విద్యానగర్, డిసెంబర్ 26: నగరంలోని మెడికవర్ దవాఖానలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మొదటి సారిగా మోడిఫ్లైడ్ బెంటాల్స్ ప్రొసీజర్, కొరొనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ చేసినట్లు దవాఖాన కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ సదాశివ్ బీ తమగొండ తెలిపారు. దవాఖానలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జగిత్యాలకు చెందిన నాంపెల్లి రేవతి (56)కి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు చికిత్స కోసం పలు కార్పొరేట్ దవాఖానలకు తీసుకెళ్లినట్లు తెలిపారు. గుండెలో ఒక వాల్వు మార్చాల్సి ఉండడంతో ఖర్చు ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు. దీంతో వారు మెడికవర్ దవాఖానకు తీసుకురాగా, పరీక్షలు చేయగా ప్రధాన నాళం ఉబ్బిపోయినట్లు గుర్తించినట్లు తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే చిట్లిపోయే ప్రమాదం ఉందని పేషెంట్ కుటుంబసభ్యులకు వివరించినట్లు చెప్పారు. దవాఖానలో అడ్మిట్ చేయగా, నాలుగు రోజుల క్రితం వైద్యుల బృందంతో కలిసి శస్త్ర చికిత్స చేసినట్లు వెల్లడించారు. అయోర్టిక్ గ్రాఫ్ట్ (కృత్తిమ రక్తనాళ అమరిక), వాల్వు రిప్లేస్మెంట్, బైపాస్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో శస్త్ర చికిత్స పూర్తి చేసినట్లు తెలిపారు. రేవతి పూర్తి స్థాయిలో కోలుకోగా ఆదివారం డిశ్చార్జి చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో డాక్టర్ కిరణ్ కొండపాక, డాక్టర్ బీ వినయ్కుమార్, డాక్టర్ సుస్మిత, డాక్టర్ ప్రత్యూష, దవాఖాన అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ స్రవంతి పాల్గొన్నారు.