యాసంగిలో వరి ధాన్యం కొనమని కేంద్రం స్పష్టం చేసింది
ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలి
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష
గంగాధర, డిసెంబర్ 24: గ్రామాల్లో పంటల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. మండలంలోని బూరుగుపల్లిలో నియోజకవర్గంలోని వ్యవసాయాధికారులు, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్లు, ఆత్మ సభ్యులతో శుక్రవారం ఆయన ఆరుతడి పంటల సాగుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యాసంగిలో కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయమని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదని, వరి వేసే రైతులు సీడ్ కంపెనీలు, మిల్లర్లతో ముందస్తు ఒప్పందం చేసుకోవాలని అధికారులు తెలియజేయాలన్నారు. వరికి బదులు ఇతర పంటలు సాగు చేసేలా వ్యవసాయాధికారులు, ఆర్బీఎస్ కో-ఆర్డినేటర్లు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఆరు నెలల ముందు నుంచే రైతులు వేసే పంటలు, అవసరమైన విత్తనాలు, ఎరువులపై అధికారులు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. నియోజకవర్గంలో పంటల సాగులో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, రాజేశం, ఏడీఏలు రామారావు, భాస్కర్, ఏవోలు రాజు, జ్యోతి, యాస్మిన్, మౌనిక, ప్రణీత, చంద్రదీప్, ఆరు మండలాల ఏఈవోలు పాల్గొన్నారు.