పెద్దపల్లి జంక్షన్, అక్టోబర్ 25: ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రణాళికపై సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలు చేయడం లేదని, యాసంగిలో రైతులు వరి సాగు చేస్తే తీవ్రంగా నష్టపోయ్యే ప్రమాదముందని వివరించారు. సీఎం సూచనల మేరకు ఏవోలు గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికలను తయారు చేయాలని ఆదేశించారు. ఎండాకాలం సీజన్లో వరికి బదులుగా శనగ, వేరు శనగ, పొద్దుతిరుగుడు, కందులు, పెసర తదితర పంటలు పండించేలా రైతులకు అవగాహన కలిపించాలని సూచించారు. భూముల లక్షణాలకు అనుగుణంగా పంటలు పండించాలన్నారు. అలాగే కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగుపై ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రత్నామ్నాయ పంటల విత్తనాలు అందుబాటులో ఉండేలా డీలర్లతో ప్రత్యే క సమావేశం నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27, 28, 29న తేదీల్లో రైతు వేదికల్లో ప్రత్నామ్నాయ పంటల సాగు ఆవశ్యకతను రైతులకు వివరించాలని తెలిపారు. యాసంగిలో రైతులు తమ సొంత పూచీకత్తుతో మాత్రమే వరి సాగు చేయాలని, ఎఫ్సీఐ జారీ చేసిన సూచనల మేరకు ప్రభుత్వం వరిని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఏవో తిరుమల్ ప్రసాద్, జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి జగన్మోహన్రెడ్డి, వ్యవసాయాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.