దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్
హుజూరాబాద్టౌన్, డిసెంబర్ 26: సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని, ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హెచ్చరించారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిజం ముసుగులో చిన్నపిల్లల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. మల్లన్న నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే తరిమి కొడుతారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులపై తీన్మార్ మల్లన్న ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సత్తా ఉంటే రాజకీయంగా ఎదురోవాలే తప్పా వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండీ రియాజ్, దళిత బంధు పథకం మండల కో-ఆర్డినేటర్ మొలుగూరి ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు అంబాల కుమారస్వామి, ఆకునూరి మహేందర్, నరుకుడు మధుకర్, మోరే మధు, దాట్ల దేవేందర్, వెంకటనారాయణ పాల్గొన్నారు.