీక్ష’ను చేపట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ దీక్షలో కొప్పుల ఈశ్వర్ పాల్గొని, మాట్లాడారు.
కేసీఆర్ సర్కారు పదేళ్లుగా రైతులు, ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నదని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చిన వంద రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన దరిద్రం మళ్లీ వచ్చిందని మండిపడ్డారు. రైతులకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు ఇప్పటి వరకు 20 లక్షల ఎకరాల పంట పొలాలు సాగునీరందక ఎండిపోయాయని ఆందోళన చెందారు. ఎండిన పంటను తగులబెట్టడం, పశువులను మేపుతూ రైతులు బోరున విలపిస్తున్నా రేవంత్ సర్కార్ కరగడం లేదని, కనీసం ఎండిపోతున్న పంటల సర్వే సైతం చేపట్టడం లేదని విమర్శించారు.
ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం పూర్తికాలం నిలువదని, కాంగ్రెస్ సర్కారుకు రైతుల గోస తప్పకుండా తగులుతుందన్నారు. పాలన చేతగాక ఇతర పార్టీల మీద విమర్శలు చేస్తున్నారని, ఎమ్మెల్యేలు, నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారి మండిపడ్డారు. ఝూటా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా అనేక సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి బీడు భూములకు సాగు నీరందించారని గుర్తు చేశారు.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్సింగ్, ఎంపీపీలు బండారి స్రవంతి శ్రీనివాస్, నూనేటి సంపత్, బాలాజీరావు, జడ్పీటీసీలు బొద్దుల లక్ష్మణ్, గంట రాములు, తగరం సుమలత శంకర్లాల్, ప్రజా ప్రతినిధులు, నాయకులు పెంట రాజేశ్, ఉప్పు రాజ్కుమార్, అత్తె చంద్రమౌళి, మాదాడి శ్రీనివాస్రెడ్డి, కర్రు నాగయ్య, గోనె శ్రీనివాస్రావు, కొయ్యడ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులను ఆగం చేస్తున్నడు. మాయ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిండు. ఆరు గ్యారెంటీలని చెప్పి వాటిలో రెండు గ్యారెంటీలను కూడా అమలు చేయలేదు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి గౌరవంగా బస్సుల్లో ప్రయాణించే మహిళలను అవమానాల పాలు చేస్తున్నడు. మాయ మాటలు చెప్పే రేవంత్రెడ్డి ఖబడ్దార్. రైతులను ఆదుకోవాలె. లేకుంటే నీ కుర్చీ ఉండది.. నువ్వు ఉండవ్.. జాగ్రత్త!
– మోకినపల్లి రాజవ్వ, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు
కాంగ్రెస్ పాలనలో వంద రోజుల్లోనే 16 వేల కోట్ల అప్పు చేసిన్రు. అయినా ప్రజల బతుకులకు భరోసా లేదు. పంటలు ఎండిపోతున్నయి. నీళ్లు కావాలని అడిగితే దాడులకు దిగుతున్నరు. ఇకపై దాడులు చేస్తే సహించేది లేదు. ప్రజలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ హాని జరిగినా ఊరుకునేది లేదు. కంటికి రెప్పలా కాపాడుకుంటం.
– దాసరి ఉష, బీఆర్ఎస్ నాయకురాలు
కేసీఆర్ సర్కారు రైతులను అన్ని విధాలా ఆదుకున్నది. కానీ, కాంగ్రెస్ సర్కారు మాత్రం గోస పెడుతున్నది. ఎన్నికల ముందు అలవికాని హామీలతో నమ్మించింది. రైతుబంధు కూడా సంపూర్ణంగా ఇచ్చే పరిస్థితి లేదు. రైతు ప్రోత్సాహకంగా ఇస్తామన్న రూ.500 జాడ లేదు. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. పోయిన పదేళ్లలో ఏనాడూ సాగునీటికి ఇబ్బంది పడదేదు గానీ, ఇప్పుడు నీళ్లు లేక ఒక్క పెద్దప ల్లి నియోకవర్గంలోనే 50 వేల ఎకరాల్లో పంటలు ఎండి పోయినయి. రైతులు నష్టపోయిన్రు. ప్రజలు అన్ని గమ నిస్తున్నరు. రాబోయే రోజుల్లో గుణపాఠం చెబుతరు.
– దాసరి మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
‘రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది. మార్పు తెస్తుంది’ అని చెప్రిను. మార్పంటే అందరు ఏదో అనుకున్నరు. మార్పంటే పంటలను ఎండబెట్టుడేనా..? ఇదేనా కాంగ్రెస్ పాలన? రైతులకు సంపూర్ణంగా సాగునీరందించాలి. వంద రోజుల్లో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తమన్నరు. 200 మంది రైతుల ఉసురు తీసిన్రు. ఇంకా నాలుగేళ్ల వారి దుష్ట పాలనలో మరింత నష్టం జరిగే ప్రమాదమున్నది. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి.
– చిరుమల్ల రాఖేశ్, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్
గతేడాది మాదిరిగానే ఈ సారి యాసంగికి నీళ్లు వస్తాయని రైతులు వరి వేసిన్రు. కానీ, నిరాశే మిగిలింది. సాగునీరు అందక పంటలు ఎండుతున్నయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చలనం లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం దిగొచ్చి ఆదుకునేదాకా పోరాడుతం.
– పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎక్కడా ఒక్క ఎకరం కూడా ఎండనివ్వలేదు. కానీ, కాంగ్రెస్ పాలనలో కరువు పరిస్థితులు వచ్చినయి. సాగునీరందక రైతులు రోడ్డెక్కుతున్నరు. అయినా ఎండిన పంట పొలాలను ఎవరూ పరిశీలించడం లేదు. రైతులకు భరోసా ఇవ్వడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పత్తా లేకుండా పోయిన్రు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రా..? రాక్షసుడా..? ఓట్లేసిన ప్రజల పేగులు మెడలో వేసుకుంటావా..? ఇలాంటి కాంగ్రెస్ను ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో పాతరేయాలి. ఒక్కసీటు కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పాలి.
– బాల్క సుమన్, మాజీ విప్
కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన అందించింది. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రైతులు అరిగోస పడుతున్నరు. ఆ పార్టీ వంద రోజుల పాలనలో 200 మంది ఆత్మహత్య చేసుకున్నరు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు రైతులే గుణపాఠం చెబుతరు. యావత్ తెలంగాణ రైతాంగాన్ని కదిలించేలా 36 గంటల రైతు నిరసన దీక్ష చేస్తున్నం. ఇది ఆరంభం మాత్రమే. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం. ఇంకా మున్ముందు పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడుతం. అన్నదాతకు అండగా నిలుస్తం.
– కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు