ఛీ.. ఛీ.. ఇదేనా మీ పార్టీ సంస్కారం?
ఇదేనా కాషాయ నేతల హిందూ ధర్మం.. సంస్కారం?
జర్నలిజం ముసుగులో నీచపు మాటలా?
టీఆర్ఎస్ను ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలా?
కుటుంబసభ్యులు, పిల్లలపై విద్వేషపు వ్యాఖ్యలా?
బీజేపీ తీరుపై మండిపడుతున్న జిల్లావాసులు
బాడీషేమింగ్ చేసిన తీన్మార్ మల్లన్నపై ఆగ్రహజ్వాలలు
తీవ్రంగా ఖండించిన టీఆర్ఎస్ నేతలు
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలపై కన్నెర్ర
సిరిసిల్ల జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు
కరీంనగర్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : నోరు తెరిస్తే హిందూ ధర్మం, సంస్కారం అని చెప్పే బీజేపీ నాయకులు.. నీచరాజకీయాలకు దిగడం దుమారం రేపుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా లేక ఆయనను, ఆయన కుటుంబాన్ని, చివరకు పిల్లలనూ లక్ష్యంగా చేసుకోవడం కాషాయ పార్టీ దిగజారుడుతనానికి అద్దంపడుతున్నది. ఇటీవలే బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ చానల్లో మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అభ్యంతరకరంగా పోల్ పెట్టడంపై టీఆర్ఎస్ నేతలు, అభిమానులు, ప్రజలు మండిపడుతున్నారు. చిన్న పిల్లాడికి, రాజకీయాలకు సంబంధం ఏంటనేది వారే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంగిత జ్ఞానం, నైతిక విలువలు లేకుండా తప్పుడు కూతలు కూస్తున్న మల్లన్న తీరుమార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. అనేక ఆరోపణలతో 75 రోజులు జైల్లో గడిపి వచ్చిన ఆయనను బీజేపీలో ఎలా చేర్చకున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్యప్రచారాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని గంభీరావుపేట, ముస్తాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సెంటిమెంట్, మతం పేరిట రెచ్చగొట్టడం, సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని.. అనేక నాటకాలకు తెరలేపడం కొందరు బీజేపీ నాయకులకు అలవాటే. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర నాయకులను టార్గెట్ చేయడం.. వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం వారికి కొత్తేమీకాదు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ను, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నీచరాజకీయాలకు దిగుతూనే ఉన్నారు. ఇటీవల మరీ దిగజారి ఇంట్లోని కుటుంబసభ్యులు, పిల్లలపైనా విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. జర్నలిజం ముసుగులో తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) రెచ్చిపోతున్నాడు. మీడియా ముసుగులో టీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు. పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబమే లక్ష్యంగా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు. రాష్ర్టానికి ముఖ్యమంత్రి అని కనీస సోయి లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరింత రెచ్చిపోయి తన యూట్యూబ్ చానల్లో మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అభ్యంతరకరంగా పోస్ట్ పెట్టాడు. రాజకీయాలకు సంబంధం లేని చిన్న పిల్లాడిని వివాదాల్లోకి లాగేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించడంపై టీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. హిమాన్షుకు, రాజకీయాలకు సంబంధం ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికే 75 రోజులు జైలు జీవితం గడిపి వచ్చిన మల్లన్నను బీజేపీలో చేర్చుకొని సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అనునిత్యం హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న కమలనాథులు అసత్య ప్రచారాలు చేసే వ్యక్తిని పార్టీలో ఎందుకు చేర్చుకున్నారో జవాబు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
తీన్మార్ మల్లన్న ఫ్లెక్సీకి చెప్పుల దండలు
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ టీఆర్ఎస్, అనుబంధ సంఘాల నాయకులు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మల్లన్న ఫ్లెక్సీకి చెప్పుల దండలు వేసి, చెప్పుతో కొట్టి నిరసన తెలిపారు. సిరిసిల్లలోని అంబేద్కర్చౌరస్తాలో టీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్కుమార్, తంగళ్లపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్వై జిల్లా నేత సిలువేరి చిరంజీవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నాడని, అమాయకులను యూట్యూబ్ చానల్ పేరుతో మోసం చేస్తున్నాడని ఆరోపించారు. మల్లన్న చేస్తున్న బ్రోకర్ రాజకీయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. అక్రమార్జనే ధ్యేయంగా చానల్ను అడ్డు పెట్టుకుని అనేక మందిని బెదిరింపులకు గురిచేసి డబ్బులు వసూలు చేశాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు కత్తెర వరుణ్, మునీర్, షేక్ సిఖిందర్, గడ్డం కిరణ్, జానీ, పంగ మధు, సురేశ్, వసీమ్, అక్కనపల్లి సుమన్, చోటు, అజ్జు, కూసం శ్రీధర్, ఫిరోజ్, భరత్, సిలువేరి చిరంజీవి, నల్లగొండ ప్రవీణ్, ఎండీ హమీద్, నులుగొండ శ్రీనివాస్, నేరెల్ల అనిల్గౌడ్, అమర్రావు, భీమని అరవింద్, ఎగుర్ల కనకరాజు, శేఖర్, మధు, పరశురాములు, రాజు పాల్గొన్నారు.
మల్లన్నపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) పై గంభీరావుపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శనివారం టీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు ఫిర్యాదు చేశారు. ముస్తాబాద్ పోలీసు స్టేషన్లో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎద్దడి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్టంపల్లి భిక్షపతి, దోసల శంకర్, వెంకటేశ్గౌడ్, రాకేశ్, శేఖర్గౌడ్, సాయి, పరశురాములు, బైతి నవీన్, నందు, భరత్, చేవుల మల్లేశ్యాదవ్ పాల్గొన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేకనే..
తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న అధికార పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేకే బీజేపీ నేతలు ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ అభిమానులు, నెటిజన్లు, సామాన్యులు మండిపడుతున్నారు. అందుకే అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. వ్యక్తులను టార్గెట్ చేయడం ద్వారా ఎంత నీచానికి దిగజారుగుతున్నారో మంత్రి కేటీఆర్ కుమారుడిపై ట్విట్టర్లో చేసిన పోస్టును నిదర్శనంగా చెప్పుకొంటున్నారు. అనేక నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, వ్యక్తిగతంగా విమర్శించే వాళ్లను, ఎలాంటి నైతికత లేని వాళ్లను కాషాయ పార్టీలో చేర్చుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. జర్నలిజం ముసుగులో టీఆర్ఎస్పై, కేసీఆర్ కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేసినందుకు, దందాల్లో తలదూర్చినందుకు పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టిన మల్లన్నను బీజేపీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. తన ఉనికి కాపాడుకునేందుకు తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరాడని, ఇప్పుడు రెచ్చిపోయి చిన్న పిల్లలను కూడా టార్గెట్ చేస్తున్నాడని మండిపడుతున్నారు. మల్లన్న తన విధానాన్ని మార్చుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
హిందూ సమాజం సిగ్గు పడే పరిస్థితి..
తీన్మార్ మల్లన్నకు కండ కావరం ఎక్కువ. మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తి గత ప్రతిష్టను పెంచుకునేందుకే కేసీఆర్పై ఆయన కుటుంబంపై లేని పోని ఆరోపణలు చేస్తున్నాడు. ఇలాంటి ఆటవికున్ని, అనాగరికున్ని చేర్చుకునే ముందు బీజేపీ నాయకులకు బుద్ధి ఉండాలి. బీజేపీలోని హిందూత్వ భావాలను మత బ్యూటీని కలుషితం చేస్తున్న ఇలాంటి వారిని పార్టీ నుంచి బయటికి పంపించాలి. ఆ పార్టీకి, అటు ప్రజలకు ఇలాంటి వారితో ఎలాంటి ఉపయోగం ఉండదు. నోరు తెరిస్తే హిందూత్వం, సంస్కారం గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేవాడు చేస్తున్న అనాగరిక చర్యలకు ఏమని సమాధానం చెబుతారు. ఇతని పైత్యపు, బరితెగింపు మాటలతో హిందూ సమాజం సిగ్గు పడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి వ్యక్తులను పార్టీ నుంచి బహిష్కరించాలి. లేదంటే ప్రజల చేతిలో తగిన గుణపాఠం తప్పదు.
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే నవీన్ ప్రతిపక్ష పార్టీల ముసుగులో మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుపై విమర్శలు చేస్తున్నాడు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అతడిని చట్టపరంగా శిక్షించాలి. డైనమిక్ లీడర్గా పేరు పొందిన కేటీఆర్ కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా మాట్లాడడం మల్లన్నకు తగదు.
మానకపోతే గుణపాఠం తప్పదు.
తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ఇలా రాజకీయాలు చేస్తే మేమూ చేతులు కట్టుకొని కూర్చోం. అలాంటి వారికి తగిన రీతిలో గుణపాఠం చెబుతాం. రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు రాజకీయాలు మాట్లాడాలి. కానీ, కుటుంబ సభ్యుల గురించి ఎందుకు మాట్లాడడం. చింతపండు నవీన్ ఇది పద్ధతి కాదు. ఇలాంటి విధానాలను మానుకోవాలి. లేకపోతే నీకు ఎలా బుద్ది చెప్పాలో మా టీఆర్ఎస్ కార్యకర్తలకు తెలుసు. అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితక్కపై తీన్మార్ మల్లన్న రోజూ విమర్శలు చేస్తూ నీతి మాలిన రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ఇకపై అభ్యంతరకర వాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. తగిన గుణపాఠం చెప్తాం.
-పీట్ల గోపాల్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి (పెద్దపల్లి)