ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
ఇబ్రహీంపట్నం సహకార సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 25: కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. శనివారం మండలకేంద్రంలో రూ.30లక్షల వ్యయంతో చేపట్టనున్న సహకార సంఘ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే మాల సంఘ భవనానికి భూమిపూజ చేసి, మాదిగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కుల సంఘాల అభివృద్ధికి తనవంతు తోడ్పాటునందిస్తున్నానని చెప్పారు. గతంలో మాదిగ సంఘ భవనానికి రూ.6లక్షలు మంజూరు చేయగా, మరో రూ.3లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మాల సంఘ భవనానికి రూ.8లక్షల మంజూరుకు కృషి చేస్తానన్నారు. గ్రామ శివారులో స్టేడియం నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. స్టేడియం నిర్మాణానికి సంబంధిత మంత్రితో మాట్లాడి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. స్టేడియం వద్ద క్రీడాకారులతో మాట్లాడుతూ, తాను కూడా చిన్నతనంలో కబడ్డీ ఆడానని గుర్తు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కంఠం భారతి, వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, సర్పంచ్ నేమూరి లత, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.