అధినేత కేసీఆర్ సమక్షంలో చేరిక
ఆయవెంటే అనుచరగణం
హుజూరాబాద్ నుంచి తరలిన 2వేల మంది..
హుజూరాబాద్ టౌన్, జూలై 30: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలు, నాయకులు రెండు వేల మందితో హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి భారీ అనుచరగణంతో టీఆర్ఎస్లో చేరారు. తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలు, నాయకులు 2వేల మందితో తరలివెళ్లి శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. సింగరేణి కార్మిక సంఘం నాయకుడైన పెద్దిరెడ్డి టీడీపీ అధినేత ఎన్టీ రామారావు సమక్షంలో 1992లో టీడీపీలో చేరి 1995లో ఒకసారి, 1999లో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబాబునాయుడు మంత్రివర్గంలో కార్మిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. రెండు సార్లు హుజూరాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన పెద్దిరెడ్డి హుజూరాబాద్లో పెద్దిరెడ్డి కాంప్లెక్స్, నూతన బస్టాండ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. పలు అభివృద్ధి పనులతో శాశ్వత అభిమానులను సంపాదించుకున్నారు. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరిన ఆయన రాష్ట్ర కోర్కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆ సమయంలో పార్టీలోకి ఈటల రాజేందర్ను చేర్చుకోవడంతో కొన్ని రోజులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు పార్టీ టికెట్ రాదని భావించిన పెద్దిరెడ్డి ఇటీవలే బీజేపీకి, క్రియాశీల పదవికి రాజీనామా చేశారు. అనంతరం తన ముఖ్య అనుచరులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం సుమారు 200 వాహనాల్లో తన మద్దతుదారులతో కలిసి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పికొని పార్టీలో చేరారు. తాను ఎలాంటి పదవి ఆశించి పార్టీలో చేరలేదని, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలనే లక్ష్యంతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు పెద్దిరెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
కాగా పెద్దిరెడ్డితోపాటు టీఆర్ఎస్ చేరిన వారిలో హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలానికి చెందిన మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి జిల్లా కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు విష్ణుదాసు గోపాల్రావు, తెలంగాణ జేఏసీ హుజూరాబాద్ డివిజన్ కన్వీనర్ వంగల హనుమంతుగౌడ్, హుజూరాబాద్ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ పొల్సాని రామారావు, బీజేపీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పోరెడ్డి కిషన్రెడ్డి, ఎల్ఐసీ రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కలకోటి కిషన్రావు, సీనియర్ ఏజెంట్ ఎనగందుల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీలు సబ్బని ఉమాదేవి, వెంకటరాజం, మాజీ సర్పంచులు కంకణాల జనార్దన్రెడ్డి, వెంకటరమణారెడ్డి, మహ్మద్ వలి, రాజమల్లారెడ్డి, జనార్దన్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు దండ విక్రంరెడ్డి, బచ్చు ఆనందం, మొగిలి, నాయీ బ్రాహ్మణ సంఘం మండల గౌరవాధ్యక్షుడు సూరంపల్లి మణయ్య, కమలాపూర్ మండలం ఉప్పల్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వర్గం రవి, నాయకులు కొత్తగట్టు చక్రపాణి, శంకర్, సంపత్, రమేశ్, రాములు, రామకృష్ణ, విజయ్కుమార్ తదితరులు ఉన్నారు.