పంచాయతీల్లో మెరుగుపడుతున్న వసతులు
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారం మండలంలో పర్యటన
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
ధర్మారం, డిసెంబర్ 24: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, పల్లెప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారాయని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మారం మండలంలో మంత్రి ఈశ్వర్ శుక్రవారం పర్యటించారు. పీఎంజీఎస్వై నిధులు రూ.3.56 కోట్లతో బొట్లవనపర్తి శివారు నుంచి కానంపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి పైడిచింతలపల్లి, కానంపల్లి, బొట్లవనపర్తి గ్రామాల్లో ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే ఖిలావనపర్తి నుంచి జూలపల్లి మండలం కుమ్మరికుంట వరకు రూ.3.34 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి ఖిలావనపర్తి వద్ద శంకుస్థాపన చేశారు. కానంపల్లి, బొట్లవనపర్తిలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాలను ప్రారంభించారు. బొట్లవనపర్తి గ్రామ సర్పంచ్ రెడపాక ప్రమీలా శ్రీనివాస్తో పాటు మాజీ సర్పంచులు వాలుక రామయ్య, తీగెల భాగ్యలక్ష్మీ రాజేశంతో పాటు సుమారు 30 మంది కాంగ్రెస్ను వీడి మంత్రి ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా బొట్లవనపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. పల్లెప్రగతిలో భాగంగా నెలనెలా పంచాయతీలకు నిధులు ఇస్తుండడంతో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగు పడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా బొట్లవనపర్తి నుంచి పైడిచింతలపల్లి వరకు, ఖిలావనపర్తి నుంచి కుమ్మరికుంట వరకు సరైన దారిలేక రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని పీఎంజీఎస్వై ద్వారా రూ.6.90 కోట్ల నిధులు మంజూరు చేయించి బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు.
నేడు రైతులు సాఫీగా పొలాల వద్దకు వెళ్లేందుకు మార్గం సుగమం కానుందన్నారు. బొట్లవనపర్తి గ్రామం అభివృద్ధి కోసం సర్పంచ్ రెడపాక ప్రమీల ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీని వీడి 30 మందికి పైగా నాయకులు టీఆర్ ఎస్లో చేరడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ఈ గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమానికి సర్పంచ్ రెడపాక ప్రమీల అధ్యక్షత వహించగా, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, సర్పంచులు సాగంటి తార, బద్దం వెంకటమ్మ, గుర్రం మనీషా, ఇమ్మడిశెట్టి కొమురయ్య, ఎంపీటీసీ మోతె సుజాత, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, ఎంపీడీవో జయశీల, తహసీల్దార్ వెంకట లక్ష్మి, పీఆర్ డీఈఈ శంకరయ్య, ఉప సర్పంచులు కీసర స్వరూపారాణి, రాపెల్లి శ్రీకాంత్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.