హుజూరాబాద్/హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 26: హుజూరాబాద్లో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుతో రజకుల ఆత్మగౌరవ పోరాటం ఫలించింది. తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు కులస్తులు కొన్నేళ్లుగా అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద పదవులు అనుభవించిన నేతకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. పైగా విగ్రహం ఏర్పాటుతో ఏమొస్తుందని ఈసడించుకున్నారు. ఈ క్రమంలో ఆ పెద్దనేత రాజీనామాతో ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రజకులు మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ దృష్టికి తీసుకువెళ్లడంతో వెనువెంటనే స్పందించారు. యుద్ధప్రాతిపదికన స్థలం కేటాయించి పనులు మొదలు పెట్టి పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన ఎదుట జమ్మికుంట రోడ్డులో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఇందుకనుగుణంగా ఐలమ్మ 126వ జయంతికి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రజకారులతో ఆమె చేసిన పోరాటాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయని మంత్రులు కొనియాడారు. అనంతరం సైదాపూర్ రోడ్డులోని బోర్నపల్లి గ్రామ కాకతీయ కెనాల్ వద్ద రజక ఆత్మగౌరవ సంఘ భవనానికి భూమిపూజ చేశారు. భవనానికి ప్రభుత్వం ఎకరం స్థలం, నిర్మాణానికి రూ.కోటి నిధులు కేటాయించింది. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంపీపీ ఇరుమల్ల రాణి, నాయకుడు పాడి కౌశిక్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు కళ్లెపెల్లి రమాదేవి, తాళ్లపెల్లి శ్రీనివాస్, నాయకులు కొలిపాక శ్రీనివాస్, కొండపాక శ్రీనివాస్, సుంకరి రాజమౌళి, నల్ల బాలరాజు, కొండపాక పవన్, ఆలేటి శ్రీరాం, నిమ్మటూరి సాయికృష్ణ, సాంబయ్య, సదానందం, వెంకటేశ్వర్లు, రాజు, రాకేశ్, కొలిపాక రవి తదితరులున్నారు.