సీఎం కేసీఆర్ అన్ని విధాలా ఆదుకుంటున్నరు
జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ
జమ్మికుంటలో కానుకల పంపిణీ
జమ్మికుంట, డిసెంబర్ 24: రాష్ట్రంలో క్రైస్తవుల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నదని, సీఎం కేసీఆర్ అన్ని విధాలా ఆదుకుంటున్నారని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. పట్టణంలోని ‘సువర్ణ’ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జమ్మికుంట తహసీల్దార్ రాజారెడ్డి ఆధ్వర్యంలో జమ్మికుంట, వీణవంక మండలాల క్రైస్తవులకు శుక్రవారం ప్రభుత్వం తరఫున కానుకలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, క్రీస్తు జీవితం ఆదర్శనీయమని, క్రిస్మస్ లోకానికి శుభదినమని తెలిపారు. ప్రార్థనా మందిరాలకు స్థలాలు, నిధులు మంజూరు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్ని కులాలకు, మతాలకు స్వేచ్ఛ ఉందని చెప్పారు. స్వరాష్ట్రంలో పండుగలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నదని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దుస్తుల పంపిణీ, పండుగ సందర్భంగా విందు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, క్రైస్తవుల అభ్యున్నతికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కేక్ కట్ చేసి, క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జమ్మికుంటకు చెందిన 250 మంది, వీణవంక మండలానికి చెందిన 130 మందికి కానుకలు పంపిణీ చేశారు. వీణవంక ఇన్చార్జి తహసీల్దార్ శివ(డీటీ), ఆర్ఐ శేఖర్, కౌన్సిలర్లు రమ, నరేశ్, రాము, శ్రీలత, నాయకుడు దిలీప్, పాస్టర్లు సత్యరాజ్, టీ జాషువ, రవీందర్, ఆనందం, స్వామిదాసు, రమేశ్, మౌనిక, వెంకటేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.