నగరంలో వాకింగ్ ట్రాక్ల ఏర్పాటుకు ప్రాధాన్యం
ఇప్పటికే తొమ్మిదిచోట్ల అందుబాటులోకి నడక దారులు
మిగిలిన చోట్ల త్వరలోనే పూర్తికి చర్యలు
కార్పొరేషన్, డిసెంబర్ 26: నగర ప్రజల ఆరోగ్యంపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మంజూరు చేస్తున్న పట్టణ ప్రగతి నిధులతో నగర వాసుల కోసం మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నది. ఈ క్రమంలో నగర పరిధిలో పార్కులు, ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్ల అభివృద్ధి, మోడ్రన్ టాయ్లెట్స్ నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. ఇందులో భాగంగా నగరంలో దాదాపు 9 వాకింగ్ ట్రాక్స్ అందుబాటులోకి రాగా, మిగతా చోట్ల పనులు త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.
వాకర్స్కు అనుకూలంగా
కరోనాతో ప్రజల్లో ఆరోగ్య సంరక్షణ, రోగ నిరోధక శక్తి పెంచుకునే విషయంలో అవగాహన పెరిగింది. ఈ క్రమంలో నగరంలో ఉదయం, సాయంత్రం మైదానాల్లో నడిచే వారు, వ్యాయామం చేసే వారి సంఖ్య కూడా ఎక్కువైంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ అధికారులు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. నగరపాలక సంస్థకు వచ్చిన పట్టణ ప్రగతి నిధుల్లోంచి రూ. 80 లక్షలతో తొమ్మిది ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్స్ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే నగరంలోని జ్యోతి బాఫూలే మైదానంలో సింథటిక్ ట్రాక్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే, ఎస్ఆర్ఆర్ కళాశాల, మార్క్ఫెడ్ మైదానం, మహిళా డిగ్రీ కళాశాల, సప్తగిరికాలనీ ప్రభుత్వ స్కూల్, కలెక్టరేట్లోని హెలిప్యాడ్, హౌసింగ్బోర్డు కాలనీలో, గిద్దెపెరుమాండ్ల ఆలయ సమీపంలో, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, శాతవాహన యూనివర్సిటీ ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్స్ను పూర్తి చేశారు. పలు చోట్ల పనులు కొనసాగుతున్నాయి.
ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం
నగరంలో ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నం. వాకింగ్ ట్రాక్స్ అన్నింటిని త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తాం. పలు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు జాప్యం చేయడంతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాం. ఇప్పటికే తొమ్మిది వాకింగ్ ట్రాక్స్ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నం.
-వై సునీల్రావు, మేయర్