సిరిసిల్ల, నవంబర్ 28: అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర పొందాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. వరి కోతలు పూర్తయిన తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని వారు కోరుతున్నారు. తమ సూచనలు పాటించి ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి 1,960, సాధారణ రకానికి 1,940 మద్దతు ధర పొందాలని వారు సూచిస్తున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
ఒక రకం ధాన్యాన్ని మరో రకం ధాన్యంతో కలుపకూడదు.
కోసిన వెంటనే ధాన్యాన్ని ఆరబెట్టాలి. లేకపోతే గింజ రంగు మారి నాణ్యత కోల్పోతుంది. పూర్తిగా ఆరబెట్టిన తర్వాత కేంద్రాలకు తీసుకురావాలి.
ధాన్యంలో రాళ్లు, మట్టి పెల్లలు కలువకుండా చూడాలి.
తాలు, పొల్లు, చెత్తా చెదారం లేకుండా తూర్పార పట్టాలి.
నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎలుకలు పాడు చేయకుండా బస్తాల మధ్యన జింక్ సల్ఫేట్ మాత్రలు, పురుగుల నివారణకు లీటర్ నీటికి ఐదు మిల్లీలీటర్ల మలాథియాన్ మందును బస్తాలపై పిచికారీ చేయాలి.
ధాన్యం తేమ తగ్గాకే బస్తాల్లో నింపి లాట్గా వేయాలి.
కిలో ధాన్యాన్ని శాంపిల్ కింద పరిశీలన కోసం కేంద్రాల నిర్వాహకుల వద్దకు తీసుకెళ్లి నాణ్యత పరీక్షలు చూపించి తగిన సలహాలు పొందాలి.
శాంపిల్ తీసుకున్న అధికారి నాణ్యతకు ఆమోదం తెలిపిన తర్వాతే కేంద్రాలకు ధాన్యాన్ని తరలించాలి.
సంబంధిత భూమి పత్రాలను కొనుగోలు కేంద్ర నిర్వాహకుడికి అప్పగించాలి.
ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నంబర్ను తీసుకెళ్తే అక్కడి అధికారులు ఎంట్రీ చేసి ఓటీపీ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు
దళారులు, మధ్యవర్తులు కమిషన్ ఏజెంట్ల ప్రమేయం లేకుండా నివారించేందుకు నేరుగా ప్రభుత్వం మద్దతు ధర వర్తింపజేస్తున్నది
ధాన్యం నాణ్యతా ప్రమాణాలపై ఏమైనా సందేహాలుంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి, ఏఈవోలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.