పెద్దపల్లి, మార్చి 31(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి: “అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు.. సాగునీరివ్వకుండా.. రైతుబంధు జమచేయకుండా.. ఆరుగాలం కష్టపడ్డ రైతు నోట్లో మట్టిగొడుతున్నది..” అని వ్యవసాయశాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్నదాతను దగా చేస్తున్న రేవంత్ సర్కారును తరిమికొడతామని హెచ్చరించారు. కేసీఆర్ సర్కారు రైతు బంధు కోసం సిద్ధంగా ఉంచిన రూ.7,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేయకుండా గుత్తేదారుల గుమ్ములు నింపుతున్నదని ధ్వజమెత్తారు. పెద్దపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ప్రారంభమైన 36 గంటల రైతు నిరసన దీక్ష ఆదివారం సాయంత్రం ముగిసింది.
దీక్షలో కూర్చున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి, దాసరి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్కు నిరంజన్రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను బద్నాం చేసేందుకే కాంగ్రెస్ సర్కారు ప్రమాణస్వీకారం చేయకముందే కాళేశ్వరం ప్రాజెక్టును ఖాళీ చేసిందని విమర్శించారు. మేడిగడ్డలోని 80 పిల్లర్లలో రెండు కుంగితే మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దీంతో వేసిన పంటలు ఎండిపోతు న్నాయని చెప్పారు. రేవంత్ సర్కార్ రైతులకు నష్టం చేస్తే ఊరుకునేది లేదని, ఆదుకునే దాకా వారిని నిద్రపోనివ్వం.. మేం నిద్రపోమని హెచ్చరించారు.
కేసీఆర్ తన పాలనలో ఎవుసాన్ని పండుగ చేసి తెలంగాణను దేశానికే అగ్రగామిగా నిలిపారని గుర్తుచేశారు. విపత్తులతో నష్టపోయిన పంటలపై సర్వే చేయించి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కుతుందన్నారు. వంద రోజుల్లోనే రాష్ర్టానికి శని పట్టిందని, హోల్సేల్గా ప్రజలను దగా చేయడమే కాంగ్రెస్ సర్కార్ పనిగా పెట్టుకున్నదని దుయ్యబట్టారు. పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే సీఎం, మంత్రులు ఢిల్లీకి చక్కర్లు కొట్టడం హాస్యాస్పదమన్నారు.
ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల్లేక మందికి పుట్టిన బిడ్డలను మావాళ్లని ముద్దాడిన చందంగా సిగ్గులేకుండా బీఆర్ఎస్కు చెందిన నాయకులను చేర్చు కొని టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి కొప్పుల ఈశ్వర్ను గెలిపించి కాంగ్రెస్కు తగిన బుద్ధిచెప్పాలని కోరారు.ఇక్కడ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్, డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్సింగ్ పాల్గొన్నారు.
తెలంగాణ రాక ముందు కరెంట్ కష్టాలు, ఆకలి చావులు, బీడు భూములు, కరువు ప్రాంతంగా ఉండేది. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశానికే అన్నం పెట్టేలా రాష్ర్టాన్ని తీర్చిదిద్దింది. అన్ని రంగాల్లో చక్కబెట్టి కాంగ్రెస్కు అప్పగిస్తే చెరువులు, కుంటలను ఎండగొడుతున్నది.
వంద రోజుల పాలనలో కరువును తెచ్చిపెట్టింది. పంట చేన్లు బీళ్లుగా మారిపోతున్నాయి. సాగు నీరందక పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నా రేవంత్ సర్కార్ కనికరించడం లేదు. పంటలు చేతికిరావాలంటే నెల పడుతున్నది. కానీ ప్రభుత్వం ఈ నెల 2తో ఆఖరి తడి ఇచ్చి చేతులెత్తేయబోతున్నది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారం చెల్లించాలి. రైతు బంధు విడుదల చేయాలి. రూ.500 బోనస్ చెల్లించాలి. – బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్