కమాన్చౌరస్తా, డిసెంబర్ 25 : క్రిస్మస్ వేడుకలను ఉమ్మడి జిల్లాలో శనివారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో కన్నులపండువగా జరుపుకున్నారు. ప్రముఖ చర్చిలైన సీ ఎస్ఐ వెస్లీ క్యాథడ్రల్ చర్చి, సీఎస్ఐ సెంటినరీ వెస్లీ చర్చి, లూర్దు మాత చర్చి, సెయింట్ మార్క్స్ చర్చిలతోపాటు వివిధ కాలనీల్లోని చర్చిల్లో ఏసును స్తుతిస్తూ ప్రార్థనలు చేశారు. ఏసు బోధనలతో శాంతియుత జీవనం గడపాలని పాస్టర్లు సూచించారు. కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలోని సెంటినరీ వెస్లీ చర్చిలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని సీఎస్ఐ చర్చిలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, మంథని పట్టణంలోని సీయోను ప్రార్థనా మందిరంలో జరిగిన వేడుకలకు జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో జడ్పీ చైర్పర్సన్ అరుణ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
మతసామరస్మానికి ప్రతీకగా వేడుకలు : మంత్రి గంగుల
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కుల మతాలకతీతంగా అతీతంగా జరుపుకునే పండగ క్రిస్మస్ అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగరం క్రిస్టియన్ కాలనీలోని సెంటినరీ వెస్లీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఆయన మేయర్ సునీల్ రావుతో కలిసి హాజరై, క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని కులాలు, మతాలు ప్రజలు జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగని అన్నారు. ప్ర పంచం శాంతియుతంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి ఏసుప్రభువని కొనియాడారు. అన్ని మతాల పండుగలకు సమాన ప్రా ధాన్యత కల్పిస్తూ… ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. భావితరాల అభ్యున్నతికి అందరూ కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు. కరీంనగర్లో శాంతి భద్రతలు బాగున్నందున నూతన కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. అన్ని పండుగలు సంతోషంగా జరుపుకునేలా భగవంతుడు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వాల రమణారావు, తోట రాములు, బండారి వేణు, క్రైస్తవులు పాల్గొన్నారు.