తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్24: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తున్నది. రైతులకు ఇబ్బందులు కలుగకుండాప్రతీ పసలుకు రైతుబంధు ఇస్తుండగా, ఈ సీజన్కు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నది. అలాగే ప్రస్తుతం కొత్తగా భూములు కొనుగోలు చేసుకున్న రైతుల నుంచి రైతుబంధు పెట్టుబడి పథకానికి దరఖాస్తులను వ్యవసాయాధికారులు స్వీకరిస్తున్నారు.
స్వీకరిస్తున్న దరఖాస్తులు
ప్రభుత్వాదేశాలతో వ్యవసాయాధికారులు నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులనుంచి రైతుబంధు లబ్ధి కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈనెల 10 కంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు తమ ఆధార్ కార్డు, పాస్ బుక్, బ్యాంకు ఖాతా బుక్కు, అప్లికేషన్ ఫారంతో క్లస్టర్ పరిధిలోని ఏఈవోకు అందజేయాలని కోరుతున్నారు.
మండలంలో 11662 రైతులు..
తిమ్మాపూర్ మండలంలో రైతులు 11,662 మంది ఉన్నారు. ఇందులో 11,043 మంది రైతులు ఇప్పటివరకు రైతుబంధు లబ్ధి పొందుతున్నారు. గతంలో వ్యవసాయాధికారులకు భూమి వివరాలు అందజేయని వారు, డిసెంబర్10 కంటే ముందు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు మొత్తం 496 మంది ఉన్నారు. ప్రస్తుతం మండలంలోని అన్ని క్లస్టర్లలో కలిసి 496 మంది రైతులు తమ వివరాలను అందజేయాల్సి ఉంది. దీని కోసం వ్యవసాయ విస్తరణాధికారులు వారి క్లస్టర్ల పరిధిలోని రైతువేదికల్లో రోజంతా నిమగ్నమై ఉంటున్నారు.
ఈనెలలో రైతుబంధు..
ఈనెలాఖరులోపు రైతు బంధును నేరుగా రైతుల ఖాతా లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం యాసంగిలో పంటల సాగు కోసం పెట్టుబడికి ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. రైతుబంధు రాబోతుందని చాలా మంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెట్టుబడి కోసం ఇబ్బందులు తప్పే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెలాఖరులోపు ఇవ్వాలి
ఈనెల10 కంటే ముందుగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు మాత్రమే రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి. గతంలో రైతుబంధు వస్తున్న రైతులు చేసుకోనవసరం లేదు. రైతులు భూమి పాస్బుక్కు, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సులతో పాటు దరఖాస్తు ఫారాలు అందజేయాలి.
-జే సురేందర్, ఏవో, తిమ్మాపూర్