రాజన్న సిరిసిల్ల, జనవరి 4(నమస్తే తెలంగాణ): విద్యార్థుల యూనిఫాం దుస్తుల తయారీ (ఆర్వీఎం) ఆర్డర్లపై సందిగ్ధం నెలకొన్నది. గత నవంబర్లో రావాల్సిన ఆర్డర్లు ఎన్నికల షెడ్యూలుతో ప్రక్రియ ఆలస్యం కాగా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆర్డర్లు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం 2021 నుంచి రాజీవ్ విద్యామిషన్కు సంబంధించి వస్త్ర ఆర్డర్లు సిరిసిల్లకే ఇవ్వడంతో 15 వేల మంది కార్మికులకు ఉపాధి లభించింది. 18 వేల మరమగ్గాలపై దాదాపు 90 లక్షల మీటర్ల ఉత్పత్తి చేసి మార్చినెలాఖరులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభంతోనే విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందించాల్సి ఉండగా, ఈసారి ఆర్డర్లు వస్తాయా? లేదా? అన్న మీమాంసలో పవర్లూం యజమానులుండగా, ఉపాధిపై నేతన్నల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
పరిశ్రమలో పనిచేసే నేతన్నలకు చేతి నిండా పని కల్పించేందుకు బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్, ఆర్వీఎం వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇచ్చి వారి బతుకులకు భరోసా నిచ్చింది. 25 వేల మరమగ్గాలపై బతుకమ్మ చీరలు, 18 వేల మరమగ్గాలపై ఆర్వీఎం దుస్తులు తయారయ్యేవి. సుమారు 30 వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది. మొత్తంగా కేసీఆర్ సర్కారు రూ.3వేల కోట్ల వస్త్ర ఆర్డర్లు ఇచ్చింది. అప్పటి ప్రభుత్వంలో చేనేత జౌళిశాఖ మంత్రిగా కేటీఆర్ ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. 2021 సంవత్సరం నుంచి వరుసగా వస్త్ర ఆర్డర్లు ఇస్తూ వచ్చింది. ఏప్రిల్లో కోటి చీరల బతుకమ్మ ఆర్డర్లు ఇచ్చేది. తయారీ లక్ష్యం సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
నవంబర్లో ఆర్వీఎం విద్యార్థుల యూనిఫాంల తయారీ ఆర్డర్లు వచ్చేది. నవంబర్లో ఉత్పత్తులు ప్రారంభించి మార్చికల్లా లక్ష్యాన్ని పూర్తి చేసేది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యాశాఖ విద్యార్థులకు దుస్తులు కుట్టించి అన్ని పాఠశాలలకు సరఫరా చేసేది. అయితే, ఈ నవంబర్లో ఎన్నికలు రావడంతో ఆర్డర్ల ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు ఆర్డర్లు రాలేదు. పైగా ఉత్పత్తి చేయాల్సిన మార్చి గడువు మరో రెండు నెలలే ఉంది. 90లక్షల మీటర్లు ఆరు నెలల్లో తయారు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు దీనిపై అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అటు వస్త్ర ఉత్పత్తిదారులు, ఇటు కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆర్డర్లు వస్తాయా? రావా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు సమయానికి యూనిఫాంలు ఎలా అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇచ్చే వస్త్ర ఆర్డర్లపైనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నడుస్తున్నది. మూడంచెల వ్యవస్థ కలిగిన ఈ పరిశ్రమలో యజమానులు, ఆసాములు, కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. పదేండ్ల కింద ఉమ్మడి ప్రభుత్వంలో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. వందల సంఖ్యలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆకలి చావులకు గురయ్యారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమకు చేయూతనిచ్చి కార్మికులకు అండగా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా నడిచిన పరిశ్రమ ప్రభుత్వం మారడంతో పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఆర్వీఎం ఆర్డర్లు 2021 సంవత్సరంలో 130.91 లక్షల మీటర్లు, 2022 లో 98.24 లక్షల మీటర్లు, 2023లో 89.11 లక్షల మీటర్ల ఆర్డర్లు ఇచ్చింది. కాగా, రెండు నెలల కిందటే సర్కారు నుంచి రావాల్సిన ఆర్డర్లు రాకపోవడంతో కొన్ని సాంచాలు బంద్పడ్డాయి. పాలిస్టర్ వస్ర్తాలు తయారు చేస్తున్నప్పటికీ, మీటరుకు రూపాయి నష్టం రావడంతో యజమానులు బంద్పెట్టినట్లు చెబుతున్నారు. అసలు ఆర్డర్లు వస్తాయా? రావా? అన్న ఆందోళన పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. మూడు రోజులుగా టెక్స్టైల్స్ పార్కులో యజమానులు పరిశ్రమలు బంద్ పెట్టారు. సొంతంగా తయారు చేసిన వస్ర్తాలకు గిరాకీ లేకపోవడం, నిలువలు పేరుకు పోవడం వల్ల యూనిట్లు బంద్ పెట్టారు. వెంటనే ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.