అనాదిగా పల్లె జీవనంలో ఒక్కటై పోయి కుటుంబాలకు జీవనాధారమైన పశుపోషణ కాలక్రమేణా మాయమైతున్నది. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పశుపక్ష్యాదుల పెంపకం మరుగునపడుతున్నది. కానీ, సుల్తానాబాద్ మండలం తొగర్రాయికి చెందిన బొంగోని నర్సయ్యగౌడ్-సుగుణ దంపతులు పాడినే నమ్ముకొని బతుకున్నారు. బర్రెలు, ఆవుల పెంపకాన్ని బతుకుదెరువుగా మలుచుకొన్నారు. ఒక్కటికాదు రెండు కాదు 25 ఏండ్లుగా పాడిపైనే ఆధారపడి దర్జాగా బతుకుతున్నారు.
– సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 6
నేను ఒకప్పుడు కల్లు గీత వృత్తి చేసుకుంటూ బతికేటోన్ని. అయితే అనారోగ్య సమస్యలతో 25 ఏండ్ల కింద ఆ పని మానేసిన. ఇల్లు గడుసుడు ఎట్లా అని మస్తు మందిపడ్డ. మొదట్ల ఒక బర్రెను కొన్న. మంచిగ లాభం అనిపించి మళ్లో రెండు కొన్న. ఇప్పుడు అవి 20కి పెరిగినయి. రోజుకు 25 లీటర్ల పాలు ఇస్తున్నయి. లీటర్కు 60 రూపాయల చొప్పున లెక్కేసిన నెలకు 45 వేల దాకా ఆదాయం వస్తున్నది. ఖర్చులన్నీ పోను 25వేలు మిగులుతున్నయి. వాటిని మంచిగా కాపాడుకుంటే మంచిగా పాలిస్తయి. నెలకు మూడు క్వింటాళ్ల తవుడు, ఆర్నెల్ల కోసారి గడ్డి కొనుగోలు చేస్తున్న. మేం ఇప్పుడు రంది లేకుండ బతుకుతున్నం.
సుల్తానాబాద్ మండలం తొగర్రాయికి చెందిన నర్సయ్యగౌడ్ తన కుల వృత్తి కల్లు గీసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే కాలక్రమేణా వచ్చిన అనారోగ్య సమస్యల వల్ల 25 ఏండ్ల క్రితం కల్లుగీత వృత్తి మానేశాడు. చెట్టు ఎక్కి కల్లు గీసే పరిస్థితి లేక కుటుంబ పోషణ కోసం తన భార్య సుగుణ సహకారంతో బర్ల పెంపకం చేపట్టాడు. మొదట ఒక బర్రెను కొన్నాడు. రోజూ రెండు లీటర్ల పాలను గ్రామంలోని పాల కేంద్రంలో పోసేవాడు. ఏడాది తర్వాత మరో రెండు బర్రెలను కొనుగోలు చేశాడు.
రెండేళ్లలో పశువుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 20కి చేరింది. 18 బర్రెలు, 4 దూడలు, 17 చిన్న దూడలు, 2 ఆవులు ఉన్నాయి. వాటి విలువ 12 లక్షల దాకా ఉంటుందని నర్సయ్యగౌడ్ చెబుతున్నాడు. ఇంటి వద్దే కొట్టం ఏర్పాటు చేసి పశువులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ప్రస్తుతం రోజుకు రెండు పూటలకు కలిపి ఐదు బర్లు బర్రెలకు 25 లీటర్ల పాలు ఇస్తుండగా, అందులో పది లీటర్ల పాలను 20 ఏండ్లుగా సుల్తానాబాద్ పట్టణంలోని ఓ స్వీట్ హౌజ్లో పోస్తున్నాడు. మిగతా పాలను వాడకందారులకు అమ్ముతున్నాడు.